గ్రౌండ్లు లేని జిల్లా నుంచి ఐపీఎల్కు వెళ్లిన త్రిపురాన
కష్టనష్టాలకోర్చి భవిష్యత్తును తీర్చిదిద్దిన మెంటార్లు
ఐపీఎల్లో రూ.30లక్షలకు కొనుగోలు చేసిన ఢల్లీి కేపిటల్స్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అది 2023.. కనీసం జోనల్ స్థాయి క్రికెట్కు కూడా సెలక్ట్ కాని ఆ కుర్రాడి కోసం జిల్లా క్రికెట్ సంఘం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్తో ఒక యుద్ధమే చేసింది. 2019లో అండర్`19కు ఆడి 26 వికెట్లు తీసి, తన బ్యాట్తోనూ టీమ్ను గెలిపించిన ఆ కుర్రాడ్ని జోన్ గేమ్స్లో కూడా సెలక్ట్ చేయకపోవడంతో జిల్లా క్రికెట్ సంఘం స్థాయికి మించి పోరాడిరది. ఎందుకంటే.. అప్పటికే నాలుగేళ్లుగా నిలకడగా రాణిస్తూ ప్రతీసారి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టీమ్ను విజయతీరాలు చేర్చిన వ్యక్తి కోసం చేసిన పోరాటం ఫలించింది. దాని పర్యవసానమే 2023లో జోనల్ పోటీల్లో ఆడి, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో తన సత్తా చాటి, రంజీల్లో తన తర్వాతే ఎవరైనా అని నిరూపించిన ఆ కుర్రాడే ఇప్పుడు జిల్లా చరిత్రలో మొదటిసారిగా ఐపీఎల్లో ఆడటానికి స్థానం దక్కించుకున్నాడు.
ఢల్లీి కేపిటల్స్ తరఫున ఐపీఎల్లో ఆడనున్న త్రిపురాన విజయ్ సక్సెస్ వెనుక జిల్లా క్రికెట్ సంఘం, కోచ్లు, మెంటార్లు చేసిన కృషి ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. టెక్కలికి చెందిన డిగ్రీ ఫస్టియర్ విద్యార్థి త్రిపురాన విజయ్ను ఐపీఎల్లో ఢల్లీి కేపిటల్స్ ఫ్రాంచైజీ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇది జిల్లా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విజయం. అయితే ఈ యువకుడు ఎప్పటికైనా దేశం తరఫున ఆడతాడన్న నమ్మకం మొదట కలిగింది జిల్లా క్రికెట్ సంఘానికే. జిల్లాలో క్రికెట్ పడుతూ, లేస్తూ ఉన్న రోజుల్లో రాజకీయ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న సమయంలో విజయ్ లాంటి ఒక ప్లేయర్ను తయారుచేసి ఐపీఎల్కు పంపడమంటే చిన్న విషయం కాదు. స్టేడియం లేని శ్రీకాకుళం వంటి ప్రాంతం నుంచి ఒక క్రీడాకారుడు ఐపీఎల్కు వెళ్లడం కంటే వ్యక్తిత్వ వికాస పాఠం ఇంకేముంటుంది? జిల్లా క్రికెట్ సంఘంపై ఆధిపత్యానికి కోర్టుల్లో సుదీర్ఘ కాలం కేసు నడిచిన తర్వాత ఏడేళ్లు కిందా మీదా పడిన తర్వాత 2023 ఏప్రిల్లో అంబుడ్స్మన్ ద్వారా ప్రస్తుతం ఉన్న క్రికెట్ సంఘం చేతికి పగ్గాలు వచ్చాయి. కానీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఎటువంటి నిధులు ఇక్కడికి విడుదల కాలేదు. కానీ జిల్లాలో క్రికెట్టే శ్వాసగా బతుకుతున్న అనేకమంది క్రీడాకారులు ఉన్నారని, వారి భవిష్యత్తు కోసం ఏదో చేయాలన్న తపనతో 2023లోనే జిల్లా క్రికెట్ సంఘం సీనియర్స్, అండర్ 23, అండర్19, అండర్16 కోసం ఎంపికలు నిర్వహించింది. వీరందరికీ ప్రాక్టీస్ ఇప్పించడం కోసం కళింగపట్నం, టెక్కలి తీసుకువెళ్లి ఆటలో మెళకువలు నేర్పించడానికి ఒక్కో సెలక్షన్కు రూ.1.25 లక్షలు ఖర్చవుతుంది. అప్పటికే ఏసీఏ నుంచి నిధులు రాకపోవడంతో జిల్లా క్రికెట్ సంఘంలో ట్రెజరర్గా ఉన్న మదీనా సైలానీ స్థానికంగా తన పలుకుబడిని ఉపయోగించి భోజనాలు, డ్రిరకులు, అల్పాహారం వంటివి అప్పు చేసి, అరువు తెచ్చి నిధులు సమకూర్చేవారు. ఒకసారి టోర్నమెంట్కు ఎంపికలంటూ మొదలైతే 45 రోజుల ముందు ప్రోబబుల్స్ను తయారుచేసి, అందులో 40 మంది క్రీడాకారులను ఎంపిక చేసి, వారిలో వారికి పోటీ నిర్వహించి, అందులో టాప్ 25ను గుర్తించి, వారికి ఫిట్నెస్ క్యాంప్లో ఉంచి చివరిగా 18 లేదా 19 మందిని ఎంపిక చేస్తారు. వీటంతటికీ ఖర్చు ఎంతవుతుందో చెప్పనక్కర్లేదు. ఇలా ఎంపికైనవారిని జిల్లా నుంచి రాష్ట్రానికి ఆడిన బెస్ట్ ప్లేయర్స్తో శిక్షణ ఇప్పించారు. ఇందుకు మెంటార్లుగా ఇలియాస్ అహమ్మద్, కె.రవిచలం వ్యవహరిస్తూవచ్చారు. జిల్లా దాటితే అయ్యే ఖర్చులు భరించడంతో పాటు వీరందర్నీ రాష్ట్రస్థాయిలో బెస్ట్ ప్లేయర్లుగా తీర్చిదిద్దడం కోసం ఎక్కడెక్కడో ఉన్నా ఒక్కచోటకు చేరి శిక్షణను అందించారు. ఇందులో కె.రవిచలం స్వయానా ఒకప్పటి సినీహీరో, కమ్ కేరక్టర్ ఆర్టిస్ట్. చలంకు స్వయానా కొడుకు. ఎక్కడో ఉన్న ఈయన, మరెక్కడో ఉన్న జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పుల్లెల వై.ఎన్.శాస్త్రి, ఇలియాస్లు జిల్లా క్రికెట్ ప్లేయర్స్ మీదే శతశాతం దృష్టి సారించారు. దాని ఫలితమే ఇప్పుడు విజయ్ ఐపీఎల్కు ఎంపిక కావడం. అండర్ 23 రంజీ జట్టుకు విజయ్ వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. సోమవారం జరిగిన రంజీ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసి 8 రన్లు ఇచ్చి, నాలుగు వికెట్లు తీసుకున్నాడు విజయ్. రాష్ట్రంలో ఎక్కడ ఎంపికలు జరిగినా, మన జిల్లా క్రీడాకారుల స్థానం పోకుండా జిల్లా క్రికెట్ సంఘం చూస్తూవస్తోంది. ఇక్కడ చీఫ్కోచ్ సుదర్శన్తో పాటు నలుగురు కోచ్లను టెక్కలి ఐతమ్ గ్రౌండ్స్, కళింగపట్నం గ్రౌండ్స్కు క్రీడాకారులతో పాటు తీసుకువెళ్లి శిక్షణ ఇప్పించడంతో విజయ్ లాంటివారు రాటుదేలారు. కేవలం ఈ జిల్లాలోనే ప్రాక్టీసు, శిక్షణ చేసి పక్కా లోకల్గా విజయ్ ఐపీఎల్లో అడుగుపెడుతున్నాడు. గతంలో ఉన్న క్రికెట్ సంఘం కార్యాలయంలోనే జాబితా తయారుచేసి గ్రౌండ్లోకి ప్లేయర్లను దించడం వల్ల ఇంతవరకు ఫలితాలు కనపడలేదు. ప్రతీ సెలక్షన్లోనూ 120 మంది క్రికెటర్ల నుంచి 19 మందిని ఎంపిక చేయడమే తలకుమించిన భారం. ప్రస్తుతానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి నిధులు వస్తున్నా జిల్లాలో గ్రౌండ్లు లేకపోవడంతో స్థానిక ఆర్ట్స్ కళాశాల, ఉమెన్స్ కళాశాలలో మైదానాలను మెరుగుపర్చడానికి జిల్లా క్రికెట్ సంఘం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది పూర్తయితే జిల్లా నుంచి ఎస్బీఎన్వీ ప్రసాద్, నంబాళ్ల సుశాంత్, మొదలవలస పూర్ణచంద్ర, జున్నారావు లాంటి అనేకమంది క్రికెటర్లు ఐపీఎల్కు వెళ్తారనే ఆశాభావం జిల్లా క్రికెట్ సంఘం వ్యక్తం చేస్తుంది.
Comments