top of page

రోణంకికి కళింగ కార్పొరేషన్‌.. కొరికానకు సుడా

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Nov 9, 2024
  • 2 min read
  • కావలి గ్రీష్మ, పాలవలస యశస్విలతో ఉమ్మడి జిల్లాకు 4 పోస్టులు

  • రెండో జాబితాలోనూ జిల్లాకు అగ్రతాంబూలమిచ్చిన కూటమి

  • మొదటిసారి కంటే ఈ కూర్పు అదుర్స్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) చైర్మన్‌గా పాతపట్నానికి చెందిన కొరికాన రవికుమార్‌ను నియమించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రాష్ట్ర కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా రోణంకి రామకృష్ణంనాయుడును నియమించింది. ఇక రాష్ట్ర మహిళా కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కావలి గ్రీష్మ, తూర్పుకాపు సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా పాలవలస యశస్వినిని నియమించినట్లు శనివారం ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాను ప్రాతిపదికన తీసుకుంటే నాలుగు ప్రాధాన్యత గల పోస్టులు జిల్లాకు లభించినట్లయింది. మొదటిసారి ప్రకటించిన కార్పొరేషన్ల చైర్మన్ల కంటే రెండో విడతలో వచ్చిన పదవులు జిల్లాకు కిక్‌ ఇచ్చాయి. చంద్రబాబునాయుడు ఈసారి పూర్తిగా పాత తరాన్ని పక్కన పెట్టి, కొత్త రక్తాన్ని ఎక్కిస్తున్నారని పరోక్షంగా ప్రకటించినట్లయింది. ఇందులో సుడా చైర్మన్‌గా నియమితులైన కొరికాన రవికుమార్‌ గత కొన్నాళ్లుగా పాతపట్నం నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. ఈయన భార్య భవాని గడిచిన ఎన్నికల్లో జనసేన కోసం పాతపట్నంలో కీలకంగా పని చేయగా, పాలకొండ నియోజకవర్గంలో జనసేన తరఫున పోటీ చేసిన నిమ్మక జయకృష్ణ గెలుపు కోసం కొరికాన రవికుమార్‌ ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచారు. రాష్ట్రంలో అనేకచోట హేచరీస్‌ వ్యాపారం నిర్వహిస్తున్న కొరికాన రవికుమార్‌కు పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన మాట ప్రకారం సుడా చైర్మన్‌గా నియమించారు. ఇక కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులైన రోణంకి కృష్ణంనాయుడు నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలానికి చెందిన కరుడుగట్టిన రాజకీయవేత్త. 1995 సమయంలో ఈయన అక్కడ జెడ్పీటీసీగా పని చేశారు. న్యాయవాద వృత్తిలో ఉంటూ కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించారు. ఎప్పుడైతే కాంగ్రెస్‌లో నేతలంతా వైకాపాకు వెళ్లిపోయారో, అప్పుడు ఈయన తెలుగుదేశం గూటికి చేరారు. రోణంకి కృష్ణంనాయుడుకు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి. ఇక మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మకు రాష్ట్ర మహిళా కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. కావలి గ్రీష్మ 2019, 2024ల్లో తెలుగుదేశం టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు. అయితే రాజాం మాత్రమే అప్పటికి ఉమ్మడి జిల్లాలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో పార్వతీపురం టిక్కెటైనా ఇవ్వాలని కోరారు. సమీకరణాలు కుదరకపోవడంతో ఆమెను పక్కన పెట్టారు. ఎన్నికల ముందు జరిగిన తెలుగుదేశం మహానాడులో బహిరంగ వేదిక మీద తొడకొట్టి సవాల్‌ విసరడంతో ఒక్కసారిగా కావలి గ్రీష్మ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. కావలి ప్రతిభాభారతి కూతురుగానే కాకుండా తెలుగుదేశం రక్తమే తనలో కూడా ఉందని చూపించిన ఆమెకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవి ఇచ్చారు. ఇక మిగిలింది తూర్పుకాపు సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్‌. దీనిని పాలవలస యశస్వినికి కేటాయించారు. పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ పెట్టిన దగ్గర్నుంచి ఆమె పాతపట్నం కేంద్రంగా ఉంటూ రాష్ట్రస్థాయి జనసేన భావజాల వ్యాప్తిలో పని చేస్తున్నారు. జిల్లాలో జనసేనకు ఉన్న మేథోపరమైన కేడర్‌లో ఈమె మొదటి వరుసలో ఉన్నారు. యశస్విని పాలవలస రాజశేఖరం తమ్ముడి కూతురు. ఈమె తండ్రి చిన్నరాజు కూడా 2006లో వీరఘట్టం ఎంపీపీగా పని చేశారు. యశస్విని 2024లో జనసేన తరఫున విజయనగరం సీటు ఆశించారు. అయితే ఆ పక్క నియోజకవర్గంలోనే లోకం మాధవికి టిక్కెట్‌ ఇస్తానని ఎన్నికల వేడి రాజుకోక ముందే పవన్‌కల్యాణ్‌ ప్రకటించడంతో యశస్వినికి అక్కడ సీటు ఇవ్వలేకపోయారు. దీంతో ఆమెకు తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి లభించింది. యశస్విని కుటుంబంలో తాత, నాన్నమ్మ దగ్గర్నుంచి పెదనాన్న, చిన్నాన్న, మేనమామ కొడుకు వరకు అందరూ రాజకీయాల్లో అనేక పదవులు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండో విడత ప్రకటించిన జాబితాలో అన్నింటికంటే ప్రధానమైన అంశమేమిటంటే.. స్టూడెంట్స్‌ ఎథిక్స్‌ అండ్‌ వాల్యూస్‌ అంశంలో ప్రభుత్వానికి సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమించారు. ఇది పూర్తిగా కేబినెట్‌ ర్యాంకు పదవి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page