top of page

పాక్‌ ఉగ్రవాద బాధితం కాదు.. నేస్తం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • May 10
  • 2 min read

అనగనగా ఒక కుటుంబం. అందులో ఇద్దరు అన్నదమ్ముల మధ్య పొరపొచ్ఛాలు రేగాయి. మంచో చెడో.. న్యాయంగానో అన్యాయంగానో.. ఇక కలిసి ఉండలేం అన్న నిర్ణయానికి వచ్చిన ఆ అన్నదమ్ములు విడిపోయారు. తదనుగుణంగా కుటుంబ ఆస్తులను పంచుకున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తమ వాటాకు వచ్చిన ఆస్తులు, అందుబాటులో ఉన్న వనరులు, తమ శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకుని ఆ అన్నదమ్ములు ఎవరికి వారుగా అభివృద్ధి చెందుతారన్నది సహజ ప్రక్రియ. ఇది అందరూ ఊహించగలిగేదే. కానీ భారత్‌ అనే అఖండ కుటుంబంలో హిందూ సోదరులతో కలిసి ఉండలేమంటూ పోరు పెట్టి మరీ బలవంతంగా విడిపోయిన ముస్లిం సోదరులకు చెందిన పాకిస్తాన్‌ చేస్తున్నది ఏమిటి? భారత్‌ నుంచి విడిపోయినప్పటి నుంచీ ఎక్కువ కాలం సైనిక పెత్తనం, నియంతృత్వ పాలనలో మగ్గిపోయి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిన పాకిస్తాన్‌.. తన దాయాది భారత్‌ అన్ని రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతోంది. స్వార్థచింతనతో కుళ్లుకుంటోంది. తనకంటే ఎంతో ఉన్నతంగా ఎదిగిన భారత్‌ను ఎలాగైనా దెబ్బతీయాలని చేయని ప్రయత్నం లేదు. పన్నని పన్నాగం లేదు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ భారత్‌లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అనవసరంగా కయ్యానికి కాలు దువ్వి ఇప్పటికే నాలుగుసార్లు జరిగిన యుద్ధాల్లో భారత్‌ చేతిలో చావుదెబ్బలు తిన్నా పాక్‌ పాలకుల కుటిల బుద్ధి మారడంలేదు. పైగా ముఖాముఖీ యుద్ధంలో భారత్‌ను గెలవలేమని అర్థమై తమ దేశంలోని యువతకు మతచాందసవాదం నూరిపోసి, వారికి సాయుధ శిక్షణ ఇచ్చి, వారిని భారత్‌లోకి అక్రమంగా ప్రవేశపెడుతూ ఉగ్రదాడులు, బాంబు పేలుళ్లతో రక్తపుటేరులు పారిస్తోంది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో విహరిస్తున్న అమాయక హిందూ టూరిస్టులపై పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులు తూటాల వర్షం కురింపించారు. మతం అడిగి, కల్మా చదవమని, ఇంకా అనుమానం తీరక ప్యాంట్లు విప్పించి ముస్లింలు కాని వారిని గుర్తించి మరీ వారి కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్ర ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిశాయి. ప్రపంచవ్యాప్తంగా పాక్‌ ప్రేరిత ఉగ్రవాదంపై నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో అంతర్జాతీయ సమాజం ముందు ఒంటరై.. తలదించుకోవాల్సిన దుస్థితిలో పడిన పాక్‌ మొసలి కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. తమది కూడా ఉగ్రవాద బాధిత దేశమే అంటూ కొత్త రాగం అందుకుని ప్రపంచం దృష్టిని ఏమార్చే కుయుక్తులకు దిగింది. పహల్గాం దాడులకు కారుకులైన ఉగ్రవాదులకు తుదముట్టించేందుకు ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టిన భారత సైనిక దళాలు పాకిస్తాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్లో పాక్‌ నిఘా సంస్థ, సైన్యం పెంచి పోషిస్తున్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో మెరుపుదాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు వంద మంది ఉగ్రవాదులు మరణించారు. ముఖ్యంగా పాకిస్తాన్‌ ప్రధాన భూభాగంలోని బహవల్‌పూర్‌లో ఉన్న లష్కర్‌`ఏ`తోయిబా ప్రధాన కేంద్రంపై జరిపిన దాడిలో దాని అధిపతి మహమ్మద్‌ మసూద్‌ అజర్‌ త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోగా అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సహా 12 మంది మరణించారు. వీరి అంత్యక్రియల ప్రార్థనలకు మసూద్‌ అజర్‌ ప్రధాన అనుచరుల్లో ఒకడైన హఫీజ్‌ అబ్దుల్‌ రవూఫ్‌ నేతృత్వం వహించగా పాకిస్థాన్‌ ఆర్మీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ముంబై బాంబు పేలుళ్లతో సహా అనేక విధ్వంస చర్యలకు మాస్టర్‌ మైండ్‌ అయిన మసూద్‌ అజర్‌ ప్రపంచంలోని మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఒకడు. అతడిని జైల్లో పెట్టినట్లు ఇన్నాళ్లూ పాక్‌ పాలకులు బుకాయిస్తూ వచ్చారు. కానీ భారత్‌ జరిపిన మెరుపు దాడుల్లో ఉగ్రవాద శిబిరంలోని ఆయన ఉన్నట్లు బయటపడిరది. అంతేకాకుండా పాకిస్తాన్‌ ఉగ్రవాద బాధిత దేశం కాదని, దాన్ని పెంచి పోషిస్తున్న దేశమని ప్రపంచానికి మరోమారు వెల్లడైంది. పాకిస్థాన్‌లో ఆర్మీ, ఐఎస్‌ఐ, ఉగ్రవాదం అనేవి వేర్వేరు కావు. ఇవన్నీ పాకిస్థాన్‌ ఆర్మీలో ఒకదానికికొకటి పెనవేసుకున్న శాఖలు. మహమ్మద్‌ మసూద్‌ అజర్‌ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి అతని తలకు 10 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించింది. నిజంగా పాకిస్తాన్‌ ఉగ్రవాద బాధిత దేశమే అయితే మసూద్‌ అజర్‌ను కాపాడే బదులు అమెరికాకు అప్పగించి ఆ 10 మిలియన్లు సొంతం చేసుకుంటే.. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు కాస్తయినా ఉపశమనం కలిగేది కదా!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page