3 దశాబ్దాలుగా అడవిని కాపాడటమే అతడి దినచర్య
‘కర్నాటక మహిళ పాలుమరద తిమ్మక్క పర్యావరణ పరిరక్షణ కోసం 8వేల చెట్లునాటి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.’
‘పంజాబ్కు చెందిన రాకేశ్ సోహల్ సీడ్ బాల్స్ తయారుచేసి గుట్టల మీదకు విసురుతున్నాడు...’
‘అస్సాంలో జాదావ్ పయెంగ్ అడవిని కాపాడుతున్నాడు...’

.. దేశం నలుమూలల నుంచి ఇలాంటి వార్తలు జాతీయ మీడియాలో చూస్తుంటాం. కానీ ఇన్ని పనులు ఒక్కడే చేస్తూ, అంతకంటే ఎక్కువే పర్యావరణం కోసం తపిస్తున్న అరుదైన యువకుడి కథ ఇది.
పాత డొక్కుస్కూటీతో పొద్దు పొడవక ముందే నల్లమల అడవుల్లోకి వెళతాడు. అతడి కోసమే ఎదురు చూస్తున్న పక్షులు చుట్టూ చేరతాయి. గుప్పెడు సజ్జ, జొన్న గింజలు వాటికి వేస్తాడు. తర్వాత అడవంతా కలియ తిరుగుతాడు, ఎండిన మొక్కలను గుర్తించి, పక్కనే ఉన్న కుంట నుంచి నీళ్లు తెచ్చిపోస్తాడు. పొదల్లో గుట్టల్లా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలన్నీ ఏరి ఒక గోతాములో వేసుకొని అడవి బయటకు తెస్తాడు. ఇదీ గత 3 దశాబ్దాలుగా అతడి నిత్యదిన చర్య.
నల్లమల అతడి శ్వాస పల్నాడు జిల్లా, కారంపూడి గ్రామం నివాసి కొమెర అంకారావు(42) అలియాస్ కొమెర జాజి ఎం.ఎ చదివారు. తగిన ఉద్యోగం రాలేదు అలాగని నిరాశ పడకుండా నీరు, గాలి, నేల కలుషితం అవకుండా కాపాడటం మీద దృష్టి పెట్టాడు. తన శక్తి మేర వాటిని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. అడవి బాగుంటే వ్యవసాయం బాగుంటుంది అని నమ్మి సమీపంలోని నల్లమల అడవుల్లో తిరుగుతూ మొక్కలను కాపాడుతుంటాడు. అరుదైన ఔషధ మొక్కలు కనిపెట్టి, వాటిని అందరికీ పరిచయం చేస్తుంటారు. ఒక్కో సారి మొక్కల ఆన్వేషణలో చీకటి పడిపోతుంది. అయినప్పటికీ ఒక టెంట్ వేసుకొని ఆ పూటకు అక్కడే ఉండిపోతాడు. జాజి తనకు తెలిసిన మూలికా వైద్యాన్ని అందరికీ అందుబాటులో ఉండడానికి కొన్ని పుస్తకాలు కూడా రాశాడు.
అడవిపై అవగాహన వారానికి ఒక రోజు జిల్లాలోని ఒక పాఠశాలకు వెళ్లి పిల్లలకు ప్రకృతి పాఠాలు చెబుతాడు. వారికి వ్యాధులను నయం చేసే మొక్కలను పరిచయం చేసి వాటిలోని ఔషధ గుణాలను విపులంగా చెబుతాడు. సరస్వతి మొక్క ఆకులను విద్యార్థులకు చూపించి, వాటిని తిని చూపించి, ఇంట్లో పెంచుకోవాలని చెబుతున్నాను.’ అంటాడు జాజి. ఈ ప్రయత్నం బాగానే ఫలించింది. పిల్లలు తమ పెరడులో, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతున్నారు. విద్యార్థులకు అడవిని, ముఖ్యమైన మొక్కలను గుర్తించడం, జంతువులు అడవికి ఎలా తోడ్పడతాయో నేర్పిస్తాడు. ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటి వరకు 3వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు తిరిగి చిన్నారుల్లో పర్యావరణ చైతన్యం కలిగించాడు.
ఇలా చేస్తే ఆసుపత్రితో పని ఉండదు
అపార్ట్మెంట్లు, ఇళ్లపైనా కూరగాయలతో పాటు కొన్ని ఔషధ మొక్కలు కూడా పెంచుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆసుపత్రి ఖర్చులు ఉండవు అంటాడు జాజి. ‘సుంగంధపాల, ముళ్ల గోరింట, పాలబర్రంకి, మగలింగ మొక్క, కొండపిండి, ఉత్తరేణి ఇవన్నీ అరుదైన ఔషధ గుణాలున్న మొక్కలే. అశ్వగంధ, తిప్పతీగ, శతావరి, బోడతరము, చిత్రమూలము, నేలతంగేడు, పసుపు, పాలసుగంధి, సరస్వతి, అడ్డసర వంటివి పెరట్లో, పొలాల్లో పెంచుకుంటే వైద్యుడితో పని ఉండదు.’ అని వివరించాడు.
పక్షుల కోసం పంటలు!
జాజికి ఎకరంన్నర పొలం ఉంది. దానిలో జొన్నలు, సజ్జలు పండిస్తాడు. తన కుటుంబ అవసరాలకు కొంత పంట కోసుకొని మిగతాది పక్షుల కోసమే వదిలేస్తాడు. అడవులు పెరగడంలో పక్షులే కీలకం. అవి తిన్న పండ్లలోని గింజలను భూమి మీద వదలడం వల్ల అడవులు ఏర్పడుతున్నాయి. వాటిని కాపాడుకోవాలి కదా... అంటాడు జాజి తన పొలంలో గింజలు తింటున్న పక్షులను చూపిస్తూ.
కోటి విత్తన బంతులు!
నల్లమలలో తరిగిపోతున్న వృక్షాలను గుర్తించిన జాజి కొత్తగా మొక్కలు పెంచాల్సిన అవసరం గమనించాడు. గత రెండేళ్లలో వానాకాలానికి ముందు కొన్ని అడవీ మొక్కలను సేకరించాడు. జాజి లక్ష్యాన్ని గుర్తించిన రాజమండ్రి సమీపంలోని కడియపు లంకలోని సప్తగిరి నర్సరీ వారు మొక్కలను ఉచితంగా ఇచ్చారు. దాదాపు 200లకు పైగా మొక్కలను అడవిలో నాటాడు. కేవలం నాటి వదిలేయకుండా అవి నిలదొక్కుకునేలా రోజూ నీళ్లను పోసి కాపాడాడు. అక్కడితో ఆగకుండా కోటి విత్తనాలు సేకరించి, విద్యార్ధులతో విత్తన బంతులు తయారుచేశాడు.
అడవిలో ప్లాస్టిక్ని ఏరి వేసి మొక్కలు నాటడం అనేది ప్రపంచంలోనే అరుదైన సేవ, పర్యావరణంపై కమిట్మెంట్ ఉంటేనే తప్ప ఇలా ఎవరూ చేయలేరు.
‘ఒక ఉద్యోగానికి కమిట్ అయితే పిల్లలకు పాఠాలు చెప్పడం, ఇతర పర్యావరణ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని ఫారెస్ట్ ఆఫీసర్ పిలిచి ఉద్యోగమిస్తామన్నా వద్దనుకున్నాడు జాజి. వేసవిలో అడవిలో అగ్ని ప్రమాదాలు జరిగితే తనొక్కడే అక్కడున్న పచ్చరొట్టతో మంటలను ఆర్పుతాడు. ఒక్క రూపాయి ఆశించకుండా అడవి కోసమే జీవితాన్ని పణంగా పెట్టిన ఇలాంటి యువకులు ప్రపంచంలో అరుదుగా ఉంటారు.
పర్యావరణం కోసం కొమెర జాజి కృషిని గుర్తించిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీ తంగేడ కిషన్రావు నల్లమల వెళ్లి, ప్రకృతి పాఠాలు విని జాజిని అభినందించి, అరుదైన మొక్కల గురించి ఒక డాక్యుమెంట్ కూడా చేయాలని ప్రోత్సహించారు. హైదరాబాద్లోని సుచిర్ ఇండియా సంస్థ ద్వారా సామాజిక సేవకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క చేతుల మీదుగా ‘ప్రకృతి వనమూలికా నిపుణుడి’గా అవార్డ్ అందుకున్నారు. యూట్యూబ్ అవార్డు నల్లమలలో సేకరించిన ఔషధ మొక్కలను అందరికీ పరిచయం చేయడం కోసం ‘విలేజ్ లైఫ్ జర్నీ’ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు జాజి.
వ్యక్తిగత జీవితం చిగురించిందా?
‘ఎడారిగా మారనున్న అడవిలో పచ్చదనం పెంచిన మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది?’ అని అడిగినపుడు... ‘చిన్న పొలం తప్ప ఎలాంటి జీవనాధారం లేదు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. భార్య, ఇద్దరు పిల్లలలో చిన్న ఇంటిలో ఉంటున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు మాకు అందలేదు. నా చొక్కాలు పాతవి, కొన్ని చిరిగిపోయాయి. పండుగల సమయంలో గ్రామోత్సవాలకు వెళ్లడం మానేశాను. ఒకసారి నా పనిని గుర్తించిన ఒక సంస్థ సన్మానం చేస్తామని పిలిచారు. అపుడు ఆ ఊరికి వెళ్లటానికి నా జేబులో పది రూపాయలు కూడా లేకపోయింది. నా పిల్లలు అనారోగ్యానికి గురైతే, వారి చికిత్సకు అవసరమైన డబ్బు దొరుకుతుందో లేదో నాకే తెలియదు. ఈ ప్రపంచంలో చాలామందికి నేను ప్రేరణగా ఉండవచ్చు, కానీ నా తల్లిదండ్రులు, భార్యాబిడ్డల అవసరాలు తీర్చడంలో ఓడిపోతున్నాను. కానీ నాకు ప్రకృతి అంటే ప్రేమ. నా మార్గం నుంచి తప్పుకోవడం నాకు సాధ్యం కావడం లేదు.’ అని దుఃఖపూరితమైన స్వరంతో అంటాడు జాజి.
‘నల్లమల అడవిలో ఉన్నప్పుడు పేదరికం మర్చిపోతాను. అక్కడ నేను ఏ కరోడ్పతికి తక్కువ కానంత ఆనందంగా ఉంటాను. అసలు ప్రకృతి లేకుండా జీవితం ఏమిటి?’ అని అంటాడు. జాజి తన పనిని కొనసాగించేలా తనతో కలసి పని చేసే వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నాడు. ప్రపంచానికి ప్రాణవాయువు పంచుతున్న అడవిని రక్షించటానికి గొలుసు ఉద్యమం ప్రారంభించగలననే నమ్మకంతో ఉన్నాడు. ‘కలిసి శ్వాసిద్దాం’ అనేది నా నినాదం అంటాడతను. ‘స్వార్ధంతో పరుగులు తీసే సమాజానికి ఊరకనే మొక్కలు పెంచండి అని నీతులు చెబితే పట్టించుకోదు. వాటి విలువను ఆరోగ్య ప్రయోజనాలు చెప్పినపుడే ముందుకు వస్తారు’ అంటాడు.. అడవిలో ప్రజలు పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్ని గోతాములో కట్టి టూవీలర్ని స్టార్ట్ చేస్తూ.
- శ్యాం మోహన్
Comments