top of page

మన భద్రతా వైఫల్యం మాటేమిటి?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 28
  • 2 min read

పహల్గాంలో 26 మంది టూరిస్టుల కాల్చివేత నేపథ్యంలో యావత్తు భారతదేశ ప్రజ ఆగ్రహం తో ఊగిపోతోంది. ఉగ్రవాద తండాలను తుదముట్టించడంతో పాటు వాటిని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై యుద్ధం ద్వారా తగిన శాస్తి చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర సర్కారు కూడా ఈ వాదనను ఎగదోస్తోంది. ప్రజల ఆగ్రహావేశాల వేడిలో కేంద్రం తన లోపాన్ని మరుగుపరుస్తోంది. దానిపై చర్చే లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. అదే ఉగ్రదాడిని ముందుగానే పసిగట్టి అడ్డుకోవడంలో కేంద్రం వైఫల్యం. కానీ దాని గురించి చర్చించకుండా, దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా పాక్‌పై ప్రతీకార చర్యలు మాత్రమే ప్రారంభించింది. 1960 నాటి సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు, భారత్‌లో ఉన్న పాక్‌ జాతీయులను వెనక్కి పంపడం, పాకిస్తాన్‌లో ఉన్న భారత దౌత్య సిబ్బందిని తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది. పహల్గాం దాడి ఘటన ఒక లోపమని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం అంగీకరించింది. ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారని నిఘా సంస్థలు పసిగట్టలేకపోయాయి. స్థానిక భద్రతా సంస్థలు, కేంద్ర భద్రతా, నిఘా సంస్థల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపించింది. డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ మాజీ డిప్యూటీ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) గగన్‌జిత్‌సింగ్‌ మాట్లా డుతూ.. పహల్గాం విషాదం తీవ్రమైన నిఘా వైఫల్యంగా పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో పరిణామాలు ప్రశాంతంగా ఉన్నాయని ప్రచారం చేయడానికే కేంద్రం పరిమిత మైందన్నారు. దీన్ని పట్టించుకోని టీవీ ఛానళ్లు, ఇతర మీడియా కూడా ప్రభుత్వం వెంటనే దాడి చేయాలని తమ వార్తలు, కథనాలతో ఒత్తిడి పెంచుతున్నాయి. పీవోకేను వెనక్కి తీసుకోవాలని కొందరు వాదిస్తున్నారు. పాక్‌ను అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుకు లాగాలని కాంగ్రెస్‌ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సూచించారు. దీనికి ప్రయత్నించడం సాధ్యమే కానీ.. అంత సులభం మాత్రం కాదు. పాకిస్తాన్‌ కొద్దోగొప్పో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశం. హమాస్‌ లాంటి ఉగ్రవాద సంస్థ కాదు. అందువల్ల గాజా విషయంలో ఇజ్రాయెల్‌ చేసినట్లు మనం చేయలేం. ఉగ్రవాద మూలాలను పూర్తిగా తుడిచేయకుండా బాలాకోట్‌ దాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ వంటి చర్యలు విస్తృత ప్రయోజనాలు అందించవని పహల్గాం ఉగ్ర దాడి చెప్పకనే చెప్పింది. భారత్‌కు నిజమైన శత్రువులు ఉగ్రవాద సంస్థలు కావని.. వాటిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ సైన్యమని కొందరు రిటైర్డ్‌ సైన్యాధికారులు చెప్పారు. అందువల్ల పాక్‌ సైన్యమే దాని పర్యవసానాలను అనుభవించా లని అంటున్నారు. అయితే మనవైపు నుంచి కాకుండా మరో రూపంలో పాకిస్తాన్‌ సైన్యం నిజ మైన బాధ అనుభవిస్తోంది. ఆ దేశంలోని బలూచ్‌, సింధ్‌, ఖైబర్‌ ఫంక్తూన్‌ఖ్వా ప్రాంతాల్లో ఉగ్ర వాదులు వరుస దాడులు చేస్తూ వందలాది పాక్‌ సైనికులను మట్టుపెడుతున్నారు. ఈ దాడులు పాకిస్తాన్‌ సైన్యం అసమర్థతను ప్రపంచానికి చాటిచెప్పి తీవ్ర అవమానం మిగిల్చాయి. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ హిందువులపై, కాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యల్లో ఈ నిరాశ కనిపించింది. భారత్‌ ఇప్పడు తనను తాను ఉగ్రవాద బాధితురాలిగా చూపించుకోవచ్చు. అయితే తొందరపాటు ప్రతిస్పందన పనికిరాదు. అందరినీ సంతోషం పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. 1971లో బెంగాలీల తిరుగు బాటు ఆయుధంగా పాకిస్తాన్‌ను విడదీసే ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేశారు. కానీ ఆ వైఫల్యాల నుంచి పాక్‌ సైన్యం పాఠాలు నేర్చుకోలేదు. కశ్మీర్‌, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో దుశ్చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ దేశం మరోసారి విచ్ఛిన్నం ముంగిట నిలిచింది. కోవిడ్‌ తర్వాత కశ్మీర్‌లో పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. పర్యాటక ఆదాయమూ పెరిగింది. తాజా ఉగ్ర దాడి పర్యాటకరంగాన్ని విచ్చిన్నం చేస్తుందని స్థానికులు భయపడుతున్నారు. అదే సమయం లో పాకిస్తాన్‌ ఒక దేశంగా విఫలమైంది. జాతి నిర్మాణంపై అదెప్పుడూ దృష్టి పెట్టలేదు. ఇప్పడు దాని పతనాన్ని వేగవంతం చేయాలి. ఎన్నికల మైలేజ్‌ కోసం పాకులాడకుండా పటిష్టమైన విధా నాలు అమలు చేయాలి. ప్రముఖ రాజనీతిజ్ఞులైన మాకియవెల్లి, చాణక్యుడు చెప్పినట్లు బాహ్య శత్రువులను పరిహరించడానికి ‘భేదం’కి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. దండన అనేది చివరి ఆప్షన్‌గానే ఉండాలని వారు సూచించారు.

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page