మతం ఎప్పుడూ ఇదే చేస్తుంది
- DV RAMANA
- Jan 11
- 2 min read

పుష్కరాల్లో 29 మందిని చంపేస్తుంది. యాత్ర కోసం వెళ్లిన 2వేల మంది ముస్లింల ప్రాణాలు తీస్తుంది. బాప్టిజం పేరిట చిన్నబిడ్డను నీళ్లల్లో ముంచి చంపేస్తుంది. ఇప్పుడు తిరుపతిలో ఆరుగురి ప్రాణాలు తీసింది. మతం ఇంకా ఘోరమైన విషయాలు చేయిస్తుంది. ‘ఇద్దరు బిడ్డల్నేసుకుని బెనిఫిట్ షోకి రాకపోతే ఏమి?’ అని చచ్చిపోయిన రేవతి మీద దుమ్మెతిపోసిన ఆ జనమే, ఇప్పుడు మరణిం చిన ఈ ఆరుగురినీ చూసి ‘ఆహా.. ఎంత అదృష్టం! వారు తప్పకుండా వైకుంఠం చేరుకుంటారు’ అని అనేలా చేస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే, ‘అంతా వారి పూర్వజన్మ రాత. అప్పుడేవో పాపాలు చేసినందుకే ఇప్పుడిలా జరిగింది’ అని కూడా అనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఆ క్యూలైన్లలో ఒక్క సినిమా హీరో, హీరోయిన్, వ్యాపారవేత్త, రాజకీయనాయకుడు ఉండరు. ఏం? వాళ్లకు పుణ్యం వద్దా? వాళ్లను శ్రీనివాసుడు కరుణించొద్దా? మతం ఎప్పటికీ మత్తుమందే! విజయవాడ హైందవ శంఖారావానికి డబ్బున్న వ్యాపారవేత్తలు, సినిమా హీరోలు, పారిశ్రామికవేత్తలు ఎందుకు రాలేదో అర్థమైందా ఇప్పటికైనా? మతం కోసం గొంతు చించుకోవాల్సిందీ మనమే, ఆ మతం కాళ్ల కింద నలిగిపోవాల్సిందీ మనమే. డబ్బున్న వర్గాలు హాయిగా వేడుక చూస్తూ కూర్చుంటాయి. ఇంటి నుంచి సామాన్లు తీసుకుని, అల్లరి చేస్తున్న పిల్లల్ని వెంటేసుకొని, తాళాలు సరిగ్గా వేశామా, లేదా అని మనసులో గుబులు మోసుకుని, టికెట్లు తీసుకుని, లేదా సొంతంగా బండ్లు కట్టుకొని, ఆ రోడ్ల మీద ఒళ్లు హూనం చేసుకుని, ఎక్కడపడితే అక్కడ దొరికే తిండి తిని, లేదా ఇంటి నుంచి పట్టుకెళ్లిన పులిహోర, పూరీలు ఆరగించి, చలికి గజగజ వణికి, నలుగురు పట్టే చోట ఎనిమిది మంది ఇరికి, చిట్టచివరకు అక్కడికి చేరాక.. రూం దొరుకుతుందో లేదో, ఖాళీ ఉంటుందో లేదో, స్నానానికి వేణ్నీళ్లు దొరుకుతాయా, దర్శనం ఎప్పుడవుతుందో ఏమో, ఎన్ని గంటలు నిరీక్షించాలో ఏంటో, లడ్డూలు ఎన్ని ఇస్తారో, దర్శనం తర్వాత షాపింగ్కి ఎంతసేపు పట్టొచ్చు, అన్నప్రసాదం హాల్కి వెళ్తే తొందరగా బయటకు వస్తామా, ఇంట్లోకి రాగిచెంబు కొనాలా, ఇత్తడి చెంబా, చుట్టుపక్కల వారికి పంచడానికి చిన్నఫొటోలు చాలా, పెద్ద ఫొటోలు కొందామా, లక్ష్మీదేవి ఇత్తడి విగ్రహం ధర ఎంతుంటుందో అంటూ మనసులో వంద రకాల లెక్కలు వేసుకుంటూ.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మే సరుకుల్ని అవసరార్థం కొనుక్కుంటూ, అమ్మిన వారిని తిట్టుకుంటూ, క్యూలైన్లలో కునుకుపాట్లు పడుతూ, నక్కుతూ, ముక్కుతూ, వచ్చే కాలకృత్యాలను ఆపుకుంటూ, ఒకర్ని తోసుకుంటూ, మరొకరి చేత తోయబడుతూ, ఆడవాళ్ల శరీరాలను మగవాళ్లు గుద్దుతూ, మగవాళ్ల దేహాల్ని ఆడవాళ్లు తోసేస్తూ, దూరంగా ఎవరైనా సినిమా సెలబ్రెటీ కనబడితే వారివైపు చెయ్యూపుతూ, వీలైతే పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్లకు షేక్హ్యాండ్లు ఇస్తూ.. ఇన్నిన్ని బాధల మధ్య కూడా.. ‘పుణ్యక్షేత్రాలకు వెళితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది’ అని అంటారు చూడండి! అబ్బా! అంతకంటే పెద్ద ప్రపంచ వింత మరోటి కనిపించదు. ఇన్ని ఈతిబాధల మధ్య ఇంకేం ప్రశాంతత? ప్రశాంతత అక్కర్లేని, పవిత్రత అర్ధం తెలీని, శుభ్రత స్పృహలేని, సంయమనం పాటించే ఓపిక లేని భక్తి మనది.. భాష, ప్రాంత, ఆడా మగా, బీద ధనిక, అక్షరనిరక్షరాస్యులు అనే భేదాల్లేవిక్కడ. ఒక పెద్ద గాట తీసుకొచ్చి అందర్నీ కట్టి పడేయచ్చు. అరమోడ్పు కళ్లతో మూడు అరక్షణాలు మాత్రమే దర్శించగల దేవుడి కోసం కళ్లు పూర్తిగా మూసుకుపోయి ఒకరినొకరు తోసుకుని ఒకరి మీదికి ఒకరు ఎక్కి తొక్కి ప్రాణాలు తీయగల మూఢ భక్తులున్నంత కాలం ఇది ఇలాగే జరుగుతుంది. దేవుడిని, సంప్రదాయాన్ని, మతాన్ని, ధర్మాన్ని తిట్టుకుని ప్రయోజనం లేదు. మనుషులు, భక్తులు ఇలా ఉన్నంతకాలం జీవితానికి నువ్విచ్చే విలువ ఇదే అయితే అది కోల్పోయినందుకు ఎవరినో తప్పుపడుతున్నావెందుకు? సంధ్య థియేటర్లో జరిగిన దానికీ, దీనికీ పెద్ద తేడా లేదు. హీరోలూ ప్రేక్షకదేవుళ్లే కదా. మతం మన జీవనశైలి కావాలి.. జీవన విధానం కావాలి.. బతికే దారి చూపాలి.. అంతేతప్ప ఉందో లేదో తెలియని స్వర్గం కోసం ద్వారాలు తెరిచే వుంటాయని చెప్పకూడదు. ఇక్కడ లేనిది పరలోకంలో ఉంటుందని భ్రమపెట్టడమే ఇన్ని తప్పిదాలకు, ఇన్ని ప్రాణాలు హరించుకుపోడానికి కారణం కారాదు.
ఏ మతమైనా ఈ భూమి మీద పుట్టినవే.. మనిషి సృష్టించినదే. మనం బతకడానికి తెచ్చుకున్న మతం మనం చావడానికి కారణభూతం అయితే ఆ తప్పెవరిది.
Comments