భావ ప్రకటనకు స్వేచ్ఛా ద్వారాలు!
- DV RAMANA
- Apr 18
- 2 min read

భారత సర్వోన్నత న్యాయస్థానం భావప్రకటన స్వేచ్ఛకు ద్వారాలు తెరవడం పట్ల సర్వత్రా హర్ష ధ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోమాటలో చెప్పాలంటే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఒక్కసారిగా భారతీయ పౌరసమాజం ఊపిరి పీల్చుకుంది. పౌరుల భావప్రకటన స్వేచ్ఛ అత్యంత కీలక మైనదని, వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయటం నాగరిక సమాజంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల తేల్చిచెప్పింది. ‘ఆ అభిప్రాయాలతో లేదా ఆలోచనలతో విభేదించవచ్చు. ఆ అభిప్రాయాలకు భిన్నంగా మరో అభిప్రాయాన్ని ప్రకటించటం ద్వారా దాన్ని ఎదుర్కోవాలే తప్ప అణచివేస్తామనడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే అవుతుంది’ అని ధర్మా సనం స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రావమ్, ఎక్స్లలో గుజరాత్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి పోస్ట్ చేసిన కవిత వల్ల సమాజంలో విద్వేషాలు రగులుతాయని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర పోలీసులు కేసుపెట్టారు. పోలీసుల చర్యను తప్పుపడుతూ, కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేక విధాల ఎన్నదగి నది. రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కుల పట్ల ఎటువంటి గౌరవం లేని అనైతిక పాలకులు తమ రాజ కీయ ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెట్టడం ఈమధ్య బాగా ముదిరింది. నిజానికి గుజ రాత్ పోలీసులకు అభ్యంతరకరంగా కనిపించిన ఈ కవితలో దేశ ద్రోహనికి సంబంధించిన అంశాలు ఏమీ లేవు. అది ఒక విశ్వజనీనమైన భావనే. ఆ కవితను ఒకసారి మనం పరిశీలిస్తే.. ‘ఓ రక్త పిపాసు లారా వినండి’ అంటూ మొదలయ్యే ఆ కవితలో అలాంటి వారికి కూడా ప్రేమను పంచుతామన్న సందే శమే ఉంటుంది. అన్యాయానికి ఒడిగట్టినా దాన్ని న్యాయంతోనే ఎదుర్కొంటామని చెబుతుంది. ఇందులో పోలీసులకు ఏది అభ్యంతరమనిపించిందో గానీ వెనకా ముందూ చూడకుండా ఎంపీపై కేసు పెట్టారు. విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘ఒక్కొక్కరు దీన్ని ఒక్కో విధంగా విశ్లేషించుకుంటారు’ అని పోలీసుల చర్యను సమర్థించారు. అయితే సృజనాత్మకతను గౌరవించే సంస్కృతి లేకపోవటాన్ని ధర్మాసనం ఎత్తిచూపింది. నిజానికి భావ ప్రకటన స్వేచ్ఛపై భారత రాజ్యాంగంలోని 19వ అధికరణంలో పలు నిర్వచనాలు పొందుపర్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ, అసోసియేషన్లు లేక యూనియన్లు లేక సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు (2012లో ఆమోదించిన 97వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సహకార సంఘాలు’ అనే పదం చేర్చబడిరది), భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించే హక్కు, భారత భూభాగంలో ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు, (ఆస్తి హక్కుకు సం బంధించిన ఈ క్లాజు 1978లో 44వ రాజ్యాంగ సవరణ సందర్భంగా తొలగించబడిరది), ఏవిధమైన వృత్తినైనా, వ్యాపారాన్ని అయినా చేసుకునే హక్కులను మొదటి క్లాజులో చేర్చారు. రెండోక్లాజు(1)లోని సబ్ క్లాజు(ఎ)లో ఏమి చెప్పినప్పటికీి భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికార పరిరక్షణ దృష్ట్యాగానీ లేదా దేశ భద్రత దష్ట్యాగానీ లేదా విదేశాలతో సంబంధాల దృష్ట్యాగానీ లేక శాంతిభద్రతలు, నైతిక విలువలు, సభ్యత, కోర్టు ధిక్కారం, పరువు నష్టం, నేరాలు చేసేలా ప్రోత్సహించడం మొదలైన వాటిని నియంత్రిం చాలని నిర్దేశించారు. భావ ప్రకటన స్వేచ్ఛ చట్టాన్ని ఫ్రెంచ్ రివల్యూషన్ స్ఫూర్తితో డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ తీసుకొచ్చారు. ఆయన తన జీవితం మొత్తం భావ ప్రకటన స్వేచ్ఛకోసమే పోరాడారు. కార్ల్ మార్క్స్, బెట్రాండ్ రసెల్ వంటి ప్రపంచ మేధావులంతా భావప్రకటన స్వేచ్ఛకోసం పోరాడినవారే. శాంతియుతం గా సభలు, సమావేశాలు పెట్టుకునేందుకు భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కును కూడా ప్రభుత్వాలు నిరోధించడం ఆశ్చర్యం, ఆందోళన కలిగించకమానదు. కవిత్వం, ఉపన్యాసం, రచన, విశ్లే షణ, జీవించే హక్కు ఇవన్నీ ప్రపంచ జీవన వ్యవస్థల విస్తృతికి ఉపకరిస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛతో అధికరణం (29) సాంస్కృతిక విద్యాహక్కులు కూడా ముడిపడి ఉన్నాయి. ఇటీవల సాంస్కృతిక విప్లవానికి అవరోధం కలిగించే అనేక పోకడలు దేశంలో కన్పిస్తున్నాయి. మొత్తం లౌకికవాదం, ప్రజాస్వామ్యవాదం, సామ్యవాదం వంటివి భావప్రకటన స్వేచ్ఛ మీదే ఆధారపడి ఉన్నాయి. మొత్తం భారత రాజ్యాంగమే భావ ప్రకటన స్వేచ్ఛపై ఆధారపడి ఉంది. దేశంలో భారత రాజ్యాంగం విజయవంతంగా అమలవ్వాలంటే భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కానీ అంబేద్కర్, మార్క్స్ చెప్పినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ కోసం దేశంలోను, ప్రపంచంలోనూ నిరంతరం పోరాటం జరగాల్సిందే. ఆ పోరాటంలో మనమందరమూ భాగస్వాములమవ్వాల్సిందే.
Comments