మీనాక్షి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
- NVS PRASAD
- May 3
- 1 min read

బాణసంచా పేలుడులో యువకుని కడుపులోకి స్టీల్ గ్లాస్ ముక్క
పెద్దప్రేగును అనేక చోట్ల చీల్చి 3.5 లీటర్ల రక్తస్రావం
ఎమర్జెన్సీ సర్జరీ చేసి కాపాడిన డాక్టర్ గొండు గంగాధర్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం నగరంలోని మీనాక్షి ఆసుపత్రిలో అరుదైన, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గొండు గంగాధర్రావు విజయవంతంగా నిర్వహించారు. గత నెల 22న 18 ఏళ్ల యువకుడు స్నేహితులతో బాణసంచాను స్టీల్ గ్లాస్లో పెట్టి పేల్చగా, స్టీల్ గ్లాస్ ముక్క ఒకటి అతడి పొట్ట భాగంలో కోసుకుందని మొదట సమీపంలోని క్లినిక్లో కుట్లు వేయించుకున్నారు. అయితే కడుపునొప్పి, కడుపు పొంగు ఎక్కువ కావడంతో యువకుడు అదే రోజు సాయంత్రం మీనాక్షి ఆసుపత్రిని సంప్రదించాడు. అప్పటికి ఆయన బీపీ చాలా తక్కువగా ఉండి, రక్తహీనత గమనించి టెస్టులు చేయగా పెద్దప్రేగులో స్టీల్ గ్లాస్ ముక్క ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేయగా, స్టీల్ గ్లాస్ ముక్క పెద్ద ప్రేగుని అనేక చోట్ల చీల్చి సుమారు 3.5 లీటర్ల రక్తస్రావానికి కారణమైనట్టు తేలింది. తక్షణమే స్టీల్గ్లాస్ ముక్కను తొలగించడంతో పాటు, రక్తస్రావాన్ని నియంత్రించి, పెద్ద ప్రేగుని తొలగించకుండా కుట్లు వేసి ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశారు. మొత్తం ఆరు ప్యాకెట్ల రక్తం ఎక్కించి, ఎమర్జెన్సీ సర్జరీ చేయటం వల్ల ప్రాణాలు కాపాడగలిగామని వైద్యులు గంగాధర్రావు తెలిపారు. అలాగే ప్రేగుని తొలగించకుండా సంరక్షించడం వలన (ఆర్గాన్ ప్రీజర్వింగ్ సర్జరీ) అతడికి భవిష్యత్తులో ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉండవన్నారు. ఈ ఆపరేషన్లో ఎనస్తీషియన్ డాక్టర్ ప్రసాద్, మీనాక్షి హాస్పిటల్ నర్సింగ్, ఇతర సిబ్బంది సహకారం అందించారు.
Comments