రాజకీయ తంత్రం.. బాయ్కాట్ మంత్రం!
- BAGADI NARAYANARAO
- May 2
- 3 min read

తనను పట్టించుకోవడంలేదని బల్ల గిరిబాబు మనస్తాపం
టీడీపీ నేతల దన్నుతో పనులు చక్కబెడుతున్న కమిషనర్
తనను పట్టించుకోవడంలేదని మున్సిపల్ ఛైర్మన్ ఆగ్రహం
అందుకే కాంట్రాక్టర్ సాకుతో కౌన్సిల్ సమావేశం బాయ్కాట్
మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహించే చైర్మనే ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందంటూ బాయ్కట్ చేస్తున్నానని ప్రకటించి మద్దతుదారులతో కలిసి సమావేశ హాలు నుంచి వెళ్లిపోవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఏదైనా అభ్యంతరం ఉంటే సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయే అవకాశం ఉన్నా, బాయ్కట్ చేస్తున్నానంటూ చైర్ దిగి వెళ్లిపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పలాస`కాశీబుగ్గ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైైర్మన్ బల్ల గిరిబాబు వ్యవహరించిన తీరుపై వైకాపాలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాయ్కట్ అన్నమాట వాడటమంటే కౌన్సిల్కు హాజరుకాననే సందేశం ఇవ్వడమేనని కౌన్సిల్లో అధికార, ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సంప్రదాయం ప్రకారం చైర్మన్ అనుమతితోనే కౌన్సిల్ సమావేశంలో అజెండా ప్రవేశపెడతారు. అందులో పొందుపరిచే అంశాల గురించి సమావేశానికి రెండు రోజుల ముందే చైర్మన్కు కమిషనర్ వివరిస్తారు. చైర్మన్ ఓకే అంటేనే సమావేశంలో అజెండా ప్రవేశపెట్టి.. చర్చ జరిపి ఆమోదిస్తారు. ఒకవేళ చైర్మన్కు చెప్పకుండా అజెండాలో కొత్త అంశం చేర్చితే దాన్ని తొలగించి మిగతావాటికి ఆమోదం తెలుపుతారు. మొత్తం అజెండాను లేదా అందులోని కొన్ని అంశాలను సస్పెండ్ చేసే అధికారం ఛైర్మన్కు ఉంది. అదే కారణంతో కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయవచ్చు. అలా చేయకుండా చైర్మనే సమావేశాన్ని బాయ్కట్ చేస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోవడం ఏం సంస్కృతి అంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు విమర్శిస్తున్నారు. అజెండాపై సంతకం చేసిన ఛైర్మనే కౌన్సిల్లో అది చర్చకు వచ్చినప్పుడు రాద్ధాంతం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బాయ్కట్ చేస్తున్నట్లు ప్రకటించిన ఛైర్మన్ గిరిబాబు తనతోపాటు వైకాపా కౌన్సిలర్లను బయటకు తీసుకెళ్లిపోయారు. దీంతో కమిషనర్ రామారావు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
ప్రోటోకాల్ వివాదమే కారణం
మున్సిపల్ కమిషనర్, అధికారులు తనకు సహకరించడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పడానికి చైర్మన్ గిరిబాబు చేసిన ఈ ప్రయత్నం బెడిసికొట్టిందని స్థానిక రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల పట్టణంలో జరుగుతున్న వరుస ఘటనలు చైర్మన్ గిరిబాబుకు మనస్తాపం కలిగించాయని తెలిసింది. బొడ్డపాడు వద్ద వేసిన ఎంఐజీ లే అవుట్ ప్లాట్లను లాటరీ ద్వారా ఇటీవల కొందరికి కేటాయించారు. లబ్ధిదారులకు వారి పేర్లతో ప్రొసీడిరగ్స్ తయారుచేయించి పంపిణీ చేశారు. మెప్మా కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావుతో వీటిని పంపిణీ చేయించారు. ఈ కార్యక్రమం గురించి మున్సిపల్ చైర్మన్ గిరిబాబుకు సమాచారం ఇవ్వలేదు. పది రోజుల క్రితం టీడీపీ కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 24వ వార్డులో పవర్బోర్ను కమిషనర్ దగ్గరుండి టీడీపీ నాయకులతో ప్రారంభించేశారని ఆరోపణలున్నాయి. చైర్మన్కు సమాచారం ఇవ్వకుండా కమిషనర్ అంతా నడిపిస్తున్నారన్న అసంతృప్తి గిరిబాబులో ఉందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా గిరిబాబు వెళ్లారు. అయితే అప్పటికే టీడీపీ నాయకుడు వజ్జ బాబూరావు దానికి రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోయారు. గిరిబాబు, ఆయన సోదరుడిపై గతంలో దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సప్ప నవీన్ను అదే షోరూం నిర్వాహకులు సన్మానిస్తుండటంతో ఛైర్మన్ అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం. అక్కడి నుంచి నేరుగా కౌన్సిల్ సమావేశానికి వెళ్లిన గిరిబాబు వరుసగా ఎదురవుతున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అజెండా అంశమైన వాటర్ వర్క్స్పై చర్చ జరుగుతుండగానే కౌన్సిల్ సమావేశాన్ని బాయ్కట్ చేస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు.
వాటర్ వర్క్స్ టెండర్పై రచ్చ
కాగా అజెండాలో పేర్కొన్న వాటర్ వర్క్స్ టెండర్ల అంశంపై చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వైకాపా హయాంలో పట్టణంలో చేపట్టాలని నిర్ణయించిన పనులకు సంబంధించిన టెండర్లను దక్కించుకున్నా పనులు చేయకుండా కాంట్రాక్టర్ బమ్మిడి రామకృష్ణ కాలయాపన చేయడంపై కౌన్సిల్లో చర్చకు వచ్చినట్టు తెలిసింది. గతంలో పొందిన పనులు చేయని రామకృష్ణ తాజాగా వాటర్ వర్క్స్ పనుల టెండర్ను తక్కువ రేటు కోట్ చేసి దక్కించుకున్నారు. దీనిపై చైర్మన్ గిరిబాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో టెండర్లు దక్కించుకున్న పనులే చేయని కాంట్రాక్టర్కు మళ్లీ ఎలా టెండర్ ఖరారు చేస్తారని కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే వాటర్ వర్క్స్ పనులకు ఆమోదం తెలపాలని టీడీపీ కౌన్సిలర్లు జి.సూర్యనారాయణ, డి.శ్రీకాంత్ చైర్మన్ను కోరారు. వేసవిలో నీటి ఎద్దడి, ప్రజల అవసరాల దృష్ట్యా ఇది అవసరమన్నారు. అయితే కమిషనర్ రామారావు ఈ వ్యవహారంలో సమావేశాన్ని తప్పుదోవ పట్టించారని, ప్రోటోకాల్ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ గిరిబాబు బయటకు వచ్చేశారు.
పోటాపోటీగా వసూళ్లు
వైకాపా అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్ గిరిబాబుదే అసలూ కొసరు అన్నీను. డబ్బులిచ్చి ఆ పదవి కొనుక్కున్నారన్న ప్రచారం ఉండేది. ఈ వ్యవహారంలోనే మాజీ మంత్రి సీదిరికి, గిరిబాబుకు మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరిగింది. ఆ గ్యాప్ కారణంగానే సార్వత్రిక ఎన్నికల సమయంలో సీదిరితో ఎన్నికల ప్రచారానికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాల్టీకి కొత్త కమిషనర్ వచ్చారు. కొత్తగా వచ్చిన అధికారి ఉమా అనే చిరుద్యోగిని వసూళ్లకు ఏజెంట్గా ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో చైర్మన్, కమిషనర్ మధ్య గ్యాప్ పెరిగింది. ఎవరికి వారే ప్లాన్ అనుమతులు ఇవ్వడం, వీఎల్టీ వసూళ్లు చేయిస్తుండటంతో ఇద్దరి మధ్య క్లాష్ వచ్చినట్లు తెలిసింది. వార్డుల్లో కొత్త నిర్మాణాలకు ఫోటోలు తీసి కార్యాలయానికి పిలిపించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు అధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రోటరీనగర్లో ఒక నిర్మాణానికి రూ.1.50 లక్షలు డిమాండ్ చేసినట్టు అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే పురపాలక సంఘంలో రచ్చకు కారణమైందని విమర్శలు వినిపిస్తున్నాయి.
Comentarios