వీఆర్ఎల్ కంటైనర్లతో వైర్లు తెంపేస్తున్నారు!
- ADMIN
- Apr 3
- 1 min read
చిన్నసందుల్లోకి భారీ వాహనాలు
ఊరి శివారులో ఉండాల్సిన ట్రాన్స్పోర్టులు వీధుల్లో
గతంలో తెగిన కరెంట్ పోల్ మెయిన్ వైర్లు
ఇప్పటికి పైప్లైన్ 10 సార్లు పాడైంది
కార్పొరేషన్ సిబ్బంది చెప్పినా పట్టించుకోని వైనం
ప్రశ్నించేవారిని మేనేజ్ చేస్తున్న వైనం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఊరికి శివారులో ఉండాల్సిన ట్రాన్స్పోర్టులు వీధుల్లో ఉంటున్నాయి. ఈ కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అసలే చిన్న చిన్న సందులు, ఆపై విద్యుత్ వైర్లు, ఇంకా జియో తదితర ఫైబర్ నెట్వర్క్ వైర్లు కిందకు వేలాడుతుంటాయి. వాటిని కనీసం పట్టించుకోకుండా ఈ వాహనాలు తెంపేస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికి పదిసార్లు ఇక్కడ మెయిన్ పైప్లైన్ ఉండే రోడ్డు మీదుగా అతిబరువుతో ఈ వాహనాలు వెళ్లడం వల్ల పైప్లైన్ తరచూ పాడవుతోంది. వీటిపై ప్రశ్నించేవారిని మేనేజ్ చేసేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ఇరుకు సందులు ఉన్న వీధి అనగానే గుర్తొచ్చేది తుమ్మావీధి. అయితే కత్తెరవీధిలో ఎంతోకాలంగా నడుపుకొస్తున్న వీఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ వాహనాల పుణ్యమాని ఇక్కడి ప్రజలకు నిత్యం నరకం ఎదురవుతోంది. భారీసైజు ట్రాన్స్పోర్ట్ వాహనాల కారణంగా ఇక్కడ భూమికి మూడడుగుల కింద ఏర్పాటుచేసిన మెయిన్ పైప్లైన్ ఎప్పటికప్పుడు దెబ్బతింటోంది. ఈ విషయమై గతంలో కార్పొరేషన్ సిబ్బందికి తెలుపగా, వారు ట్రాన్స్పోర్ట్ వారిని హెచ్చరించి ఊరుకున్నారు. ఇప్పటికి చాలాసార్లు ఇలా జరిగింది. నాలుగు రోజుల క్రితమే పీఎస్ఎన్ఎం స్కూల్ వెనుక వైపు పైప్లైన్ దెబ్బతినడంతో బాగుచేశారు. ఆ మరుసటిరోజే వీధిలో మరో చోట పైప్లైన్ బద్దలై ఇలా నీరు రోడ్డుపై పారుతోంది. దీనిపై గతంలో తుమ్మావీధి వాసులు ట్రాన్ప్పోర్ట్ సిబ్బందిని ప్రశ్నిస్తే.. మరో రెండు నెలల్లో ఇక్కడి నుంచి మార్చేస్తామని సర్దిచెప్పి పంపేశారు. ఉడుకురక్తం కుర్రాళ్లు వెళ్లి అడిగితే వారిని మేనేజ్ చేసేస్తున్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ వాహనాల పుణ్యమాని కరెంటు, ఫైబర్ వైర్లు తెగిపోతున్నాయి. ఇటీవల ఒక భారీ కంటైనర్ వీధిలోకి రావడంతో విద్యుత్ వైర్లు దానికి తగిలి ఒక రోజంతా వీధిలో కరెంట్ లేకుండాపోయింది. అంతేకుండా వైర్లు తెగిపోవడంతో స్థానికులు అక్కడ కాపలా ఉండి కరెంటువారు వచ్చి లైన్లు బాగుచేసేవరకు అందర్నీ వేరే రూటులో పంపించారు. ఇప్పటికైనా అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది పట్టించుకోవాలని, ఈ ట్రాన్స్పోర్ట్ను ఊరి శివారుకు పంపే ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాగా పైప్లైన్ పాడైన విషయాన్ని స్థానిక టీడీపీ నాయకుడు మౌళి సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా, బాగుచేయిస్తామని వారు తెలిపారు.

వీఆర్ఎల్ వాహనం తెంపుకు వెళ్లిపోయిన వైరు

Comments