మొక్కే కదా అని..!
- ADMIN
- Aug 30, 2024
- 1 min read
ఫారెస్ట్ అధికారుల తీరుపై కలెక్టర్ సీరియస్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మొక్కలు నాటామని చెప్పడం, ఆ పేరుతో నిధులు మింగేయ డం ఆ శాఖకు అలవాటు. నాటిని మొక్కలను సంరక్షిస్తున్నామని, అందుకోసం నిధులు ఖర్చయ్యాయని బొక్కేయడం వారికి ఆనవాయితీ. లేని మొక్కలకు పెన్షింగ్ వేశామని నిధులు దిగమింగేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం వన మహోత్సవానికి శుక్రవారం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఒక్కరోజుకే రూ.3లక్షలు కేటాయించింది. మరింకేముంది.. స్వయంగా రాష్ట్రమంత్రినే పిలిచి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఆయన చేతుల మీదుగా రెండు మొక్కలు నాటించి మమ అనిపించేశారు. ఇలా తినేయడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు రివాజేమో గానీ కొత్తగా వచ్చిన యువ ఐఏఎస్ అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు మాత్రం అంతా అయోమయంగా కనిపిం చింది. వన మహోత్సవమంటే వనాల్ని సృష్టించాలన్న తాపత్రయం కలెక్టర్దైతే, ఇది కేవలం ఫొటో కార్యక్రమమేనన్న అనుభవం ఫారెస్ట్ అధికారులది. స్వయంగా రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్లతో రెండు మొక్కలు నాటించి, నాలుగు పాఠశాలల నుంచి తెచ్చిన విద్యార్థులకు ఒక్కో మొక్క ఇచ్చి మమ అనిపించేశారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన ఈ ప్రోగ్రామ్ను చూసి కలెక్టర్ దినకర్కు ఒళ్లు మండిపో యింది. ఎక్కడా ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా, కనీసం ముందురోజు ప్రోగ్రం నిర్వహించే విధానాన్ని తనతో చర్చించ కుండా నేరుగా మంత్రి వస్తున్నారు కాబట్టి మీరు రావాలంటూ ఓ పిలుపునిచ్చి, అక్కడ ఏమాత్రం మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కలెక్టర్ మండిపడ్డారు. ఒక జన రేటర్ గాని, వచ్చిన విద్యార్థులకు బిస్కట్ గాని, మంచినీరు గాని ఇవ్వకుండా కేవలం కార్యక్రమం అయిపోయిందని ప్రకటించడం కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 21శాతం ఉన్న జిల్లా గ్రీనరీని 50శాతానికి పెంచా లని మంత్రి పిలుపునిచ్చినప్పుడు ఆయన అటవీశాఖ అధికారుల వైపు జాలిగా చూశారు.
Comments