top of page

విద్యకు సమాధి కడుతున్న ట్రంప్‌

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 19
  • 2 min read

విద్యాశాఖను క్రమంగా తొలగిస్తానని ప్రకటించిన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అందుకు అనుగుణం గానే విశ్వవిద్యాలయాలపై దాడికి దిగారు. హార్వర్డ్‌, కొలంబియాతో సహా ఏడు ప్రఖ్యాత సంస్థలకు ప్రభుత్వం ఇస్తున్న గ్రాంటులో వందల కోట్ల డాలర్ల మేర కోత విధించారు. మరిన్ని విద్యా కేంద్రాలకు కూడా వాత పెట్టేందుకు జాబితా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థలు వేలాది మంది సిబ్బందిని తొలగిస్తున్నాయి. ట్రంప్‌ సర్కారు చర్యను ప్రతిఘటిస్తామని హార్వర్డ్‌తో సహా అనేక సంస్థలు స్పష్టం చేశాయి. ప్రపంచంలో నెలకొన్ని పోటీ వాతావరణంలో అమెరికాకు ఎదురులేకుండా చేయటంలో ఉత్ప్రేరకాలుగా ఉన్న విద్యాసంస్థలపై వేటు అంటే తాను కూర్చున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనలు, వాటి ఫలితాలను ఆలంబనగా చేసు కుని బోస్టన్‌, ఆస్టిన్‌, సిలికాన్‌వ్యాలీ వంటి అనేక ప్రాంతాలు పరిశ్రమలు, సేవారంగాల్లో ఉపాధికి మారుపేరుగా నిలిచాయన్నది జగమెరిగిన సత్యం. అయితే ఆ ఫలితాలను కార్పొరేట్‌ సంస్థలే ఎక్కువగా సొమ్ము చేసుకున్నాయన్నది వేరే విషయం. పరిశోధనా రంగ అభివృద్ధికి అమెరికాలో పలు ప్రైవేటు సంస్థలు తొలినుంచీ పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నప్పటికీ రెండో ప్రపంచ యుద్దం తర్వాత నుంచి ప్రభుత్వం కూడా భారీగా నిధులు కేటాయిస్తూ వస్తోంది. ఇప్పుడు ట్రంప్‌ వాటికి ఎసరుపెట్టాడు. అమె రికాను మరోసారి అగ్రగామిగా మారుస్తానని చెబుతున్న ట్రంప్‌కు మేథావుల నవకల్పనలు లేకుండా అది జరిగేది కాదన్న కనీస జ్ఞానం లేదు. వినాశనానికి హేతువయ్యే అణుబాంబు, ఇతర మారణాయు ధాలతో పాటు మానవ కల్యాణానికి ఆవిష్కరించిన వైద్య పరికరాలు, ఔషధాలు, బయోటెక్నాలజీ వంటి వాటి రూపకర్తలు కూడా పరిశోధకులే. మేథోశక్తిని వినియోగించే శక్తులను బట్టి అది దేనికి ఉప యోగపడుతుందన్నది చూడాలి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో శాస్త్రవేత్తలను మారణాయుధాల తయారీకి అమెరికా ప్రభుత్వం పెద్దఎత్తున సమీకరించింది. తర్వాత సోవియట్‌ ప్రయోగించిన స్పూత్నిక్‌ రాకెట్‌ను చూసిన తర్వాత దానికి పోటీగా రాకెట్ల ప్రయోగాలకు నిధులు వెచ్చించింది. ఇప్పుడు సాంకేతిక రంగంలో చైనా విసురుతున్న సవాలు గురించి ఒకవైపు ఆందోళన చెందుతూనే పరిశోధన, విద్యారంగాలను నిరుత్సాహపరిచే పిచ్చిపనిని ట్రంప్‌ ఎందుకు చేస్తున్నారన్నది ఆసక్తి కలిగించే అంశం. గాజాలో ఇజ్రాయిల్‌ జరుపుతున్న మారణకాండకు వ్యతిరేకంగా ఇటీవలి కాలంలో అనేక విశ్వవిద్యాల యాల విద్యార్ధులు, బోధనా సిబ్బంది, పరిశోధకులు గళమెత్తారు. వారికి నాయకత్వం వహించిన వారిలో అమెరికాలో గ్రీన్‌కార్డు పొందిన విదేశీయులు కూడా ఉన్నారు. అలాంటి వారిపై 1950 కాలం నాటి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టాల్లోని సెక్షన్ల కింద అరెస్టులు, దేశబహిష్కరణకు ట్రంప్‌ పూనుకున్నాడు. పాలస్తీనియన్లకు మద్దతు ప్రకటించటం అంటే యూదులను, అమెరికా విదేశాంగ విధానాన్ని వ్యతిరేకిం చటంగా చిత్రిస్తున్నారు. అమెరికాలో చదువుకుంటున్న ఇతర దేశాలవారు అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకూడదన్నారు. ఇప్పుడు స్వదేశీయులపై కూడా దాడికి సిద్ధమయ్యారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయా లతో ఆర్థికంగా పెద్ద ఉత్పాదక కేంద్రాలుగా ఉన్న 44 కౌంటీల్లో (మన జిల్లాల వంటివి) 40 చోట్ల ట్రంప్‌పై పోటీ చేసిన కమలాహారిస్‌కు మెజారిటీ వచ్చింది. దేశం మొత్తం పోలైన ఓట్లలో 40శాతం వచ్చాయి. అదే ట్రంప్‌కు ఐదు చోట్ల మెజారిటీ రాగా వచ్చిన ఓట్లు కేవలం ఐదు శాతమే. ప్రతి చోటా ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయం లేదా పరిశోధన సంస్థ ఉంది. ట్రంప్‌ ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. తనకు ఓటు వేయనందుకు తీర్చుకునే కక్ష యావత్‌ దేశానికి నష్టమని గ్రహించటం లేదు. అమెరికాలో 3,100 కౌంటీలు ఉండగా వాటిలో వంద చోట్ల అత్యధిక ఆర్థిక ఉత్పత్తి జరుగుతోంది. ప్రధాన విద్యాకేంద్రాలు ఉన్న 44 కౌంటీలు వీటిలో 1.5 శాతమే అయినప్పటికీ జాతీయ ఉత్పత్తిలో 35 శాతం అందిస్తున్నాయి. అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రఖ్యాత విద్యాసంస్థలు మాత్రం ఉద్యమాలకు పుట్టినిళ్లుగా, పాలకుల విధానాలను ఎండగట్టే మేథో కేంద్రాలుగా ఉన్నాయి. ఢల్లీిలోని జేఎన్‌టీయూ వామపక్ష భావజాల కేంద్రంగా ఉన్నట్లుగానే అమెరికాలో ప్రతి ఉన్నత విద్యాసంస్థలో అలాంటి వాతావారణమే ఉంటోందని, చైనా మద్దతు పొందుతున్నారంటూ మితవాద శక్తులు ఆరోపణలు చేస్తుంటాయి. వాటికి పెద్దన్నగా ఉన్న ట్రంప్‌ అలాంటి విద్యా కేంద్రాలపై దాడికి పూనుకోవడం వెనుక ఆ కారణం కూడా ఉంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని తెలిసిన ప్పటికీ ఇలాంటి చర్యలకు పాల్పడేవారు పుడుతూనే ఉంటారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page