
పాఠాలు చెప్పేవారు ట్రిపుల్ ఐటీలలోనే కాదు ఎక్కడా లేరు. పేరున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో కూడా ఎంటెక్ సర్టిఫికెట్ ఉంటే చాలు.. వారితో చెప్పించేస్తున్నారు. ఎక్కువ శాతం అటానమస్ ఇనిస్టిట్యూట్స్ కనుక పేపర్ తయారి, పరీక్ష నిర్వహణ, వాల్యుయేషన్, సర్టిఫికెట్ ప్రింటింగ్ అంతా అందులోనే కనుక విద్యార్థి పాస్కు ఢోకా ఉండదు. సరే ఇక ఈ ట్రిపుల్ ఐటీల పరిస్థితి చూస్తే ఆశయం గొప్పదే.. కానీ నిర్వహణ లోపం. విద్యార్థుల సక్సెస్ రేట్ కూడా తక్కువే. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇప్పటి అవసరాలకు తగిన కంప్యూటర్ కోర్సులు ఉన్నాయి. కానీ ట్రిపుల్ ఐటీలలో ఉన్న కోర్సులు మాత్రమే విద్యార్థి చదవాల్సి ఉంటుంది. పైగా ఆరేళ్లు ఒకే క్యాంపస్లో విద్యార్థి ఉండడం, అదీ ఈ రోజుల్లో అతి కష్టం. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థి తప్పక ఇంటర్మీడియట్ చదవాలి. అక్కడే మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. పది అయిన వెంటనే టెక్నికల్ ఇనిస్టిట్యూట్స్లో చేరడం వలన వీటిలో ప్రాథమిక అంశాలు తెలియకుండా పోతాయి. ఇంటర్ పూర్తిచేశాక విద్యార్థికి మాథ్స్పై పట్టు కలిగిందని తేలితే అప్పుడు ఇంజినీరింగ్లో చేర్చవచ్చు. పదో తరగతి మార్కులతో మనం ఒక నిర్ణయానికి రాలేం. ఇంటర్ ఫలితాలు విద్యార్థి దిశను నిర్దేశిస్తాయి. ఇంటర్మీడియట్ లెక్కల్లో లేదా ఫిజిక్స్లో సరిగా మార్కులు రాని విద్యార్థిని మళ్లీ యూటర్న్ తీసుకుని వేరే కోర్సులో పెట్టే అవకాశం ఉంది. ఇలా కాకుండా ఏదో చదువుతాడులే అనుకుని ఇంజినీరింగ్లో పెడితే పాస్ మాత్రమే అవుతాడు.. ఇంకేం కాడు.
ఈ మధ్య ఒక తండ్రి మాటల్లోనే.. ‘‘మా అమ్మాయికి 585 మార్కులు వచ్చాయి. ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే ఉచిత భోజనం, చదువు ఓ ఆరేళ్ల పాటు నడుస్తుంది కదా!’’ ఇందుకా అవి ఏర్పాటు చేయబడ్డాయి. ఆ అమ్మాయికి అక్కడ మంచి భవిష్యత్తు ఉంటుందనీ తప్పక ఆశిద్దాం.
- సీహెచ్ దుర్గాప్రసాద్
Comments