విజయనగరంలో ఎచ్చెర్ల విద్యార్థి మృతి
రూమ్మేట్స్ పొంతన లేని సమాధానాలు
హత్యా, ఆత్మహత్యా? తేల్చలేని స్థితిలో పోలీసులు
చిన్నరావుపల్లిలో విషాద ఛాయలు
(సత్యంన్యూస్, ఎచ్చెర్ల)
సంతసీతారాంపురం పంచాయతీ పరిధి చిన్నరావుపల్లి గ్రామానికి చెందిన అన్నెపు లోకేష్(18) మృతి చెందాడు. అయితే లోకేష్ది హత్యా లేక ఆత్మహత్యా అనేది మిస్టరీగా మారింది. అందరితో కలివిడిగా, మంచిగా ఉండే లోకేష్ అకాల మృతి చెందడంతో తల్లిదండ్రుల ఆర్తనాధాలు, బంధువులు, స్నేహితుల కన్నీళ్లతో చిన్నరావుపల్లి యావత్తు శోకసంద్రంలో మునిగిపోయింది. 26వ తేదీ వేకువజామున రూమ్లో ఉరి పోసుకున్న అన్నెపు లోకేష్ది హత్యా, ఆత్మహత్యా అన్న వాదన జిల్లాలో బలంగా వినిపిస్తుంది. ముక్కోణపు ప్రేమకథలో ఓడిపోయి లోకేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా భావిస్తున్నా ఇదే లవ్స్టోరీలో లోకేష్ ప్రాణాలు తీశారని, అది ఆత్మహత్య కాదన్న వాదన కూడా అంతే స్థాయిలో ఉంది.
బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నరావుపల్లి గ్రామానికి చెందిన అన్నెపు గణేష్, అమ్మాజమ్మల కుమారుడే లోకేష్. గణేష్ తాపీమేస్త్రి కాగా అమ్మాజమ్మ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దోడు సంతోష్ కుమార్. రెండవ కుమారుడు లోకేష్. సంతోష్ డిగ్రీ పూర్తయి ఉద్యోగ వేటలో ఉంటూనే హీరో పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం కూటమి పార్టీ అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాడు. గ్రామాభివృద్ధిలో, ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ముందుంటున్నాడు.
ఇక రెండవ కుమారుడు లోకేష్కు మంచి భవిష్యత్తును అందివ్వాలన్న ఆశతో తల్లిదండ్రులు లక్షలాది రూపాయలను వెచ్చించి ఇంటర్మీడియట్ నుంచి హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. ఇంటర్ పూర్తైన లోకేష్ విజయనగరంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఒక వైపు డిగ్రీ చదువుతూనే.. మరోవైపు కాంపిటేటివ్ పరీక్షలకు కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు. క్లాస్మేట్స్తో కలిపి రూమ్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నాడు.
ఇదిలా ఉంటే 26న మధ్యాహ్నం 12 గంటల సమయంలో అన్నయ సంతోష్కు స్నేహితుల నుంచి ఫోన్ వచ్చింది. మీ తమ్ముడు లోకేష్ ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, రండి అంటూ ఫోన్ రావడంతో ఒక్కసారిగా షాక్ గురై బరువెక్కిన గుండెతో హుటాహుటిన కుటుంబ సభ్యులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. తండ్రి అన్నెపు గణేష్ తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని భావించి అక్కడి స్థానిక విజయనగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు రంగప్రవేశం చేసి మృతుడు లోకేష్ స్నేహితులు, సెల్ ఫోన్లో లభించిన ఆధారాలను బట్టి ఆరా తీయడం మొదలు పెట్టారు. 25న అంటే మంగళవారం రాత్రి 1.30 నుంచి 3 గంటల సమయంలో మృతి చెందినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పంచనామా నిర్వహించిన వైద్యులు సైతం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. ఇటీవలి తమ తరగతికే చెందిన ఓ విద్యార్థిని లోకేష్ ఇష్టపడినట్టుగా గుర్తించారు. ఇదే సమయంలో మరో యువకుడు కూడా అదే అమ్మాయిని లవ్ చేస్తున్నాడని స్నేహితులు ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో లోకేష్ మృతి మిస్టరీగా మారింది. లోకేష్ను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకేష్ ఉరి పోసుకునేందుకు చీర ఎక్కడి నుంచి వచ్చింది.. పోలీసులు వచ్చేసరికి డెడ్ బాడీని కిందకి దించేయడం వెనుక మర్మం ఏంటి.. వైర్/తాడుతో గొంతు బిగించినట్టుగా ఆనవాలు స్పష్టంగా ఉన్నా, కొక్కానికి మాత్రం చీర ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కాళ్లకు వైరు/తాడుతో కట్టి భిగించినట్టుగా గుర్తులు ఉన్నాయని చెబుతున్నారు. లోకేష్ ఉరి పోసుకుంటే కాళ్లు నేలకు ఆనేటంత పొడుగు ఉంటాడు. అటువంటప్పుడు పొడుగైన చీరతో వేలాడుతూ ఎలా ఉన్నాడు? మృతి చెందే సమయంలో స్నేహితులు లేకపోవడం, ఫోన్లు చేస్తే పొంతనలేని సమాధానాలు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ కోణంలోనే విజయనగరం వన్టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నరావుపల్లిలో విషాద ఛాయలు
కాగా అన్నెపు లోకేష్ మృతదేహం గురువారం చిన్నరావుపల్లి చేరుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కొడుకు లేడని ఇక రాడని తల్చుకుంటూ తల్లి అమ్మాజమ్మ చేస్తున్న ఆర్తనాధాలు ప్రతిఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. చిన్నరావుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments