top of page

వడ్డీల రమ్మీ.. కుటుంబాలనే కూల్చేస్తారు సుమీ!

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • May 6
  • 3 min read
  • ఆయన బారిన పడిన బాధితులకు లెక్కేలేదు

  • తాజాగా సెల్ఫీ వీడియో పెట్టి అదృశ్యమైన తిరుపతిరావు

  • రూ.20 లక్షల అప్పుతోనే చితికిపోయిన అమాయకుడు

  • రోజుకు రూ.20 వేల వడ్డీతో సర్వం కోల్పోయానని వెల్లడి

బరాటం రమణమూర్తి అలియాస్‌ రమ్మీ అనే ఫైనాన్స్‌ వ్యాపారి
బరాటం రమణమూర్తి అలియాస్‌ రమ్మీ అనే ఫైనాన్స్‌ వ్యాపారి

‘అమ్మా భానూ.. నేను ఉంటానో ఉండనో కూడా తెలియదు. బరాటం రమణమూర్తి దగ్గర రూ.20 లక్షలు అప్పు తీసుకున్నందుకు ఏళ్ల తరబడి రోజుకు రూ.20వేలు చొప్పున వడ్డీ కడుతూనే ఉన్నాను. అయినా ఆయన వేధింపులు భరించలేకపోతున్నాను. ఇక నావల్ల కాదు. నన్ను క్షమించు.. ఎంతోకొంత రమణమూర్తికి బాకీ ఉంటాం. ఆయన రుణం మనకొద్దు. నువ్వు జాగ్రత్తమ్మా’.. అంటూ సెల్ఫీ వీడియో పెట్టి శనివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయాడు అంపోలు తిరుపతిరావు (47) అనే వ్యక్తి. స్థానిక పాత టీపీఎం హైస్కూల్‌ దగ్గరున్న హౌసింగ్‌బోర్డు కాలనీలో భార్య అంపోలు భానుతో పాటు అద్దెకుంటున్నాడు. వీరి స్వగ్రామం జలుమూరు మండలం బొడ్డపాడు. ఈ గ్రామానికి అంపోలు భాను సర్పంచ్‌ అని తెలిసింది. ఈమె భర్త తిరుపతిరావు శ్రీకాకుళంలో రూ.7 కోట్లకు పైగా అప్పులు చేసేసి శనివారం సాయంత్రం ఆటోలో ప్రయాణిస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని కుటుంబానికి, కొందరు మిత్రులకు పంపించి అదృశ్యమైపోయాడు.

అంపోలు తిరుపతిరావు
వడ్డీలతోనే నడ్డి విరిచేస్తారు

జిల్లాలో ఈ తరహా కేసు ఇదే మొదటిది కాదు.. బహుశా చివరిదీ కాకపోవచ్చు. కాకపోతే.. మిగిలినవారి కథలకు, అంపోలు తిరుపతిరావు కథలకు మధ్య ఒక వ్యత్యాసం ఉంది. ఆయన సెల్ఫీ వీడియోలో పేర్కొన్న బరాటం రమణమూర్తి అలియాస్‌ రమ్మీ అనే ఫైనాన్స్‌ వ్యాపారి గురించి ఇక్కడ చెప్పుకోవాలి. శ్రీకాకుళం కోర్టుల్లో అప్పులు, ఆస్తులు, చెక్కులు, ప్రాంశరీ నోట్లకు సంబంధించి అత్యధిక కేసులు నమోదు చేసిన వ్యక్తిగా, ఫైనాన్స్‌ వ్యాపారిగా రమ్మీకి ఓ రికార్డు ఉంది. గత కొన్నేళ్లుగా శ్రీకాకుళం చిత్తరంజన్‌వీధిలో ఫైనాన్స్‌ వ్యాపారం నడుపుతున్న రమ్మీ పేరు చెబితే ఉలిక్కిపడనివారుండరు. ఎందుకంటే.. ఆయన దగ్గర తీసుకున్న అసలు కంటే వడ్డీ ఎక్కువై కట్టలేక మునిగిపోయినవారు, ఆస్తులు ధారాదత్తం చేసినవారు, చివరకు చనిపోయినవారు కూడా ఉన్నారు. అప్పు తీసుకున్న తర్వాత కట్టనప్పుడు ఆమాత్రం అడగరా? వడ్డీ తీసుకోరా? అనే మహానుభావులూ చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మిగిలిన వడ్డీ వ్యాపారులకు, రమ్మీకి తేడా ఒకటే. అంపోలు తిరుపతిరావు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నట్టు రూ.20 లక్షలకు వడ్డీ కిందే రోజుకు రూ.20వేలు జమ కడితే అసలు ఎప్పుడు తీరుతుందో ఎవరికీ తెలియదు. అందుకే అసలు అసలులా ఉండిపోయి వడ్డీ కట్టడానికే ఉన్నది మొత్తం ఊడ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడి, ఆయన పెట్టే ఒత్తిడిని తట్టుకోలేక మిగిలిన చోట్ల అప్పులు వాడి అందర్నీ ముంచేసిపోతున్నారు బాధితులు. స్థానికులు చెప్పిన లెక్కల ప్రకారం రమ్మీ దగ్గర తిరుపతిరావు రూ.20 లక్షలు అప్పు వాడిన మాట వాస్తవమని, అలాగే గత కొన్నేళ్లుగా రోజుకు రూ.20వేలు చొప్పున వడ్డీలు కూడా కట్టడం వాస్తవమేనని, అయితే రమ్మీ ఎక్కడా రికార్డుల్లో రోజుకు రూ.20వేలు వసూలు చేస్తున్నట్లు చూపడని చెబుతున్నారు.

బుక్కయిన యువనేత

రమ్మీ దగ్గర అప్పు తీసుకోవడానికి అంపోలు తిరుపతిరావు మిత్రుడు, పాతశ్రీకాకుళానికి చెందిన ఒక వైకాపా యువనాయకుడు 80 అడుగుల రోడ్డులో ఉన్న తమ స్థలాలను రమ్మీకి రిజిస్ట్రేషన్‌ చేశారు. రూ.20వేలు చొప్పున వడ్డీలే కట్టడం వల్ల అసలు తీర్చలేక మాయమైపోయిన తిరుపతిరావు పుణ్యాన ఇప్పుడు ఈ యువనాయకుడు రూ.2.50 కోట్ల విలువైన స్థలాన్ని కోల్పోయాడు. ఇది కాకుండా నగరంలో మరో ఆరుగురు కలిసి ఒక నాలుగు కోట్ల వరకు తిరుపతిరావుకు అప్పు ఇచ్చివుంటారని భావిస్తున్నారు. భార్య సర్పంచ్‌గా ఉన్నా, సొంతూరులో పొలాలున్నా ఇన్ని కోట్లు అప్పయిపోయి, ఇప్పుడు ఏకంగా ఉంటానో, పోతానో తెలీదంటూ సెల్ఫీ వీడియో పెట్టిన తిరుపతిరావుకు ఈ పరిస్థితి రావడానికి కారణమేమిటి?

బుకీ అవతారం ఎత్తించి..

మొదట్లో టెలికంలో కేబుల్స్‌ అమర్చే కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన తిరుపతిరావు అందులో వచ్చిన లాభాలతో గత ప్రభుత్వ హయాంలో ఇసుక ర్యాంపుల వ్యవహారాల్లో స్లీపింగ్‌ పార్టనర్‌గా ఉన్నారని భోగట్టా. పనిలో పనిగా స్థానిక మెడికవర్‌ ఆస్పత్రి ఎదురుగా ఉన్న మరో ఆస్పత్రిలో వాటాదారుగా పెట్టుబడి పెట్టారని చెప్పుకుంటున్నారు. ఇంత పద్ధతి ప్రకారం వెళ్లిన తిరుపతిరావు ఇప్పుడు ఇన్ని కోట్లు అప్పు చేసి మాయమవడానికి ప్రధాన కారణం రమ్మీయేనని చాలామంది భావిస్తున్నారు. వ్యాపారంలో పెట్టుబడులకు అప్పు కోసం వెళ్లిన తిరుపతిరావుతో ఏర్పడిన సాన్నిహిత్యాన్ని వాడుకున్న రమ్మీ ఈయనతో క్రికెట్‌ బుకీ అవతారం ఎత్తించాడన్న ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగుల్లో గెలిచినప్పుడు వాటా సొమ్ము తీసుకోవడం, ఓడిపోతే మాత్రం పూర్తిగా తిరుపతిరావునే బాధ్యుడ్ని చేసి రూ.20 లక్షల వరకు అప్పు ఇచ్చినట్లు బయట చెప్పుకుంటున్నారు. దానికి వడ్డీగా రోజుకు రూ.20వేలు చెల్లించి పూర్తిగా చితికిపోయిన తిరుపతిరావు ఇప్పుడు కనపడకుండాపోయారు.

లెక్కాపత్రం, కనికరం ఉండవు

రమ్మీ చేస్తున్న ఫైనాన్స్‌ వ్యాపారానికి లెక్కా పత్రం ఉండదు. రెండు ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న ఈయన అకౌంట్లు పరిశీలిస్తే ఎంతమేరకు లావాదేవీలు జరుగుతున్నాయో అర్థమవుతుంది. ఒకప్పుడు లైసెన్స్‌డ్‌ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారంటూ ఈయనకు సంబంధించి ప్రచారం జరిగేది. అది ఎంతవరకు నిజమో తెలీదు గానీ, బకాయిల వసూలుకు మాత్రం ఈయన వద్ద రౌడీముఠా ఉంటుందని అందరూ చెప్పుకునే విషయమే. ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకుని అప్పులిచ్చే రమ్మీ వద్ద చాలామంది అప్పులు చేసి చితికిపోయారు. కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన మాజీ కౌన్సిలర్‌ సిగిరెడ్డి నాగు కూడా రమ్మీ బాధితుడని తెలిసింది. రూ.7 లక్షలు అప్పు తీసుకున్న నాగుపై తీవ్ర ఒత్తిడి తేవడంతో ఓ సాయంత్రం రమ్మీ కార్యాలయానికి వచ్చిన నాగు తన పరిస్థితిపై కన్నీరు పెట్టుకున్నా ఏమాత్రం కనికరించకపోవడంతో ఆయన అదే రోజు రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలియని రమ్మీ స్టాఫ్‌ నాగు మృతదేహం వారి ఇంట్లో ఉండగానే, బకాయిల కోసం కుటుంబ సభ్యులకు పలుమార్లు ఫోన్‌ చేశాడని వినికిడి. నాగు చనిపోయాడని తెలుసుకున్న తర్వాత రూ. 7లక్షల అప్పు కాస్తా రూ.15 లక్షలకు పెంచేసి గోనెలవారి వీధి వద్ద నాగు పేరిట ఉన్న ఒక స్థలం డాక్యుమెంట్లను రమ్మీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు కనిపించకుండాపోయిన తిరుపతిరావు భార్య పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ఈమెకు బ్రెయిన్‌లో నీరు చేరడంతో ఆమధ్య బగ్గు సరోజిని ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయితే మళ్లీ ఇది తిరగబెట్టడంతో వేలూరు క్రిస్టియన్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్తారని భావిస్తున్న సమయంలోనే భర్త తిరుపతిరావు కనపడకుండా పోవడం, రమ్మీ మీద వీడియో రిలీజ్‌ కావడం ఇప్పుడు నగరంలో పెద్ద చర్చకు దారి తీసింది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page