పేటీఎంకు ఏమయింది?
- ADMIN
- May 29, 2024
- 3 min read
బ్యాంకింగ్ లావాదేవీలను నిలిపివేసిన ఆర్బిఐ
రోజురోజుకు పడిపోతున్న పేటిఎం షేర్ విలువ
ఆదానీతో గుట్టుగా చర్చలు
మార్చి పదిహేను నుంచి టోల్గేట్ల దగ్గర కార్లను ఆపివేసినప్పుడే బారులు తీరి నిలబడ్డాయి. వాహన చోదకులంతా తమ వాహనాలను ఎందుకు నిలిపివేస్తున్నారని టోల్గేట్ల సిబ్బందిని నిలదీసినప్పుడు, వారు ప్రస్తుత ఫాస్టాగ్ను మార్చమని అడిగారు. ఫాస్టాగ్లో డబ్బులు ఉన్నాయని చెప్పినా టోల్గేట్ సిబ్బంది ఖాతరు చేయలేదు. మరో కొత్త ఫాస్టాగ్ వేసుకుంటేనే గేటు దాటించేదని భీష్మించుకు కూర్చోవడంతో పేటీఎం యాప్తో ఫాస్టాగ్ చెల్లించిన వారంతా, అప్పటికప్పుడే మరో యాప్లోకి మారక తప్పింది కాదు. అదే వారం పేటీఎం యాప్తో కట్టే కరెంటు బిల్లులు సైతం అప్డేట్ కాలేదు. దాంతో పేటీఎం కంపెనీ దాదాపు అన్ని దినపత్రికలలోనూ మేం మీతోనే ఉన్నామంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. గానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం పేటీఎంతో లేకపోవడం యావద్దేశమూ విస్తుపోయి చూసింది. ప్రభుత్వ కనుసన్నలలో లేకపోతే తెల్లవారేసరికి ఏమి జరుగుతుందో కంపెనీలన్నింటికీ చెప్పకనే చెప్పినట్టయింది. ప్రధాని ప్రాపకం సంపాదించడం ఈ దేశంలో కార్పొరేట్ల మనుగడకు ఎంత అవసరమో తేటతెల్లం చేసినట్టయింది. కాని, నిన్న (అంటే మంగళవారం) జరిగిన ఒక రహస్య సమావేశం పేటీఎం కథలోని మరో కోణాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.
వ్యాపారం అంటే గుజరాతీలదే!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బ్రాహ్మణ వ్యాపారవేత్త విజయ్ శేఖర్ శర్మ 1997లోనే వన్97 కమ్యూనికేషన్స్ సంస్థను స్థాపించారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టిన తర్వాత 2010లో పేటిఎంను స్థాపించి, దేశంలో పెద్ద ఎత్తున భారతీయులంతా మొబైల్ యాప్ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించేలా చేయడంలో కీలకపాత్ర పోషించారు. సగటు పౌరులు కూడా డిజిటల్ లావాదేవీలు చేయడాన్ని ప్రోత్సహించడానికి వెనక్కి బహుమతిగా నగదు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టి పేటీఎం యాప్ వాడకాన్ని పాపులర్ చేశారు. వినూత్న ప్రకటనల ద్వారా యావద్దేశాన్ని ఆకట్టుకున్నారు. మొదట్లో ఫోన్ రీఛార్జి సేవలతో మొదలుపెట్టి, క్రమంగా లాండ్లైన్ బిల్ చెల్లించడం వరకూ వెళ్లింది. 2014లో రైలు టికెట్ కొనే వెసులుబాటు కల్పించారు. ఏడాది తిరిగేసరికి స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు తదితరాలన్నీ తన పేమెంట్స్ యాప్ ద్వారా చెల్లించే వీలు వినియోగదారులకు కల్పించారు. ఆ తర్వాత ఏడాది అంటే 2016లో సినిమా టికెట్ల నుంచి, పార్క్ టికెట్ల వరకూ తన యాప్లో చెల్లించగలిగేట్టు తయారు చేసారు. విమాన టికెట్లతో పాటు క్యూఆర్ కోడ్ పద్ధతి కూడా ప్రవేశపెట్టారు. 2017కల్లా పది కోట్ల వినియోగదారులతో పాటు పేటీఎం గోల్డ్ పేరిట బంగారం కూడా అమ్మడం మొదలుపెట్టారు. 2019లో కొంత సొమ్ము అదనంగా చెల్లించడం ద్వారా పేటీఎం ఫస్ట్ పేరుతో చందాదారుల సేవలు మొదలుపెట్టి, అదే ఏడాది వివిధ బ్యాంకుల భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డు సేవలు ఆరంభించారు. 2021లో ఐపిఓకు వచ్చి ప్రజలెవరైనా అందులో షేర్లు కొనవచ్చని ప్రకటించింది. అప్పటికి ఆ కంపెనీ విలువ పదివేల కోట్లకు అంచనా వేసి, మరో పదివేల కోట్లకు షేర్లను ప్రకటించింది. అప్పటికి దేశంలో అదే అతి పెద్ద ఐపిఓ. అలా విడుదల చేసిన ఒక్కో షేర్ ముఖపత్ర విలువ 1950 రూపాయలకు ప్రకటించారు.
ఇంత పెద్ద కంపెనీలో విజయ శర్మకు కేవలం 9 శాతం వాటా మాత్రమే ఉంది. ఆయన జేబు సంస్థ రిసిలెంట్ ఎసెట్ మేనేజ్మెంటుకు పది శాతం వాటాలున్నాయి. ఇక మిగిలిన వాటాల గురించి తెలుసుకుంటే మనకు చెమటలు పడతాయి. సయీఫ్ పార్టనర్స్కు 15 శాతం, ఆంట్ఫిన్ నెదర్లాండ్స్ (ఇది చైనాకు చెందిన అలీబాబా కంపెనీ వ్యవస్థపకుడు జాక్ మాది)కు పది శాతం వాటాలున్నాయి. వీరు కాక రతన్టాటా, తైవాన్కు చెందిన మీడియా టెక్, సాఫ్ట్ బ్యాంక్, బెర్క్షైర్ హాత్వే (ఇది వారెన్ బఫెట్ది) సంస్థలతో సహా మరిన్ని కంపెనీలు పెద్ద ఎత్తున పేటీఎంలో పెట్టుబడులు పెట్టాయి. దిగ్గజాలు ధారాపాతంగా నిధులు కురిపించినప్పటికీ, ఎందుకు ఆర్బిఐ పేటీఎంపై ఆంక్షలు విధించిందో ముందంతా తెలియరాలేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2,267 కోట్ల రూపాయల వ్యాపారం మాత్రమే నిర్వహించినట్లు పేటీఎం ప్రకటించింది. ఇందులో తమకు నికరంగా 550 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ప్రకటించింది. ఆర్బిఐ విధించిన షరతులను అర్థం చేసుకుని, ఆ పరిధుల మేరకు తమ వినియోగదారుల సేవలను కొనసాగించనున్నట్టు పేటీఎం ప్రకటించింది. అందుకు అనుగుణంగా కొందరు ఉద్యోగుల తొలగింపు, కొన్ని కార్యాలయాల మూసివేత వంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని నిర్ణయించింది. కాని ఊపిరి తీసుకోనిస్తే కదా, బతికేది.
అలా కలుపుకొని పోవడమే..
నిన్న అంటే మంగళవారం అహ్మదాబాద్లో గౌతమ్ అదానీ కార్యాలయానికి విజయ శర్మ స్వయంగా వెళ్లి కలిసినట్టు ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక చెప్పినంతవరకూ ప్రపంచానికి ఈ వార్త తెలియదు. ఇప్పటికీ పేటీఎం వర్గాలు ఇలాంటి భేటీ ఏమీ జరగలేదనే బుకాయిస్తున్నాయి. అదానీ కార్యాలయం తెలిపిన వివరాల మేరకు, అదానీ కార్పొరేట్ హౌస్లో జరిగిన ఈ భేటీ కాస్త సుదీర్ఘంగా జరిగిందని, ఈ ఒప్పందం ముగిసే విధంగానే చర్చలు సాగినట్టు తెలిపాయి. పశ్చిమ భారతదేశం నుంచి రావలసిన కొన్ని నిధులు ఇటువైపు తాము మళ్లించనున్నట్టు కూడా వారనడం విశేషం. ఈ సమావేశంలో వారేం మాట్లాడుకున్నారన్నదీ ఇంకా బయటకు పొక్కలేదు. కాని వాణిజ్య వర్గాల సమాచారం మేరకు గౌతమ్ ఆదాని వన్97 కమ్యూనికేషన్స్ సంస్థను టేకోవర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వన్97ను దక్కించుకోవడం అంటే పేటీఎంపై ఆధిపత్యం తీసుకోవడమే. అదానీకి పోర్టుల నుంచీ ఎయిర్పోర్టుల వరకూ, వంటనూనెల నుంచి క్రూడ్ఆయిల్ వరకూ అనేక రకాల వ్యాపారాలున్నప్పటికీ ఫిన్టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ) వ్యాపారంలో అడుగు పెట్టలేదు. ఒకవేళ ఈ రహస్య డీల్ వ్యాపార వర్గాలన్నీ అనుకున్న ప్రకారం సజావుగా సాగితే, అదానీ మాత్రం తమ ప్రత్యర్థి సంస్థలైన గూగుల్ పే, ఫోన్ పే (ఇది వాల్మార్ట్కు చెందిన సంస్థ), జియో ఫిన్లకు గట్టి పోటీ ఇచ్చే కంపెనీగా ఎదగడం ఖాయమని భావిస్తున్నారు. అప్పుడు ఆర్బిఐ ఆంక్షలు ఏమవుతాయి? మీరు ఊరుకోండి మాష్టారూ, మనం ఇండియాలో ఉన్నామని మర్చిపోకండి. ఇక్కడ వ్యాపారస్తులంతా సమానమే అయినప్పటికీ గుజరాతీ బనియాలైన అంబానీ, అదానీలు కొంచెం ఎక్కువ సమానమని మర్చిపోకండి!
- దుప్పల రవికుమార్
Comments