top of page

రమణగాడు.. అందరి లోడూ ఎత్తేశాడు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Dec 10, 2024
  • 3 min read
  • వ్యవస్థీకృతంగా నేరాలు

  • పోలీసుల్ని, పత్రికల్ని కొనేశాడని ఎస్పీకి బాధితుల ఫిర్యాదు

  • 11 మంది నుంచి రూ.50 లక్షలు వసూలు

  • ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తానని మోసం

  • బాధితుల మీదే భౌతిక దాడి

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ వ్యవస్థాపకుడు బీవీ రమణకు అంత సీన్‌ లేదని, తెర వెనుక ఇంకెవరో ఉన్నారని ‘సత్యం’ వ్యక్తం చేసిన అనుమానం వాస్తవమేనని నెమ్మదిగా జిల్లా పోలీసులకు అర్థమవుతుంది. సోమవారం ‘ఆర్మీకాలింగ్‌’ వెనుక ఇంకెవరో ఉన్నారు పేరుతో ‘సత్యం’ వెబ్‌సైట్‌లో కథనాన్ని పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తామని తమ వద్ద లక్షలాది రూపాయలు నొక్కేశాడంటూ నేరుగా ఎస్పీ గ్రీవెన్స్‌కే బాధితులు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రమణ వీడియో హల్‌చల్‌ చేసిన తర్వాత మాత్రమే ఇటువంటివారు బయటకు రావడం వెనుక ఇంకేవైనా రమణను తొక్కేసే కారణాలున్నాయని కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు. అయితే మాయలమరాఠీ బీవీ రమణ మీద ఉద్యోగాల పేరుతో మోసపోయినవారి పోరాటం ఈనాటిది కాదు. అయితే ఇప్పుడు పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారని, మీడియా కథనాలు రాస్తుందని తెలుసుకున్న బాధితులు ఈ రెండు వ్యవస్థలను ఇప్పుడు కొద్దిగా నమ్మి బయటకు వచ్చారు. ఈ రెండిరటి వల్లే గతంలో వీరు చేసిన పోరాటం బయటకు రాలేదు. దీంతో ఆర్మీకాలింగ్‌ రమణ తనకు తిరుగులేదన్న భావనతో చెలరేగిపోయాడు. ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన బాధితులు చెప్పిన అంశాలు వింటే ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ పేరుతో రమణ గుండెలుతీసిన బంటుగా ఎలా మారాడో అర్థమవుతుంది.

ఇండియన్‌ ఆర్మీలో వివిధ హోదాల్లో ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అనకాపల్లి, గజపతినగరం, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలుచేసినట్టు పదకొండు మంది బాధితులు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.మహేంద్రరెడ్డిని కలిసి సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఎస్పీ ఒకటో పట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లకు బాధితులను పంపించి డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో ఆర్మీ కాలింగ్‌ రమణపై కేసు నమోదు చేయించారు. ఇటీవల సోషల్‌ మీడియాలో హాల్‌చల్‌ చేసిన వీడియోల్లో బాధిత విద్యార్ధి సాడి నవీన్‌తో పాటు మరో నలుగురు విద్యార్ధులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసి రమణను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని బకాయిస్తున్న రమణకు కొందరు పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులు సహాయ సహకారాలు అందించినట్టు రమణ బాధిత నిరుద్యోగులు సోమవారం ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎందుకు రమణకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదని బాధితులను ఎస్పీ ప్రశ్నించినట్టు తెలిసింది. ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చి ఇన్నేళ్లు వేచిచూడడం కరెక్టు కాదని బాధితులను ఎస్పీ విచారించి తక్షణమే ఫిర్యాదు ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. ఎస్పీ ఆదేశాలతో శ్రీకాకుళం రూరల్‌, వన్‌ టౌన్‌లో 11 మంది బాధితులు రమణపై వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు తెలిసింది.

పోలీసులకూ పాత్ర

ఎస్పీని కలవడానికి వెళ్లిన బాధితులు చెప్పిన వివరాల మేరకు.. 2021లోనే ఆర్మీ కాలింగ్‌ రమణ వ్యవహారంపై నేవీ మాజీ ఉద్యోగి 80 మంది బాధితులను తీసుకొని శ్రీకాకుళం వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఆర్మీలో ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి రూ.లక్షలు వసూలుచేసి రమణ మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ బాధితులను బెదిరించి వెనక్కి పంపినట్టు వీరు ప్రస్తుత ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్మీ కాలింగ్‌ రమణ తరఫున అప్పటి ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ వకాల్తా పుచ్చుకొని మాట్లాడినట్టు బాధితులు ఎస్పీకి వివరించారు. పోలీస్‌స్టేషన్‌కు రావడం పట్ల ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేసి అందరిపైనా కేసు కట్టి ఉద్యోగాలు రాకుండా జీవితం నాశనం చేస్తానని బెదిరించినట్టు వారు చెప్పుకొచ్చారు. రమణకు వ్యతిరేకంగా ఎటువంటి కేసు నమోదు చేయనని, దిక్కున్నచోట చెప్పుకోండంటూ బెదిరించినట్టు తెలిపారు. ఆర్మీ కాలింగ్‌ రమణతో మాట్లాడానని, ఆఫీస్‌కు వెళితే తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తాడని, అయితే కేవలం ఐదుగురు మాత్రమే వెళ్లాలని ఎస్‌ఐ విజయకుమార్‌ అక్కడకు పంపించారని ఎస్పీకి బాధితులు తెలిపారు. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ సూచనలతో అక్కడికి వెళ్లిన తర్వాత ఐదుగురిపై రమణ దౌర్జన్యం చేయడంతో పాటు తనపై పోలీసులకు ఫిర్యాదు చేయిస్తావా అంటూ నేవీ మాజీ ఉద్యోగిపై దాడి చేసి ఆయన నుంచి ఫోన్‌ తీసుకొని దాన్ని ధ్వంసం చేశాడు. ఈ వ్యవహారంలో కొందరు జర్నలిస్టులు రంగప్రవేశం చేసి రమణకు అనుకూలంగా ఎవరిని కలిసినా ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో నేవీ మాజీ ఉద్యోగి ఎవరిని ఆశ్రయించాలో తెలియక రమణ అడ్డగోలు వ్యవహారంపై అప్పటి ఎస్పీకీ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, రమణకు పోలీసు శాఖలో కొందరు అధికారులు, సిబ్బంది సహకరించడం, జర్నలిస్టులు అండగా నిలవడంతో బాధితులు ఆయనపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేకపోయారని ఎస్పీ ముందు వాపోయారు. రమణ తన అరాచకాలను యథేచ్ఛగా సాగించడానికి అన్ని వ్యవస్థలను డబ్బులు ఇచ్చి మేనేజ్‌ చేస్తూ వచ్చాడని బాధితులు ఎస్పీకి వివరించి బోరుమని ఏడ్చినట్టు విశ్వసనీయ సమాచారం. వన్‌టౌన్‌ ఎస్‌ఐగా పనిచేసిన విజయ్‌కుమార్‌, అప్పటి రౖౖెటర్‌ ఉమ, కానిస్టేబుల్‌ గోవింద అండతోనే ఇదంతా జరిగిందని ఎస్పీ ముందు వాపోయారు.

11 మంది నుంచి రూ.50 లక్షలు

ఆర్మీ కాలింగ్‌ పేరుతో రమణ చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ప్రత్యేక దృష్టి సారించి చర్యలకు ఉపక్రమించడంతో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో పోలీసుల ముందుకు వచ్చినట్టు 11 మంది బాధితులు, తల్లిదండ్రులు ఎస్పీకి విన్నవించారు. ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగం వేయిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.6లక్షల నుంచి రూ.10 లక్షలు వసూలు చేసినట్టు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. సోమవారం ఎస్పీని కలిసి బాధితులే రూ.50 లక్షలు ఇచ్చినట్టు లెక్క తేలింది. డబ్బులు ఇచ్చిన వారందరికీ ఢల్లీిలో ఆర్మీ హెడ్‌క్వార్టర్‌లో డబ్బులు జమచేసినట్టు చూపించి ఎన్‌రోల్‌మెంట్‌ నెంబర్‌ ఇష్యూ అయినట్టు చూపిస్తూ అందరికీ బాండ్‌పేపర్లను కూడా ఇచ్చినట్టు బాధితులు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఒకటో పట్టణ పోలీసులు ఫిర్యాదు తీసుకోపోయినా కోర్టును ఆశ్రయించి రమణపై కేసు వేసినట్టు, ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు నడుస్తుందని బాధితులు చెబుతున్నారు. తమతో పాటు అనేక మంది నిరుద్యోగుల నుంచి ఆర్మీలో ఉద్యోగాలు వేయిస్తానని రూ.లక్షల్లో వసూలుకు పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. వ్యవస్థలన్నింటినీ రమణ మేనేజ్‌ చేస్తుండడంతో ఎవరూ ముందుకు రాలేకపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రమణ వెనుక కొందరు పెద్దస్థాయి పోలీసులు, జర్నలిస్టులు ఉన్నారని, వీరి వల్లనే ఎక్కువ మంది నిరుద్యోగులు గత ఆరేళ్లుగా మోసపోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు కాబట్టి తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని బాధితులు చెబుతున్నారు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page