మితిమీరిన వేగం.. గాలిలో ప్రాణం
- BAGADI NARAYANARAO

- May 28
- 1 min read
చంద్రమహల్ ఎదురుగా పేవ్మెంట్ను ఢీకొన్ని యువకుడి మృతి
గురువారం వేకువజామున 4 గంటలకు జరిగిన ప్రమాదం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలోని చంద్రమహాల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సూర్యమహల్ నుంచి రామలక్ష్మణ థియేటర్ వైపు గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో పేవ్మెంట్ను ఢీకొట్టి గాలిలో పల్టీలు కొట్టి పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి బలంగా తాకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆ సమయంలో మార్నింగ్వాక్కు వెళ్తున్న ఇద్దరు యాక్సిడెంట్ను గమనించినా, ఎవరికి సమాచారం ఇవ్వాలో తెలియకపోవడంతో పొద్దెక్కేవరకు దీన్ని ఎవరూ గమనించలేదు. అత్యంత వేగంగా 250 సీసీ కేటీఎం బైక్ మీద వెళ్తున్న బిర్లంగి గణేష్(20) చంద్రమహల్ ఎదురుగా రోడ్డు ఖాళీగా ఉన్నా పూర్తిగా ఎడమవైపునకు వెళ్లడంతో ఫుట్పాత్కు ఆనించి నిర్మించిన ర్యాంప్ను ముందుగా ఢీకొట్టాడు. ఆ వేగానికి గాలిలోకి శరీరం పల్టీలు కొట్టింది. కరెంటు స్తంభానికి ఢీకొనడంతో మరణించాడు. అసలు అంత వేకువజామున గణేష్ రోడ్డు మీదకు ఎందుకు వచ్చాడో, అంత వేగంగా ఎందుకు నడుపుతున్నాడో, రోడ్డు ఖాళీగా ఉన్నా పూర్తిగా ఎడమవైపునకు ఎందుకు రావాల్సివచ్చిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హయాతినగరానికి సమీపంలోని తోటపాలెం పరిధి టీచర్స్ కాలనీ (ఉద్యోగ స్వగృహ కాలనీ)కి చెందిన గణేష్ తండ్రి రామారావు ఉపాధ్యాయుడు కాగా, తల్లి వైద్యఆరోగ్యశాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఉద్యోగ స్వగృహ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కళ్ల ముందే విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. గణేష్ నగరంలోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గణేష్ ఇంతకు ముందు ఒకసారి ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో చేతికి ప్యాక్చర్ అయినట్టు భోగట్టా.






Comments