భద్రత ముసుగులో హక్కుల ఉల్లంఘన
- DV RAMANA
- May 5
- 2 min read

జాతీయ భద్రత కోసం ప్రభుత్వం అనేక నిర్ణయాలు, చర్యలు తీసుకోవడం సహజమే. వాటిని ఎవరూ తప్పు పట్టడానికి కూడా లేదు. కానీ అవన్నీ నిర్దిష్ట పరిమితులకు లోబడి, చట్టబద్ధంగా ఉండాలే తప్ప తెరవెనుక కుట్రల్లా ఉండకూడదు. అయితే జాతీయ భద్రతకు ఆధునిక సాంకేతికత వినియోగం పేరుతో స్పై పరికరాలను యథేచ్ఛగా వినియోగించడం ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదంగా మారింది. నిఘా సాఫ్ట్వేర్ను ఉపయోగించవచ్చా లేదా అన్నది కాకుండా ఎవరి మీద ప్రయోగిస్తున్నారన్నదే సమస్య. మూడేళ్లకుపైగా ఈ వివాదం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో నలుగుతోంది. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, మతాధిపతులు, ఉన్నత స్థాయి అధికా రులు, జర్నలిస్టులపై పెగాసెస్ నిఘా సాఫ్ట్వేర్ ప్రయోగించి ఆరాలు తీసిన వ్యవహారంపై నమోదైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రానికి ఉన్న నిఘా అధికారాలను అదుపు లో పెట్టేందుకు ప్రయత్నించింది. పెగాసెస్ నిఘా సాఫ్ట్వేర్ను ఇజ్రాయెల్ సైనిక పరిశోధన సంస్థ రూపొందించింది. దీన్ని ప్రధానంగా ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తుంది. దాన్ని కొనుగోలు చేసిన మన కేంద్ర ప్రభుత్వం దేశంలో వివిధ రంగాల ప్రముఖులు, జాతీయ పార్టీల నేతల ఫోన్లలో చొప్పించి వారి కదలికలపై నిఘా ఉంచింది. ఈ నిఘా సాఫ్ట్వేర్ను సాధారణ వ్యక్తులు, పౌర మేధావులపై కూడా ప్రయోగించారా లేదా అన్న ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం అవునని కానీ.. కాదని కానీ చెప్పలేదు. స్పై సాఫ్ట్వేర్పై ప్రపంచ వ్యాప్తంగా వివాదాలు రేగడంతో మన దేశంలో కూడా పలువురు మేధావులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు ఓ సాంకేతిక నిపుణుల కమిటీని నియమించినా సరైన సహకారం లభించక అది పడకేసింది. ఆ సంగతి పక్కన పెడితే దేశంలో వివిధ రంగాల ప్రముఖులుగా ఉంటూ ఐఫోన్ వాడుతున్న పలువురికి ఇప్పటికీ పెగసస్ తయారీదారుల నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ‘మీ ఫోన్ మా నిఘా పరికరాల పడగనీడలో ఉన్నది’ అన్నది వాటి సారాంశం. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ నిఘా దాడి మాత్రం కొనసాగుతూనే ఉందనడానికి ఇది నిదర్శనం. మరోవైపు ఉగ్రవాదులు, రాజ్యాంగేతర శక్తులు, సమాజంలో హానికర పోకడలకు ప్రాతినిధ్యం వహించేవారు నిఘా సాంకేతికత సాయంతో తమ వ్యవహారాలు చక్కబెట్టు కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారాలు కొన్నిసార్లు విస్తృత సమాజానికి హాని కలిగించేవిగా ఉన్నాయి. ఇటువంటి వాటిని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు తగిన విధంగా సన్నద్ధం కాకపోతే దేశాలే నష్టపోతాయి. జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించటంలో విఫలమవుతాయి. దానికి తాజా ఉదాహరణే పహల్గాం దాడి ఘటన. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి సరైన ప్రశ్నలే లేవనెత్తింది. జాతీయ భద్రత పేరుతో విచ్చలవిడిగా రాజ్యాంగ ప్రమాణాలు, పరిపాలనా పద్ధతులు అధిగమించి వ్యవహరిస్తున్న తీరును కూడా సుప్రీంకోర్టు గతంలో తప్పు పట్టింది.. ప్రశ్నిం చింది. రాజకీయ ప్రత్యర్ధులను జాతి వ్యతిరేకులుగానూ, దేశ ద్రోహులుగానూ పదేపదే ప్రభుత్వాలు విమర్శించటం ఆనవాయితీ అయిపోయింది. ఇది ఆందోళనకరం. ప్రభుత్వం చేతిలో అదుపుచేయ లేనన్ని నిఘా అధికారాలు పోగుపడే సమయంలో కచ్చితంగా వాటి వినియోగానికి సంబంధించిన విషయాల్లో కూడా పౌరుల వ్యక్తిగత గోప్యతకు నష్టం లేని రీతిలో జాగ్రత్తలు అవసరం. వ్యక్తిగత ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు జాతీయ భద్రత ఓ ముసుగుగా మారకూడదు. జాతీయ అవసరాల కోసం తీసుకుంటున్న నిఘా చర్యల్లో రాజ్యాంగ ప్రమాణాలు, ప్రాథమిక హక్కుల పరిరక్షణ వంటి వాటి విషయాల్లో జవాబుదారీతనం ఉండేలా చూడాలి. ఏ భద్రతాపరమైన సమస్యల నివారణకు ఈ చర్యలు తీసుకుంటున్నారో, ఈ విశేషాధికారాలు కట్టబెడుతున్నారో.. అవి పరిష్కారమై సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈ నిఘా వ్యవస్థలన్నింటినీ సాధారణ పరిపాలన పరిధిలోకి తీసుకు రావాలి. ప్రజాస్వామిక జీవనంలో చొరబడటానికి ప్రభుత్వాలకు విశేషాధికారాలు కట్టబెట్టకూడదు. నిరసనలు, ప్రతిఘటనలు, ప్రశ్నించే గొంతులను నొక్కటానికి నిఘా వ్యవస్థలు పావులుగా మార కూడదు. అనూహ్యంగా ఎదురయ్యే భద్రతా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం పేరుతో భారత రాజ్యాంగం, పౌర హక్కులు, ప్రజాస్వామిక ప్రమాణాలను తుంగలో తొక్కకూడదు. అందుకు తగిన నిర్ణయాలను న్యాయ, శాసన వ్యవస్థలు తీసుకోవాల్సి ఉంది.
Comments