పేకాటకు పోలీస్ బాస్ అడ్డుకట్ట!
- BAGADI NARAYANARAO
- Apr 17
- 3 min read
ఇన్నాళ్లూ గారబందలో పేకాట శిబిరం
శ్రీకాకుళం, నరసన్నపేట వాసుల ఆధ్వర్యంలో నిర్వహణ
చెక్పోస్ట్ పెట్టి నిఘా పటిష్టంతో అక్రమ రవాణాకు చెక్
జిల్లా ఎస్పీ తీరుతో స్థానిక పోలీసుల బెంబేలు
సహకరించలేమని పేకాట నిర్వాహకులకు స్పష్టీకరణ

కొన్నాళ్లుగా మౌనంగా కూర్చున్న పేకాట నిర్వాహకులు ఇప్పుడిప్పుడే పేకముక్కలు కలపడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డుకట్ట పడుతోంది. ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పేకాట శిబిరాల నిర్వహణపై జిల్లా పోలీసు బాస్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో జిల్లాకు చెందిన వీటి నిర్వాహకుల ముందరి కాళ్లకు బంధం పడినట్లయ్యింది. పోలీసుల సహకారంతో ఇన్నాళ్లూ పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న విషయాన్ని గ్రహించిన జిల్లా పోలీసు బాస్ హెచ్చరించడంతో వారంతా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఒడిశాకు చెందినవారు అక్కడ పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలోని శ్రీకాకుళం, నరసన్నపేట ప్రాంతాలకు చెందిన కొందరు ఈ ఏడాది జనవరి 18 వరకు జిల్లా సరిహద్దులో ఉన్న ఒడిశా పరిధిలోని గారబంద వద్ద ప్రత్యేక పేకాట శిబిరాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ బాస్ పోలీసులను రంగంలోకి దించారు. నేరుగా పేకాట శిబిరానికి వెళ్లి అక్కడి నుంచే లైవ్ లోకేషన్ పెట్టాలని పాతపట్నం, మెళియాపుట్టి పోలీసులను ఆదేశించడంతో పేకాట శిబిరాలు మూతపడ్డాయి. అయితే అదే చోట ఒడిశాకు చెందినవారు ఇప్పటికీ శిబిరాలను కొనసాగిస్తున్నారు. గతంలో వారితో కలిసి శిబిరాలు నిర్వహించిన శ్రీకాకుళానికి చెందినవారు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడం విశేషం. దానిపై స్పందించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాతపట్నం సర్కిల్కు కాకుండా కాశీబుగ్గ పోలీసు అధికారులతో రెండు నెలల క్రితం రైడ్ చేయించారు. కానీ రైడ్ జరుగుతుందన్న సమాచారం ముందుగానే లీక్ కావడంతో పేకాటరాయుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ దాడిలో జిల్లాకు చెందిన వారెవరూ చిక్కకపోవడంతో పేకాట నిర్వాహకులంటూ కొందరు ఒడిశా వ్యక్తులను పోలీసులు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే పోలీసు జీపులను గ్రామస్తులు అడ్డుకోవడం, ఉన్నతాధికారుల ఆదేశాలతో వారిని విడిచిపెట్టక తప్పలేదు. అప్పటి వరకు గారబందలో పేకాట ఆడిరచినవారే పోలీసుకు సమాచారం ఇచ్చారని ఒడిశాకు చెందిన వీరి పార్టనర్స్ అనుమానిస్తున్నారు.
చెక్పోస్టులతో అడ్డుకట్ట
అంతకు ముందు వీరంతా కలిసి ఒడిశాలోని సుంకి, బల్లుగాం, పూరీల్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తూ వచ్చారు. తర్వాత అక్కడ నుంచి గారబందకు శిబిరాన్ని తరలించి నెలలో 30 రోజులూ పేకాట ఆడిస్తూ వచ్చారు. ఈ శిబిరానికి విజయగనరం, విశాఖ, రాజాం, నరసన్నపేట, పలాస, పర్లాకిమిడి, బరంపురం ప్రాంతాల నుంచి జూదరులు వస్తుండేవారు. జిల్లా పోలీసులు ఈ ఏడాది సంక్రాంతి మరుసటి రోజు గారబంద పేకాట శిబిరం వద్దకు వెళ్లడంతో అప్పటి నుంచి శ్రీకాకుళం, నరసన్నపేట నుంచి నిర్వాహకులు అక్కడికి వెళ్లడం మానేశారు. గారబంద కాకుండా ఒడిశాలోని వేరే ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నాలు చేసినా, ఆ సరిహద్దులో ఉన్న పోలీసు అధికారులు నిరాకరించారు. దీంతో ఇప్పటి వరకూ ఖాళీగా కూర్చున్నారు. తాజాగా కొందరు పోలీసు అధికారులతో శ్రీకాకుళం పేకాట బ్యాచ్ మంతనాలు ప్రారంభించింది. అవకాశమిస్తే పేకాట శిబిరాన్ని నిర్వహించుకుంటామని సన్నిహితులైన పోలీసులతో బేరాలు పెట్టడం ప్రారంభించారు. దీనికి ఇప్పటి వరకు ఎవరూ సమ్మతించలేదు. ఇదే సమయంలో పోలీసు బాస్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం, మత్తుపదార్థాల అక్రమ రవాణాను నిరోధించడానికి గొప్పిలి గ్రామం వద్ద రెండు రోజుల క్రితం ప్రత్యేక చెక్పోస్టు ప్రారంభించారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాల తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పాతపట్నం, మెళియాపుట్టి మీదుగా పేకాటరాయుళ్లు గారబందకు వెళుతుండేవారు. ఈ రెండుచోట్ల చెక్పోస్టులు ఉండడంతో అది నిలిచిపోయింది. ఆతర్వాత బెండిగేటు మీదుగా టెక్కలిపట్నం, పలాస మీదుగా గొప్పిలి నుంచి గారబందకు వెళుతున్నారు. గొప్పిలి వద్ద చెక్పోస్టు పెట్టడం వల్ల ఆక్రమ రవాణాతో పాటు, శ్రీకాకుళం నుంచి వెళ్లి గారబందలో పేకాట శిబిరాలు నిర్వహించే వారిని అరికట్టవచ్చన్న ఆలోచన చేశారు. దాంతో ఈ మార్గంలో గతం నుంచి సాగుతున్న నకిలీ కరెన్సీ, గంజాయి, మద్యం, నాటుసారా విరివిగా జిల్లాకు అడ్డదారిలో రాకుండా చెక్ పెట్టే అవకాశం ఏర్పడిరది.
ఇతర రాష్ట్రాలకు వలస
గతంలో పాతపట్నం, మెళియాపుట్టి వద్ద చెక్పోస్టులు ఉన్నా వాటిని లెక్క చేయకుండా పేకాటరాయుళ్లు కార్లలో గారబందకు వెళ్లివస్తుండేవారు. జిల్లా నుంచి వెళ్లి ఒడిశాలో పేకాట నిర్వహించడం, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తుండడంతో రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్థానిక పోలీసుల సహకారంతో వీరు ఒడిశా మద్యంతో పాటు గంజాయిని రవాణా చేసి విశాఖ నుంచి వచ్చే జూదరులకు అందించేవారని ఆరోపణలున్నాయి. చెక్పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించిన తర్వాత ఆక్రమాలకు కొంతవరకు అడ్డుకట్టు పడిరది. అయితే పేకాట శిబిరాల నిర్వాహకులు మాత్రం ఎస్పీ మహేశ్వరరెడ్డిని చూసి భయపడుతున్నారు. ఆయన జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వహించినన్నాళ్లు పేకాట శిబిరాల నిర్వహణకు అవకాశం ఇవ్వలేమని కొందరు పోలీసు అధికారులు చేతులెత్తేశారు. సంక్రాంతి సమయంలో ఒడిశాలో పేకాట శిబిరాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కొందరిని పోలీసులు పిలిపించి బైండోవర్ చేశారు. దీంతో పేకాట శిబిరాల నిర్వాహకులు రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని యోచిస్తున్నారు. ఇప్పటికే కొందరు పేకాట నిర్వాహకులు గోవా, శ్రీలంక బాట పట్టారని తెలిసింది. గతంలో నేపాల్ వెళ్లి పేకాట ఆడిన సందర్భాలు ఉన్నాయి. దేశ సరిహద్దుల్లో ఉన్న నేపాల్లో ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో అక్కడికి వెళ్లడానికి సాహసించడం లేదు. దీంతో గోవా, శ్రీలంక సేఫ్ ప్లేస్లుగా పేకాటరాయుళ్లు ఎంచుకున్నారు. మరి కొందరు ఐపీఎల్ బెట్టింగ్లో బిజీగా ఉన్నారని తెలిసింది.
Comments