బదిలీల జాబితాల్లో మతలబులు!
- BAGADI NARAYANARAO
- Jul 23, 2024
- 3 min read
ఎన్నికల ముందు వెళ్లిపోయినవారు తిరిగి వచ్చే అవకాశం
రిలీవింగ్ కోసం ఎదురుచూస్తున్న తహసీల్దార్లు
కలెక్టరేట్ పోస్టింగుల కోసం ఆ ఇద్దరి మంత్రాంగం
జేసీని మేనేజ్ చేసి జాబితాల్లో పేర్లు చొప్పించుకున్న వైనం
ఆరోపణలు రావడంతో మార్పులు చేర్పులకు కలెక్టర్ నిర్ణయం
ఎన్నికలు పూర్తి అయ్యాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి అప్పుడే నెలరోజులు గడిచిపోయాయి. కానీ ఎన్నికల ముందు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు.. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన తహసీల్దార్లకు మాత్రం మోక్షం లభించడంలేదు. తమను రిలీవింగ్ చేసి సొంత జిల్లాలకు పంపించాలని రెవెన్యూ సర్వీసుల సంఘం ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20న జోన్`1 (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాలు) పరిధిలోని 138 మంది తహసీల్దార్లను రిలీవ్ చేయాలని సీసీఎల్ఏ నుంచి కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ మేరకు సోమవారం సాయంత్రానికి తమను రిలీవ్ చేసి పాత స్థానాల్లో పోస్టింగ్ ఇచ్చేస్తారని ఆశపడిన తహసీల్దార్లు చివరి నిమిషంలో అది వాయిదా పడటంతో ఉసూరుమన్నారు. జోన్`1తో పాటు రాష్ట్రమంతా ఈ ప్రక్రియ వాయిదా పడిరది. రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండటం, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటం, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీరియస్గా ఉండటం ఈ వాయిదాకు కారణమని భావిస్తున్నారు. దాంతో మరో నాలుగైదు రోజులు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో జిల్లాకు తిరిగిరానున్న తహసీల్దార్లకు పోస్టింగులు ఇచ్చేందుకు రూపొందించిన జాబితాలో పలు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 26న జిల్లాలో 42 మంది తహసీల్దార్లను మన్యం, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు బదిలీ చేశారు. ఈ నెల 20న జారీ చేసిన మెమో ఆధారంగా తిరిగి జిల్లాకు వచ్చే వెసులుబాటు లభించింది. వారితో పాటు ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన తహసీల్దార్లు సోమవారం సాయంత్రం తమను రిలీవ్ చేస్తారని ఎదురు చూశారు. అయితే రిలీవింగ్ ప్రక్రియ ఆపాలంటూ చివరి నిమిషంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ఆదేశాలతో వారంతా నీరుగారిపోయారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ ఒకేసారి రిలీవింగ్, పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని కలెక్టర్లు నిర్ణయించారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే పోస్టింగులకు సంబంధించి ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖలు ఇంకా రానందున అవి వచ్చిన తర్వాత బదిలీలు చేయాలనే ఆలోచనతో కలెక్టర్లు ఉన్నట్టు సమాచారం. అయితే జోన్`1 మినహా మిగతా జోన్లలో తహసీల్దార్ల రిలీవింగ్ మంగళవారం నాటికి పూర్తిచేశారు. కాగా జిల్లాలో ప్రస్తుతం విధుల్లో ఉన్న తహసీల్దార్లను రిలీవ్ చేసి వారి స్థానంలో జిల్లాకు వస్తున్నవారికి పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియను జేసీ నవీన్కు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అప్పగించారు. అంతలోనే జేసీ నవీన్ను సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. అయినప్పటికీ జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సూచనల ప్రకారం పోస్టింగుల జాబితాను జేసీ నవీన్ సిద్ధం చేశారు. దీన్ని ఆదివారం సాయంత్రం కలెక్టర్కు పంపించారు. ఈ జాబితాపై విమర్శలు రావడంతో దానిలో మార్పులు, చేర్పులకు కలెక్టర్ చర్యలు తీసుకున్నారని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మండలాల్లో పని చేయకుండా ఏళ్ల తరబడి కలెక్టరేట్ను అంటిపెట్టకొని ఉంటున్న కొందరు తహసీల్దార్లు జేసీ నవీన్ను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి తహసీల్దార్ క్యాడర్ వరకు ఏళ్ల తరబడి కలెక్టరేట్లోనే పనిచేసిన రాజేశ్వరరావు, సూర్యనారాయణ లాంటి పలువురు అధికారులు, ఉద్యోగులకు మళ్లీ కలెక్టరేట్లోనే పోస్టింగ్ ఇచ్చేలా జాబితా రూపొందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజేశ్వరరావు సుదీర్ఘ కాలంగా కలెక్టరేట్లోనే విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు, కలెక్టరేట్, అమరావతి చుట్టూ సూర్యనారాయణ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇప్పటివరకు మండలాల్లో పని చేసిన దాఖలాలే లేని వీరిద్దరూ తిరిగి కలెక్టరేట్లో పోస్టింగ్ కోసం పైరవీలు చేసుకుంటున్నట్లు తెలిసింది.
ఏవోగా వచ్చేందుకు వారిద్దరి పైరవీలు
కలెక్టరేట్లో పోస్టింగులకు ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు ఇవ్వరు. ఎందుకంటే కలెక్టరేట్లో పని చేసే ఉన్నతాధికారులు మినహా మిగతా వారితో ప్రత్యక్షంగా, పరోక్షంగా వారికి ఎలాంటి అవసరం ఉండదు. కలెక్టరేట్ పాలనాధికారి(ఏవో)గా వ్యవహరించే తహసీల్దార్కు కలెక్టరేట్లోని అన్ని విభాగాల్లో జోక్యం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కార్యాలయ పాలన వ్యవహారాల్లో భాగంగా ఉద్యోగుల సర్దుబాట్లు, డిప్యూటేషన్ల పేరుతో తమకు అన్నివిధాలుగా సహకరించే వారిని మండలాల నుంచి ఏరికోరి తీసుకువస్తుంటారు. వీరి ద్వారా అన్ని రకాల పనులు చక్కబెడుతుంటారు. అలాగే మండలాల్లోని రెవెన్యూ అధికారులు, ఉద్యోగులపై రుబాబు చేయవచ్చు. కలెక్టరేట్లో పని చేయడానికి పెద్దసంఖ్యలో ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నా వారిని రానీయకుండా కలెక్టరేట్ అధికారులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉండదు. అందువల్లే ఏవోగా వెళ్లేందుకు రాజేశ్వరరావు, సూర్యనారాయణ లాంటి సీనియర్లు తహతహలాడుతుంటారు. ఇప్పుడూ ఇదే ప్రయత్నంలో వారిద్దరూ జేసీ నవీన్ను ప్రభావితం చేసి కలెక్టరేట్కు రావాలని చూస్తున్నారని రెవెన్యూ అధికారుల్లో చర్చ సాగుతోంది. కలెక్టరేట్ ఏవో రాజేశ్వరరావుతో పాటు జిల్లాలోని అనేక మంది ఎన్నికల బదిలీల్లో భాగంగా అనకాపల్లిలో విధుల్లో చేరారు. అక్కడ కూడా రాజేశ్వరరావు తనకున్న పరిచయాలతో ఏవో సీటు దక్కించుకున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం కలెక్టరేట్కు ఏవోగా రావడానికి గతంలో జిల్లాలో పని చేసిన ఉన్నతాధికారులతో జేసీ నవీన్కు చెప్పించి జాబితాలో పేరు చేర్పించినట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ సాగుతోంది.
మార్పులకు అవకాశం
తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులకు పోస్టింగుల విషయంలో ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు ఇవ్వడం సర్వసాధారణం. అయితే ఈసారి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో సొంత డివిజన్లో తహసీల్దార్లుగా పని చేయడానికి వీల్లేదని పేర్కొంది. దీంతోపాటు గతంలో పని చేసిన నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో తహసీల్దార్లకు పోస్టింగ్ ఇవ్వద్దన్న ప్రభుత్వ సూచనల మేరకు సీసీఎల్ఏ అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో ఈ ఉత్తర్వులు ఆర్డీవోలకు మాత్రమే వర్తించేవి. దీని కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవోను విడుదల చేయించి సొంత డివిజన్లో పోస్టింగులు ఇచ్చే పరిస్థితి ఉండేది. గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే ఇటువంటి జీవోలు విడుదలయ్యాయి. దీన్ని బ్రేక్ చేస్తారా, కొనసాగిస్తారా అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. అయితే జేసీ రూపొందించిన జాబితాలో ప్రజాప్రతినిధుల నుంచి పూర్తిస్థాయిలో సిఫార్సు లేఖలు వచ్చిన తర్వాత చేర్పులు, మార్పులు చేయాలని డీఆర్వోను కలెక్టర్ ఆదేశించినట్టు తెలిసింది. కలెక్టరేట్లో సుదీర్ఘకాలంగా పనిచేసిన తహసీల్దార్లు, డీటీలు, ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించినట్టు సమాచారం. రెవెన్యూ వర్గాలు మాత్రం బుధవారం నాటికి రిలీవింగ్ చేసి ఆయా జిల్లాల్లో పోస్టింగులు ఇచ్చేస్తారని చెబుతున్నారు.
Comments