మెగా మూవీపై మేకర్స్ మౌనం వీడక తప్పదా?
- Guest Writer
- Apr 6
- 3 min read

మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ మీదున్నారు. ఇటవల సంక్రాంతికి `మన శంకర వరప్రసాద్గారు` మూవీతో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్న చిరు అదే జోష్తో మరో సినిమాని రంగంలోకి దించేస్తాడని, అదే ఊపుతో మరో మూవీకి శ్రీకారం చుట్టేస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాదని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. `మన శంకర వరప్రసాద్గారు`కు ముందు చిరు మొదలు పెట్టిన భారీ గ్రాఫికల్ యాక్షన్ అడ్వెంచర్ `విశ్వంభర`. మల్లిడి వశిష్ట దర్శకుడు. సినిమా పూర్తయింది. యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.
ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదలై దాదాపు 15 నెలలు కావస్తోంది. అయినా సరే ఇప్పటికీ దీని రిలీజ్పై ఎలాంటి క్లారిటీ లేదు. టీమ్ నుంచి ప్రకటనా లేదు. గ్రాఫిక్స్ ఆశించిన స్థాయి క్వాలిటీగా లేవని గ్లింప్స్పై విమర్శలు వెల్లువెత్తడంతో సినిమా రిలీజ్ని మేకర్స్ నిరవధికంగా వాయిదా వేస్తూ వస్తున్నారు. గత పదిహేను నెలలుగా గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నా దానికి సంబంధించిన అప్ డేట్ని మేకర్స్ ఇవ్వడం లేదు. సినిమా రిలీజ్పై క్లారిటీకి రావడం లేదు. అయితే ఇదే సంస్థ నిర్మించిన `బైకర్` మాత్రం ఎలాంటి అడ్డంకులు, వాయిదాలు లేకుండా థియేటర్లలోకి వచ్చేసింది.
దీంతో `బైకర్`పై ఉన్న క్లారిటీ `విశ్వంభర`పై ఎందుకు రావడం లేదని. ఈ సినిమా రిలీజ్కు సంబంధించిన మేకర్స్ ఎందుకు స్పందించడం లేదనే కామెంట్లు ఇప్పడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించాల్సిందేనని అభిమానులు, నెటిజన్లు కోరుతున్నారు. మరి మేకర్స్ స్పందిస్తారా? లేక ఎప్పటిలాగే మౌనం పాటిస్తారా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే మెగాస్టార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన బాబి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కడానికి అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తోంది.
ఈ భారీ ప్రాజెక్ట్ని విజయ్తో `జన నాయగన `టాక్సిక్` మూవీలని నిర్మించిన వెంకట్ కె. నారాయణ నిర్మించబోతున్నారు. తెలుగులో ఆయనకిదే తొలి ప్రాజెక్ట్. దీన్ని ప్రకటించి చాలా నెలలే అవుతున్నా పట్టాలెక్కించాడానికి మాత్రం ఇప్పటికీ మేకర్స్ లో క్లారిటీ రావడం లేదు. కారణం `జన నాయగన్` రిలీజ్ ఆలస్యం కావడం, `అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్ పై చేస్తున్న వార్ కారణంగా `టాక్సిక్` రిలీజ్ వాయిదా పడటంతో మెగా ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది.
చిరు చేయనున్న భారీ ప్రాజెక్ట్ కావడం, `వాల్తేరు వీరయ్య` తరువాత బాబి డైరెక్షన్లో చిరు చేస్తున్న సినిమా కావడంతో దీని ప్రారంభం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరు 158వ ప్రాజెక్ట్గా పట్టాలెక్కనున్న ఈ మూవీ విషయంలో మేకర్స్ స్పందిస్తే కానీ ఇది ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా `విశ్వంభర` గురించి యువీ, చిరు 158 గురించి కెవిఎన్ బ్యానర్స్ స్పందిచాల్సిన అవసరం ఉంది. మరి వీరిద్దరు స్పందస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.
బుట్టబొమ్మ తెలుగులో ఇన్ని ప్రాజెక్ట్లు కోల్పోయిందా?

తెలుగులో క్రేజీ హీరోయిన్గా ఒక దశలో భారీ డిమాండ్తో హాట్ టాపిక్గా నిలిచింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. అల వైకుంఠపురములో` వరకు సాఫీగా సాగిన పూజా హెగ్డే ప్రయాణం ఆ తరువాత దారి తప్పింది. ఒక దశలో భారీ స్థాయిలో డిమాండ్ చేస్తూ వరుస స్టార్ హీరోల సినిమాల్లో నటించిన పూజకు తెలుగులో ఇప్పుడు పెద్దగా ఆవకాశాలు లేవు అనడం కంటే ఏ స్టార్ ప్రొడ్యూసర్ పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. కారణం భారీ స్థాయిలో పారితోషిం డిమాండ్ చేస్తుండటమేనని వార్తలు వినిపిస్తున్నాయి.
తన వద్దకు ఏ ప్రొడ్యూసర్ వెళ్లినా పూజా హెగ్డే భారీగా పారితోషికం డిమాండ్ చేస్తోందట. ఆ కారణంగానే తనని తీసుకోవాలనుకున్న నిర్మాతలు చాలా మంది మరో హీరోయిన్ని ఫైనల్ చేసుకుంటున్నారట. అలా ఇప్పటి వరకు పూజా హెగ్డే తెలుగులో పది క్రేజీ ప్రాజెక్ట్లని వదులుకోవాల్సి వచ్చిందని టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. పెరిగిన బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని పూజా హెగ్డే డిమాండ్ని ప్రొడ్యూసర్స్ పట్టించుకోవడం లేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
తెలుగులో `ఆచార్య` తరువాత పూజా హెగ్డే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. తెలుగులో ప్రయత్నాలు చేయడం మానేసి తమిళ, హిందీ ఇండస్ట్రీలపై దృష్టి సారించింది. హిందీలో రణ్వీర్ సింగ్తో `సర్కస్`, సల్మాన్ ఖాన్తో `కిసీకా భాస్ కిసీకా జాన్`, షాహీద్ కపూర్తో `దేవా`.., తమిళంలో సూర్యతో `రెట్రో` వంటి సినిమాల్లో నటించినా ఫలితం లేకుండా పోయింది. దళపతి విజయ్తో కలిసి రెండవ సారి `జన నాయగన్`లో నటిస్తే అది రాజకీయ కారణాల వల్ల ఇప్పటికీ రిలీజ్కు నోచుకోవడం లేదు.
ప్రస్తుతం తమిళంలో లారెన్స్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ `కాంచన 4`, హిందీలో వరుణ్ ధావన్తో `హై జవానీ తో ఇష్క్ హోనాహై`లో నటిస్తోంది. వీటిపైనే ఈ అమ్మడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇదిలా ఉంటే ఫైనల్గా తెలుగులో మరో క్రేజీ మూవీని పట్టేసింది బుట్టబొమ్మ. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న 41వ ప్రాజెక్ట్లో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ఎస్ ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దీంతో మళ్లీ ట్రాక్లోకి వస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
ఎక్కడయ్యా టైసన్?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేతిలో ఉన్న సినిమాల్లో `టైసన్ నాయుడు` ఒకటి. సాగర్ చంద్ర దర్శకుడు. రామ్ ఆచంట నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. పూర్తయిపోయింది కూడా. ‘టైసన్ నాయుడు’ తరవాత మొదలైన సినిమాలు కూడా విడుదలైపోయాయి. కానీ `టైసన్` మాత్రం తాబేలు పిల్లలా మెల్లగా నడుస్తోంది. మధ్యలో కొన్ని రీ షూట్లు జరిగాయని, అందుకే విడుదల ఆలస్యమైందని వార్తలు వినిపించాయి. ఈమధ్య ఈ సినిమాని కొంతమంది సన్నిహితులకు చూపించారని, అవుట్ పుట్ బాగా వచ్చిందని సమాచారం. అవుట్ పుట్ పై చిత్రబృందం సంతృప్తిగా ఉందని, త్వరిత గతిన పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి, విడుదల తేదీ ప్రకటించాలని భావిస్తున్నారు.
ఇప్పుడు ఓటీటీ బిజినెస్ కూడా క్లోజ్ చేసుకొంది. జియో హాట్ స్టార్ సంస్థ ఈ సినిమాని రూ.20 కోట్లకు కొనేసిందని టాక్. హిందీ డీల్ కూడా క్లోజ్ అయ్యాక.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారు. మరోవైపు ‘హైందవ’ అనే సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. లుధీర్ బై రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఈనెల 5న బెల్లంకొండ నిశ్చితార్థం జరగబోతోంది. నెలాఖరున పెళ్లి. అందుకే షూటింగులకు కూడా బెల్లంకొండ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...






Comments