పలాసలో సినీఫక్కీలో దోపిడీ
- BAGADI NARAYANARAO

- Apr 7
- 1 min read
జీఎస్టీ అధికారులమంటూ చొరబడిని ఎనిమిదిమంది
యజమానికి బేడీలు వేసి 750 గ్రామలు బంగారం అపహరణ
వెంకటేశ్వర జ్యూయలరీలో చోరీ
రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్టీమ్

(సత్యంన్యూస్, పలాస)
పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే భగవతి థియేటర్ రోడ్డులోని నిత్యానందనగర్ శ్రీ వెంకటేశ్వర జ్యూయలర్స్లో పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు సినీ ఫక్కీలో బంగారం దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కారులో వచ్చిన నలుగురు జీఎస్టీ అధికారులమంటూ యజమాని కిల్లంశెట్టి రామకృష్ణ కు పరిచయం చేసుకున్నారు. షాపులో తనిఖీలు చేయాలంటూ యజమాని రామకృష్ణ ను బురిడీ కొట్టించారు. రికార్డులు సరిగ్గా లేవని, బంగారం స్టాక్ తనిఖీ చేయాలని బెదిరించారు. షాపులో బంగారాన్ని సీజ్ చేస్తున్నామని, వారి వెంట తెచ్చుకున్న బ్యాగులో నగలను సర్దుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించవద్దని ఖైదీలకు పోలీసులు వేసే బేడీలను రామకృష్ణ చేతులకు వేసి షాపు వెనుక భాగంలో ఉన్న గదిలో ఉంచి బయట నుంచి గడియపెట్టారు. చేతులకు బేడీలు వేసేయడం, గదిలో పెట్టి గడియ వేయడంతో ఏం జరుగుతుందో అర్ధమయ్యే లోపు బ్యాగులో సర్దుకున్న బంగారం అభరణాలతో కారులో ఉడాయించారు. జీఎస్టీ అధికారులమంటూ వచ్చినవారు దొంగలని గుర్తించిన రామకృష్ణ కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు వచ్చి గదిలో బేడీలతో ఉన్న రామకృష్ణ ను తలుపులు తీసి బయటకు తీసుకువచ్చారు. చోరీ జరిగిందని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుండగులు సుమారు 750 గ్రాముల బంగారం దోచుకెళ్లినట్టు రామకృష్ణ చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చోరీ జరిగిన షాపులో సీసీ కెమెరాలను, భగవతి థియేటర్ రోడ్డులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దొంగలు వచ్చి వెళ్లిన మార్గాలను గుర్తించిన పోలీసులు సరిహద్దుల్లో ఉన్న చెక్పోస్టులను అప్రమత్తం చేశారు. అధికారులమంటూ బురిడీ కొట్టించి బంగారం దోచుకువెళ్లిన ఘటనపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ జరిగిన సమయంలో యజమాని రామకృష్ణ ఒక్కరే షాపులో ఉన్నట్టు తెలుస్తుంది. సిబ్బంది ఎవరూ లేని సమయం చూసి దొంగలు చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.






Comments