top of page

లారెన్స్‌ బిష్ణోయ్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ ఏంటి..?

  • Writer: ADMIN
    ADMIN
  • Oct 16, 2024
  • 4 min read

- రమణ కొంటికర్ల

ఏకంగా మహారాష్ట్రలో ఓ శాసనసభ్యుడిగా ఉన్న తన కొడుకు జీషాన్‌ సిద్ధిఖీ కార్యాలయం వద్దే బాంద్రాలో తండ్రి బాబా సిద్ధిఖీ దారుణహత్య తర్వాత.. ఇప్పుడు లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు మరోసారి మార్మోగుతోంది. అంతేకాదు.. ఆయన టార్గెట్స్‌ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. కానీ, ముంబై పోలీసులు మాత్రం గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ను అదుపులోకి తీసుకోలేకపోతున్నారు. ఎందుకు..?

మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖ నాయకుడు. 2004 నుంచి 2008 వరకూ నాటి మహారాష్ట్ర కాంగ్రెస్‌-ఎన్సీపీ అలయెన్స్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినవాడు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌ షారూఖ్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి వారెందరితోనో సత్సంబంధాలు కలిగిన ఓ సెలబ్రిటీ హోదా కలిగిన 66 ఏళ్ల బాబా సిద్దిఖీ.. అక్టోబర్‌ 12 శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో అతి దారుణంగా హత్యకు గురయ్యాడు.

సిద్ధిఖీ హత్యలో పాల్గొన్న ముగ్గురు ముష్కరులకు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో సంబంధం ఉందని ముంబై పోలీసులు ధృవీకరించారు. వారి కోసం ఓవైపు పోలీసుల గాలింపు కొనసాగుతూనే ఉన్నా.. మరోవైపు హత్యకు ప్రధాన కారణమని భావిస్తున్న లారెన్స్‌ బిష్ణోయ్‌ను అరెస్ట్‌ చేయడానికి మాత్రం ముంబై పోలీసులకు ఇప్పుడు న్యాయపరమైన సవాళ్లెదురవుతున్నాయి. ఇప్పటికే తమ కస్టడీకి బిష్ణోయ్‌ని ఇవ్వాలని ముంబై పోలీసులు కోరుతున్నా.. హోంమంత్రిత్వ శాఖ మాత్రం అనుమతినివ్వడం లేదు.

బిష్ణోయ్‌ ప్రస్తుతం డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. కానీ, గుజరాత్‌ సబర్మతి జైలు నుంచి ఆయన్ను ముంబై పోలీస్‌ కస్టడీ బదిలీకి మాత్రం హోంమంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 268 ప్రకారం ఏ రాష్ట్రం గానీ, ఏజెన్సీ గానీ.. ఒక సంవత్సరం వరకూ కూడా అతని కస్టడీని కోరేందుకు వీల్లేదన్నది ఆ సెక్షన్‌ నిబంధన.

ఈ సెక్షన్‌ ఖైదీల కస్టడీని నిరోధించే అధికారాన్ని ప్రభుత్వానికిచ్చింది. ముఖ్యంగా శాంతిభద్రతలను ప్రభావితం చేసే అవకాశమున్నందున ఈ సెక్షన్‌ పకడ్బందీగా అమలవుతోంది. ఈ ఆర్డర్‌ 2024 ఆగస్టు వరకు అమలులో ఉండగా.. మళ్లీ 2025 ఆగస్టు వరకు మరో సంవత్సరం పొడిగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లారెన్స్‌ బిష్ణోయ్‌ విచారణ జరక్కపోతే.. సిద్ధిఖీ సుపారీ హత్య వెనుక బిష్ణోయ్‌ ఉన్నాడనే ప్రచారం తప్ప వాస్తవాలు మరింత కచ్చితంగా బయటకు రావడంలో పోలీసులకు అడ్డంకులు తప్పకపోవచ్చు.

మరోవైపు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌తో పాటు.. సిద్ధిఖీ కుమారుడు, ప్రస్తుత వాంద్రే ఈస్ట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జీషాన్‌ సిద్ధిఖీ, స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ, ఇప్పటికే తన చేతుల్లో హత్యకు గురైన పంజాబ్‌ సింగర్‌ సింధూ మూసేవాల్‌ మేనేజర్‌ షగుణ్‌ ప్రీత్‌ సింగ్‌, మరో ఆపోనెంట్‌ గ్యాంగ్‌స్టర్‌ కౌశల్‌ చౌదరీ, కౌశల్‌ చౌదరీకి ప్రధాన అనుచరుడైన అమిత్‌ దగార్‌ వంటివారెందరో బిష్ణోయ్‌ హిట్‌ లిస్టులో ఉన్నట్టు ఇప్పటికే ఇంటలిజెన్స్‌ రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో.. బిష్ణోయ్‌ని కస్టడీలోకి తీసుకోకపోతే ఇంకా ముందేం జరుగబోతుందో కూడా కనీసం అంచనాకు రాలేని పరిస్థితి. దీంతో బిష్ణోయ్‌ కస్టడీ ముంబై పోలీసులకు ఓ సవాల్‌గా మారింది.

జైల్లో నుంచి కూడా ఎలా పని చేస్తాడు..?

జైల్లో ఉన్నప్పటికీ గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కి ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఉన్న మొబైల్‌ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. తన నెట్‌వర్క్‌లోని వివిధ రాష్ట్రాల్లోని తన తోటి ముఠా సభ్యులకు కాల్స్‌ చేయడానికి వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌) సేవలను కూడా ఉపయోగిస్తాడు. ప్రధానంగా సిగ్నల్‌, టెలిగ్రామ్‌ వంటి యాప్స్‌తో తన కార్యకలాపాలను, తన లక్ష్యాలను జైలు నుంచే నడిపించడంలో లారెన్స్‌ బిష్ణోయ్‌ టాప్‌ ఆఫ్‌ ది బాప్‌.

ఒక దావూద్‌ ఇబ్రహీం, ఒక ఛోటా షకీల్‌ వంటివారి పేర్లు గతంలో వినిపించే క్రమంలో వారెక్కడ దాక్కున్నారో తెలిసేది కాదు. పైగా విదేశాల నుంచే వారి మాఫియా మొత్తాన్నీ నడిపించేవారు. కానీ, బిష్ణోయ్‌ నేర చరిత్ర అందుకు పూర్తి భిన్నమైంది. ఇక్కడే ఉంటాడు. అరెస్టై జైలు ఊచలు లెక్కబెడుతున్నా సరే.. నేరాలే తన వృత్తి, ప్రవృత్తి అన్నట్టుగా జైలు నుంచే తన టార్గెట్స్‌ను లేపేస్తాడు. కథంతా నడిపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బిష్ణోయ్‌ క్రైమ్‌ హిస్టరీ.. ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాను తలదన్నేది.

ఈ ఏడాది ప్రారంభంలో బిష్ణోయ్‌.. జైలు నుంచే పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ షాజాద్‌ భట్టితో వీడియో కాల్‌లో మాట్లాడంటేనే.. జైల్లో తానేం చేయదల్చుకుంటే అది ఎలా చేసేస్తున్నాడో చెప్పడానికి మచ్చుకు ఓ ఉదాహరణ. ఆ సంభాషణ సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. బిష్ణోయ్‌ పేరు మరోసారి సిద్ధిఖీ హత్యనంతరం వెలుగులోకి వచ్చిందనుకుంటున్నామే గానీ.. తన పరిధి ఉత్తర అమెరికా వరకూ పాకింది. డ్రగ్స్‌, మానవ అక్రమ రవాణా, మర్డర్స్‌, సుపారీ హత్యలు, స్మగ్లింగ్‌, ఆయుధాల అక్రమ రవాణా వంటి ఎన్నో వ్యవస్థీకృత నేరాల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఇండియాలోనే ఓ టాప్‌ మోస్ట్‌ వాంటెడ్‌ గా పేరుకెక్కాడు. కెనడాకు చెందిన ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూపులతో కూడా బిష్ణోయ్‌కి బలమైన సంబంధాలున్నాయి. పైగా అక్రమమార్గాల్లో సంపాదించిన మొత్తాన్ని హవాలా మార్గంలో కెనడా వంటి దేశాలకు పంపుతున్నట్టుగా కూడా నిఘా సంస్థలు పసిగట్టాయి.

నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ ప్రకారం బిష్ణోయ్‌ దేశవ్యాప్తంగా 700 మందితో తన గ్యాంగ్స్‌కు నెట్‌వర్క్‌ను ఏర్పర్చుకున్నాడు. బిష్ణోయ్‌ నేర సామ్రాజ్యంలో ఆయన అభిమానులుగా, అనుచరులుగా అదే స్థాయి కరడుగట్టిన నేరస్థులున్నట్టుగా కూడా ఎన్‌ఐఏ పేర్కొంది. వారిలో గోల్డీ బ్రార్‌, సచిన్‌ తపన్‌, ఆన్‌ మోల్‌ బిష్ణోయ్‌, విక్రమ్‌ జీత్‌ సింగ్‌, కాలా జతేరీ, కాలా రాణా వంటి వారెందరో బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో సంబంధాలు కల్గి ఉన్న టాప్‌ మోస్ట్‌ క్రిమినల్స్‌.

అసలు లారెన్స్‌ బిష్ణోయ్‌ ఎవరు..?

31 ఏళ్ల లారెన్స్‌ బిష్ణోయ్‌ పంజాబ్‌ ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని దత్తరన్‌వాలి గ్రామవాసి. తండ్రి వ్యవసాయదారుడు. బిష్ణోయ్‌ సామాజిక వర్గానికి చెందిన లారెన్స్‌ కులస్థులు పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తారు. ప్రాథమిక విద్య తర్వాత కళాశాల చదువుల కోసం 2010లో చండీగఢ్‌కు వెళ్లాడు. డీఏవీ కళాశాలలో చేరి విద్యార్థి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాడు. 2011-12 మధ్య స్టూడెంట్స్‌ ఆఫ్‌ పంజాబ్‌ యూనివర్సిటీ సంస్థకు అధ్యక్షుడయ్యాడు.

నేరచరిత్ర ప్రారంభమిలా..

అసలు లారెన్స్‌ బిష్ణోయ్‌ నేరచరిత్ర 2010లోనే విద్యార్థి రాజకీయల సమయంలోనే మొట్టమొదటే హత్యాయత్నానికి సంబంధించింది కావడం తన ప్రవృత్తిని సూచించేది. అలా విద్యార్థీ రాజకీయాల్లోనే మూడు కీలక కేసుల్లో నేరస్థుడిగా తనపై ఎఫ్‌ఐఆర్స్‌ నమోదయ్యాయి.

పంజాబ్‌లోని ఫాజిల్కాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడు జస్వీందర్‌ సింగ్‌ అలియాస్‌ రాకీ బృందంలో చేరి.. లారెన్స్‌ బిష్ణోయ్‌ పూర్తిస్థాయి క్రిమినల్‌గా రూపాంతరం చెందాడు. రాకీ మరో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌ జైపాల్‌ భుల్లర్‌ చేతుల్లో హత్యకు గురి కాగా, ఆ తర్వాత భుల్లర్‌ కోల్‌కతాలో పోలీసుల కాల్పుల్లో 2020లో ఎన్‌కౌంటరయ్యాడు. అలా గ్యాంగ్‌స్టర్స్‌లో కీలక నేతగా ఎదిగిన బిష్ణోయ్‌ ఆ తర్వాత తానే లీడర్‌గా తయారయ్యాడు. ఇప్పటికే తనపై రెండు డజన్ల హత్యలు, హత్యాయత్నాల కేసులున్నాయి. అలాగే, దోపిడీలు, స్మగ్లింగ్‌, డ్రగ్స్‌ అక్రమ రవాణా వంటి పలు కేసులుండగా.. భారత్‌ సరిహద్దులు దాటి డ్రగ్స్‌ అక్రమరవాణా చేస్తున్న కేసులో బిష్ణోయ్‌ని ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా, ప్రస్తుతం అహ్మదాబాద్‌ సబర్మతీ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు బిష్ణోయ్‌.

2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలను కాల్చి చంపినప్పుడు కూడా బిష్ణోయ్‌ ఇదే తరహాలో వార్తల్లోకెక్కాడు. విక్కీ మిద్దుఖేరా హత్యకు ప్రతీకారంగా అతన్ని చంపినట్లు బిష్ణోయ్‌ సహచరుడు గోల్డీ బ్రార్‌ ప్రకటించాడు. దీంతో ఈ గ్యాంగ్‌ ప్రధాన క్రిమినల్‌ సిండికేట్‌గా వెలుగులోకి వచ్చింది. బిష్ణోయ్‌ ప్రధాన అనుచరుడైన బ్రార్‌ ప్రస్తుతం కెనడాలో మకాం వేసినట్టుగా తెలుస్తుండగా.. ఇప్పటికే ఇతణ్ని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద (యూఏపీఏ) కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. బిష్ణోయ్‌ ఇతర అనుచరులు అమెరికాతో పాటు.. మరికొన్ని దేశాల్లోనూ బిష్ణోయ్‌ ప్రధాన నెట్‌వర్క్‌గా ఎందరో పనిచేస్తున్నారు.

గతంలో లారెన్స్‌ బిష్ణోయ్‌ మనీల్యాండరింగ్‌ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా దాడులు చేసింది. హర్యాణా, రాజస్థాన్‌లలో డజన్‌కు పైగా బిష్ణోయ్‌ స్థావరాలపై ఏకకాలంతో దాడులు నిర్వహించింది ఈడీ. అంతకుముందే ఎన్‌ఐఏ లారెన్స్‌ బిష్ణోయ్‌తో పాటు, గోల్డీ బ్రార్‌పై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేసింది.

బిష్ణోయ్‌ టార్గెట్‌గా సల్మాన్‌ ఎందుకయ్యాడు?

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు ఆపద పొంచి ఉందనే విషయం ఇప్పటికే నిరూపితమైంది. గతంలో తన ఇంటివద్ద జరిగిన కాల్పుల నేపథ్యంలో ఈ బాలీవుడ్‌ స్టార్‌కు భద్రతను కూడా పెంచారు. అయితే, బిష్ణోయ్‌ హిట్‌ లిస్ట్‌లో సల్మాన్‌ పేరుండటం, గతంలో బిష్ణోయే ఆ విషయాన్ని కుండ బద్ధలుకొట్టడం, ఇప్పుడు సిద్ధిఖీ హత్య తర్వాత దాని వెనుక బిష్ణోయ్‌ హస్తమున్నదని పోలీసులు నమ్మడం.. నెక్స్ట్‌ టార్గెట్స్‌లో సల్మాన్‌ ఖాన్‌ అనే ప్రచారం ఊపందుకోవడంతో ఇప్పుడు బిష్ణోయ్‌ ఓ పెద్ద చర్చయ్యాడు.

బిష్ణోయ్‌కీ.. సల్మాన్‌కు మధ్య వైరమెందుకు..?

అది 1998 సమయం.. హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సినిమా షూటింగ్‌ రాజస్థాన్‌లో నడుస్తోంది. అప్పుడు వేటకు వెళ్లిన సల్మాన్‌ఖాన్‌ కృష్ణజింకను కాల్చిచంపినట్టు ఆరోపణలు రావడమే సల్మాన్‌ బిష్ణోయ్‌కి శత్రువుగా మారడానికి ప్రధాన కారణం.

అవును, బిష్ణోయ్‌ జాతికి కృష్ణజింకలు దైవంతో సమానం. 15వ శతాబ్దానికి చెందిన జంబోజీగా పిల్చుకునే గురు జంబేశ్వర్‌ సిద్ధాంతం ప్రకారం ప్రకృతిని, వైల్డ్‌ లైఫ్‌ను కాపాడుకునే క్రమంలో జంతువులను చంపడాన్ని పూర్తిగా నిషేధించారు. జంబోజీ సూచించిన 29 సూత్రాలను తూచా తప్పకుండా పాటించడంలో బిష్ణోయ్‌ కమ్యూనిటీ కచ్చితంగా వ్యవహరిస్తుంది. బీస్‌(20), నోయ్‌(9) ఇలా 29 సూత్రాలకనుగుణంగానే ఈ బిష్ణోయ్‌ జాతి పుట్టిందని నమ్ముతారు. అంతేకాదు కృష్ణజింకను గురు జంబోజీ ప్రతిరూపంగా ఆరాధిస్తారు. ఆ క్రమంలో సల్మాన్‌ జ్యోథ్‌ పూర్‌ కోర్టుకు హాజరైనప్పుడే.. బిష్ణోయ్‌ సల్మాన్‌ను మట్టుబెడతానని శపథం పూనాడు.

బిష్ణోయ్‌, సల్మాన్‌ వైరంపై వర్మ ట్వీట్‌!

అప్పుడెప్పుడో బిష్ణోయ్‌ ఐదేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు సల్మాన్‌ కృష్ణ జింకను చంపాడని, 25 ఏళ్లుగా బిష్ణోయ్‌ పగతో రగిలిపోవడమేంటి? ఇది బిష్ణోయ్‌కి ఆ జంతువుపై ఉన్న అమితమైన ప్రేమా..? లేక, ఆ దేవుడు ఆడుతున్న వింత నాటకమా..? అంటూనే వరుస ట్వీట్స్‌ చేస్తూ.. తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ బిష్ణోయ్‌ హిస్టరీనేనా చర్చకు తెర లేపుతున్నారు వర్మ.

ప్రస్తుతం పోలీసుల ఆలోచనేంటి..?

దాదాపు దశాబ్ద కాలానికిపైగా ముంబైలో మాఫియా అంటూ పెద్దగా అలజడి లేదు. దావూద్‌ ఇబ్రహీం, ఛోటారాజన్‌, రవిపూజారి వంటి అండర్‌ వరల్డ్‌ గ్యాంగ్స్‌ హల్చల్‌ పూర్తిగా తగ్గిపోయింది. ఈ దశలో ఏర్పడిన శూన్యతను ఫిల్‌ చేసేందుకే ప్రస్తుతం లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రయత్నిస్తున్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబైతో పాటు.. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానా, ఢల్లీి, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి చోట కూడా తమ కార్యాకలాపాలను బిష్ణోయ్‌ గ్యాంగ్‌ విస్తరించే యత్నాలు చేస్తున్నట్టుగా పోలీసుల వద్ద సమాచారముంది. ఈ నేపథ్యంలో లారెన్స్‌ బిష్ణోయ్‌ తదుపరి కదలికలపై నిఘా విభాగాలన్నీ దృష్టి సారించగా.. ఆయన ప్రత్యర్థులు, శత్రువుల్లో మాత్రం ఆందోళనతో కూడిన భయం తరుముతుండటం కొసమెరుపు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page