top of page

బీసీలకు మేలు చేసే కులగణన

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • May 3
  • 2 min read

వేదకాలంలో సమాజంలో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర.. అనే నాలుగు వర్ణాలే ఉండేవి. క్రీ.పూ 1500లో ఆర్యులు భారతదేశానికి వచ్చారు. వారితోనే కుల వ్యవస్థ ప్రారంభమైంది. వేల కొద్దీ కులాలు, ఉప కులాలు పుట్టుకొచ్చాయి. కులం సమాజాన్ని విభజించే వ్యవస్థ. వ్యక్తి పుట్టుకతోనే నిర్ణయించబడే వర్గ నిర్మాణం. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మూడువేల కులాలు, 25వేల ఉపకులాలు ఉన్నాయి. దేశంలోని సామాజిక, ఆర్థిక అసమానతలు తగ్గించాలన్నా, దామాషా పద్ధతిలో వనరుల పంపిణీ జరగాలన్నా కులాల సమగ్ర సమాచారం అవసరం. అందుకే కులగణన ను భారత రాజ్యాంగం కూడా సమర్థిస్తోంది. ఆర్టికల్‌ 340 ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాల స్థితిగతులను తెలుసుకుని, వారి ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలకు సిఫార్సులు చేయడానికి ఒక కమిషన్‌ను నియమించాలని ఈ ఆర్టికల్‌ సూచిస్తోంది. కానీ దేశంలో స్వాతంత్య్రానికి పూర్వమే.. అంటే 1931లో మొదటిసారి సామాజిక, ఆర్థిక, కుల గణన (ఎస్‌ఈసీసీ) నిర్వహించారు. 1941లో కూడా అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం కులగణన నిర్వ హించింది. కానీ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఆ సమాచారాన్ని బయటపెట్టలేకపోయింది. కానీ స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం జాతీయ ఐక్యతను పెంపొందించాలన్న లక్ష్యంతో కుల గణన నిలిపివేయాలని 1951లో నిర్ణయించింది. అప్పటి నుంచి 2011 వరకు జనాభా గణనలో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తప్ప ఇతర కులాలవారీ లెక్కలు సేకరించలేదు. ఓబీసీలకు 27 శాతం రిజ ర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసిన మండల్‌ కమిషన్‌ కూడా 1931 నాటి కులగణన లెక్కల ఆధారంగానే దేశ జనాభాలో బీసీలు 52 శాతం వరకు ఉన్నారని పేర్కొంది. కాగా 2011`12 నాటి నేషనల్‌ శాంపిల్‌ సర్వే బీసీ, ఎస్సీ, ఎస్టీలు చాలా వెనుకబడి ఉన్నారని పేర్కొంది. ఇక నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే 2016-17 ప్రకారం ఎస్టీల్లో 50శాతం, ఎస్సీల్లో 33శాతం, ఓబీసీల్లో 27శాతం పేదరికంలో ఉన్నారు. 2021 లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 52.7 శాతం మంది జనరల్‌ కేటగిరీకి చెందినవారే. అందులో కూడా అధిక వేతనం అందుకునే ఉన్నత ఉద్యోగాల్లో 64శాతానికి పైగా జనరల్‌ కేటగిరీ వారు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కులగణన చేపట్టి ఆ దామాషా పద్ధతితో ఉద్యోగాలు, పథకాలు అందించాల్సిన అవసరం ఉంది. 2011లో యూపీఏ సర్కారు కులగణన కు నిధులు కేటాయించింది. కానీ దానికి బదులుగా సామాజిక ఆర్థిక సర్వే- 2011 నిర్వహించారు. ఆ నివేదికైనా ఇప్పటివరకు వెలుగుచూడలేదు. వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు కూడా కులగణనకు అనుకూలంగా తీర్మానాలు చేశాయి. అయితే కులాల వారీగా ప్రజలను వర్గీక రించడమంటే వ్యక్తిగత హక్కులు హరించడమేనని, కులాలను నిర్వచించడం కష్టమని ఇది సమా జంలో గందరగోళానికి, వివాదాలకు దారి తీసి దేశ సమగ్రతకు భంగం కలిగిస్తుందనే వాదన ఉంది. అయితే సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి, వనరుల సమాన పంపిణీకి కులగణన అవసర మన్న వాదనలు కూడా ఉన్నాయి. కులగణన చేపట్టడం ద్వారా బీహార్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రా లు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయి. దాంతో ఇన్నాళ్లూ వ్యతిరేకిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా దిగిరాక తప్పలేదు. ఈసారి జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా నిర్వహిస్తామని ఇటీవలే ప్రకటించింది. 2018లోనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ దేశంలో రాబోయే జనగణనలో కులగణన కూడా తప్పకుండా చేస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. ఆ మేరకు త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణలో భాగంగానే కులగణన కూడా నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తన పర్యటనల్లో ప్రధానంగా కులగణన గురించే మాట్లాడుతున్నారు. అలాగే కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీసీ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతోపాటు ఈ ఏడాది చివర్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్ణయం తీసుకోక తప్పలేదు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఈ కులగణన ఎంతో ఉపయుక్తం కానుంది. అయితే దీన్ని పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాల్సి ఉంది.

댓글


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page