రమ్మీ ఇచ్చే అప్పు.. రుణగ్రహీతలకు చావు డప్పు!
- NVS PRASAD
- May 7
- 4 min read

అప్పు తీసుకున్న వ్యక్తి పరారు
ష్యూరిటీ ఉన్న కుటుంబాన్ని పిండేస్తున్న రమ్మీ
ఖాళీ కాగితాలపై కొత్త అప్పులు రాసి దోపిడీ
వడ్డీలకే ఆస్తులన్నీ పోగొట్టుకున్న దళిత బాధితులు
చివరికి గత్యంతరం లేక డీజీపీకి ఫిర్యాదు
అప్పుల ఊబి అని ఎందుకంటారో దాన్ని సృష్టించేవారైనా మర్చిపోయి ఉండొచ్చేమో గానీ.. శ్రీకాకుళంలో బరాటం రమణమూర్తి అలియాస్ రమ్మీ వద్ద అప్పు తీసుకున్నవారినడిగితే ఆ ఊబిలో ఎలా కూరుకుపోతారో.. దాన్నుంచి బయటపడలేక ఆస్తులన్నీ రమ్మీ పేరిటే రిజిస్ట్రేషన్ చేసి బతుకుజీవుడా అని కట్టుబట్టలతో ఎలా మిగులుతారో చెబుతారు. ప్రస్తుతం రమ్మీకి ఉన్న ఆస్తులన్నీ వడ్డీ వ్యాపారం నిర్వహించడం వల్ల మాత్రమే సంపాదించినవనుకుంటే పొరపాటు. అసలు, వడ్డీ తీరిపోయాక కూడా అంతకు ముందు సంతకాలు చేయించుకున్న ఖాళీ కాగితాలు, ప్రాంశరీ నోట్లు, చెక్కులు వంటివి రుణగ్రహీతలకు తిరిగి ఇవ్వకుండా మళ్లీ వాటినే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి చెక్ బౌన్స్ కేసులు పెట్టడం, సంతకాలు చేసి ఉన్న ఖాళీ పేపర్లపై ఇష్టమొచ్చినట్లు అగ్రిమెంట్లు రాయించి జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లో పొలాలు, స్థలాలు కొట్టేసిన ఘనుడు రమ్మీ. జిల్లాలో ఓ దళిత కుటుంబాన్ని కట్టుబట్టలతో రోడ్డున పడేయడానికి కొన్నేళ్లుగా రమ్మీ చేస్తున్న విన్యాసాలు దీనికొక ఉదాహరణ. ఇంతకీ ఆ దళిత కుటుంబం చేసిన నేరమేమిటంటే.. చిన్ననాటి స్నేహితుడు వ్యాపారంలో ఎదుగుతాడన్న సదుద్దేశంతో ఆయన రమ్మీ దగ్గర వాడిన అప్పునకు ష్యూరిటీగా ఉండటమే. ఈ ఒక్క కారణంతోనే స్థానిక పాత హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన శిష్టు వంశీకృష్ణ అనే దళిత యువకుడు తనకు వారసత్వంగా వచ్చిన అన్ని ఆస్తులు కోల్పోయి ఇప్పుడు లాయర్ల చుట్టూ తిరుగుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గతంలో వైన్స్ రిప్రజెంటేటివ్గా పనిచేసిన పొట్నూరు బాలసుబ్రహ్మణ్యం (సుబ్బు) 2016లో మద్యం షాపుల టెండరులో పాల్గొనడానికి సహాయం చేయమని తన బాల్యమిత్రుడు శిష్టు వంశీకృష్ణను కోరాడు. తన కుమారుడితో పాటు చిన్నతనం నుంచి తన ఇంట్లోనే పెరిగాడన్న సానుభూతితో సుబ్బు రమ్మీ వద్ద తీసుకున్న అప్పునకు వంశీకృష్ణ తల్లి ష్యూరిటీ ఇచ్చారు. ఇందుకోసం పాత శ్రీకాకుళం రెవెన్యూ పరిధిలోని కిల్లిపాలెం గ్రామంలో తమకున్న 34 సెంట్ల భూమి పత్రాలు, 1బీ అడంగల్, పాస్బుక్, ఒరిజినల్ సేల్ డీడ్లు వంశీకృష్ణ తల్లి దగ్గరి నుంచి తీసుకున్న సుబ్బు వాటిని రమ్మీ వద్ద హామీగా ఉంచి రూ.4 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ భూమికి సంబంధించి 2016 జూన్ 24న అగ్రిమెంట్ రాయించుకొని రమ్మీ అంబేద్కర్ జంక్షన్ వద్ద ఉన్న ఎస్బీఐ బ్రాంచికి సంబంధించి చెక్ (నెంబరు 140674) రూపంలో రూ.4 లక్షల చెక్ ఇచ్చారు. అంటే.. ఈ లావాదేవీ అకౌంట్ఫర్గా జరిగిందన్నమాట. మద్యం షాపులు కేటాయించగానే కుదువ పెట్టిన స్థిరాస్తి పత్రాలు వెనక్కు ఇస్తానని చెప్పిన సుబ్బు వాటిని ఇవ్వలేదు. అప్పు ఇచ్చిన రమ్మీకి రూ.3 వడ్డీ చొప్పున ప్రతి నెలా రూ.12వేలు కడుతున్నానని, అసలు తీర్చిన వెంటనే కాగితాలు తెస్తానని వంశీ కుటుంబానికి చెప్పాడు. కానీ 2018 మార్చిలో మద్యం వ్యాపారంలో నష్టం వచ్చిందంటూ సుబ్బు తనకు అప్పిచ్చినవారందర్నీ ముంచేసి ఊరు విడిచి పారిపోయాడు.
ష్యూరిటీ ఇచ్చిన పాపానికి..
అంతవరకు స్థిరాస్తి పత్రాలు అగ్రిమెంట్ రూపంలో తాకట్టు పెట్టిన వంశీ కుటుంబం ఎక్కడుందో కూడా తెలియని రమ్మీ తన అసలు రూపం ప్రదర్శించడం ప్రారంభించాడు. గతంలో ఇచ్చిన రూ.4 లక్షలకు అదనంగా సుబ్బు మరో లక్ష రూపాయలు తీసుకున్నాడని, దానికి వడ్డీ రూ.3.60 లక్షలు పెండిరగ్ ఉందని.. మొత్తం కలిపి రూ.8.60 లక్షలు చెల్లించకపోతే సివిల్ కోర్టులో దావా వేస్తానంటూ బెదిరించారు. దీంతో సుబ్బు కుటుంబ సభ్యుల ద్వారా ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టిన వంశీ శ్రీకాకుళం తెచ్చి రమ్మీ ముందు కూర్చోబెడితే.. అదే హౌసింగ్బోర్డు కాలనీలో ఉన్న తమ ఇంటిని రూ.45 లక్షలకు పొట్నూరు భీమరాజు అనే వ్యక్తికి సేల్ కమ్ జీపీఏకు ఇచ్చినట్లు సుబ్బు ఒప్పుకున్నాడు. దీంతో పెద్దమనుషులు ఈ భవనం రూ.60 లక్షలు చేస్తుందని రమ్మీ సమక్షంలోనే తేల్చగా దాన్ని రమ్మీ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిర్చారు. అందులో భీమరాజుకు రూ.50 లక్షలు ఇచ్చేసి మిగిలిన సొమ్ముకు శిష్టు వంశీ కుటుంబం ష్యూరిటీతో రమ్మీ వద్ద ఉన్న బాకీని మినహాయించి భవనాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి సుబ్బు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పుడు సరేనని తలూపిన రమ్మీ వ్యవహారం సెటిల్ అయితే తన వద్ద ఉన్న బంగారు బాతు లాంటి పద్దు రద్దయిపోతుందని భావించి, అలా చేయకుండా జీపీఏ కమ్ సేల్ హక్కులున్న భీమరాజును వంశీ కుటుంబం మీదకు ఉసిగొల్పి అర్జంట్గా రూ.5.50 లక్షలు తనకు ఇచ్చి, తన పేరుతో అగ్రిమెంట్ రాయించుకుంటే గానీ తాను ఈ ఇంటిని వదలనని చెప్పించాడు. దాంతో గత్యంతరం లేక వంశీ కుటుంబం మళ్లీ అదే రమ్మీ వద్ద రూ.5.50 లక్షలు అప్పు చేసింది. పాత బకాయిలు అప్పటికే రూ.9.50 లక్షలకు చేరాయని, కొత్తగా తీసుకున్న రూ.5.50 లక్షలతో కలిపి రూ.15 లక్షలకు చేరిందని రమ్మీ 2018 అక్టోబర్ 17న కొత్త అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఆ మేరకు 2021 వరకు ప్రతి నెలా రూ.45 వేలు చొప్పున 32 నెలల పాటు వడ్డీ కట్టారు. అంటే.. ఒక్క వడ్డీయే రూ.14.40 లక్షలయింది. అలా వడ్డీ ఊబిలో ఆ కుటుంబం కూరుకుపోగా, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన వంశీ తల్లికి అందే పింఛను మొత్తం కూడా రమ్మీకి వడ్డీ చెల్లించడానికే సరిపోతున్న సమయంలో వంశీ అమ్మమ్మ చనిపోయింది.

మొత్తం చెల్లించేసినా పత్రాలు ఇవ్వకుండా..
ఈ సమయంలో సుబ్బు తీసుకున్న అప్పునకు హామీగా ఇచ్చిన పత్రాలు ఇస్తే స్థలాన్ని విక్రయించి అసలు, వడ్డీ కలిపి ఒకేసారి తీర్చేస్తామన్న ప్రతిపాదనతో వంశీ, ఆయన తల్లి రమ్మీని కలిశారు. అలా ఇవ్వనని.. అవసరమైతే మళ్లీ కొత్త పత్రాలు తాకట్టు పెడితే అప్పు ఇస్తానని ఆయన తెగేసి చెప్పాడు. దాంతో చేసేదిలేక హౌసింగ్బోర్డు కాలనీలో ఉంటున్న వంశీ ఇంటిపత్రాలు తాకట్టు పెట్టగా దానిపై రమ్మీ తన భార్య బరాటం లక్ష్మీ పేరు మీద అగ్రిమెంట్ రాయించుకొని 2018 డిసెంబరు 24న హెచ్డీఎఫ్సీ బ్యాంకు చెక్ నెంబరు 000045 ద్వారా రూ.6 లక్షలు, 2019 ఫిబ్రవరి 13న అదే బ్యాంకు చెక్ నెంబరు 000048 ద్వారా రూ.9 లక్షలు కలిపి రూ.15 లక్షలు అప్పు ఇచ్చారు. అంటే దీనికి మళ్లీ నెలనెలా రూ.45 వేలు చొప్పన 25 నెలలు వడ్డీ కట్టారు. అంటే.. రూ.11.25 లక్షలు వడ్డీ కిందే పోయింది. పాత, కొత్త అప్పులకు సంబంధించి కేవలం వడ్డీల కిందే రూ.25.65 లక్షలు చెల్లించారు. ఇలా అయితే తాము బతికే ఛాన్స్ లేదని తెలుసుకున్న తల్లీకొడుకులు రమ్మీ, ఆయన భార్య లక్ష్మి నుంచి చెక్కుల రూపంలో తీసుకున్న సొమ్ముకు చెక్కుల ద్వారా, నేరుగా తీసుకున్న సొమ్ముకు నేరుగానే మొత్తం చెల్లించేశారు. అప్పు తీరినందున తమ పత్రాలు తమకు ఇచ్చేయాలని కోరగా అవి ప్రస్తుతం తన వద్ద లేవని, వేరేచోట ఉన్నాయని.. రెండు రోజుల్లో తెచ్చి ఇస్తానని చెప్పిన రమ్మీ రెండు రోజుల తర్వాత ఖాళీ కాగితాల మీద మళ్లీ కొత్త అప్పు రాసి, ఇంకా తనకు రూ.25 లక్షలు బకాయి ఉన్నారని, అది చెల్లించకపోతే తన వద్ద ఉన్న ఆస్తిపత్రాల అగ్రిమెంట్తో కోర్టుకు వెళతానని భయపెట్టడంతో కిల్లిపాలెంలో ఉన్న స్థలాన్ని రమ్మీకే రిజిస్ట్రేషన్ చేసేసి ఓ దండం పెట్టేశారు.

దస్తావేజుల్లో తప్పుడు వివరాలు
కిల్లిపాలెంలో గల వ్యవసాయ భూమిని తన పేరిట రిజిస్టర్ చేసినందుకు సేల్డీడ్ నెంబరు 5724/2021లో 2018 జూన్ 23న చెక్ ఇచ్చినట్లు రిజిస్ట్రార్ ఆఫీసు దస్తావేజులో చూపించారు. కానీ ఇది 2016న ఇచ్చారు. అలాగే తన భార్య పేరు మీద హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి 2018 డిసెంబరు 24న చెక్కు ఇస్తే.. అది కొటక్ మహీంద్రా బ్యాంకు నుంచి ఇచ్చినట్లు దస్తావేజుల్లో రమ్మీ రాయించాడు. ఎందుకంటే.. తాను ఒరిజినల్గా ఏ బ్యాంకు నుంచి చెక్కులిచ్చాడో వాటిని కావాలనే పక్కన పెట్టి, వాటి పేరుతో మళ్లీ అప్పు ఇచ్చినట్టు చూపించి హౌసింగ్బోర్డులో ఇల్లు రాయించుకోవాలన్నది రమ్మీ పన్నాగం. దాంతో చేసేదిలేక ఈ దళిత కుటుంబం రాష్ట్ర డీజీపీకి, సీఐడీకి సుదీర్ఘమైన లేఖ రాసింది. రమ్మీ స్నేహితులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తే సంతకాలు చేసిన ఖాళీ తెల్లకాగితాలు, డేటు, మొత్తం లేకుండా రాయకుండా ఉన్న ప్రాంశరీ నోట్లు, వేలాది చెక్కుల జిరాక్స్ కాపీలు బయటపడతాయని, అలాగే భార్యాభర్తల ఆధార్ కార్డుల ఆధారంగా ఎవరెవరి స్థలాలు ధారాదత్తం చేసుకున్నారో తేలుతుందని పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ, కోటక్ బ్యాంకుల్లో భార్యాభర్తల లావాదేవీలు పరిశీలించాలని, రమ్మీ బాధితులను విచారించాలని ఈ ఫిర్యాదులో కోరారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తునకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.
స్థానిక జీటీ రోడ్డులో ఎలక్ట్రికల్ వ్యాపారం చేస్తున్నట్టు కనిపిస్తున్న భైరి శ్రీనుకు, రమ్మీకి ఉన్న సంబంధం ఏమిటి? భైరి శ్రీను అప్పిస్తే.. రమ్మీ మనుషులు ఎందుకు వసూలు చేస్తున్నారు? భైరి శ్రీనుకు ఇచ్చిన చెక్కుకు రమ్మీ పేరుతో ఎందుకు కేసు పడుతుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు మరో కథనంలో తెలుసుకుందాం.
Comments