వారు సైతం వార్లోకి!
- BAGADI NARAYANARAO
- May 10
- 2 min read
మాజీ సైనికులను సిద్ధం చేయాలని ఆదేశాలు
జాబితాల సేకరణలో నిమగ్నమైన సైనిక సంక్షేమ బోర్డు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 7500 మంది నమోదు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సరిహద్దుల్లో తూటాల వర్షం కురుస్తోంది. డ్రోన్లు, క్షిపణులు గాల్లోకి లేస్తున్నాయి. ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత్ వారి శిబిరాలపై దాడులు చేస్తే.. వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భారత్కు చెందిన పౌర ఆవాసాలపైనే దాడులకు తెగబడుతోంది. దాంతో భారత్ కూడా పాక్ దాడిని ఎదుర్కొంటూనే ఆ దేశ సైనిక స్థావరాలపై వరుస దాడులు చేస్తూ దెబ్బకొడుతోంది. ఫలితంగా గత నాలుగు రోజులుగా భారత్`పాక్ మధ్య అప్రకటిత యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో అవసరమైతే యుద్ధరంగంలోకి దూకేందుకు మాజీ సైనికులు సై అంటున్నారు. అందుకు తగినట్లే భద్రతా బలగాల ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యున్నతస్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కదన రంగంలోకి అడుగు పెట్టేందుకు టెరిటోరియల్ ఆర్మీ(ప్రాదేశిక సైన్యం)తోపాటు మాజీ సైనికులను సంసిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఆ మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల సంక్షేమ బోర్డులకు రక్షణ శాఖ నుంచి రెండు రోజుల క్రితమే ఆదేశాలు అందాయి.
జిల్లాలో మాజీ సైనికులు సిద్ధం
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సైనిక్ సంక్షేమ బోర్డు పరిధిలో 7500 మంది మాజీ సైనికులు నమోదై ఉన్నారు. త్రివిధ దళాల్లో వివిధ హోదాల్లో పని చేసినవారు వీరిలో ఉన్నారు. వీరిలో 20 మంది వరకు మేజర్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో) స్థాయి అధికారులు ఉన్నారు. మిగతా వారంతా లాన్స్ నాయక్, సుబేదార్ తదితర దిగువ స్థాయి క్యాడర్ ఉద్యోగులు. 2018 తర్వాత ఉద్యోగ విరమణ చేసినవారు సుమారు 2,500 మంది ఉన్నారు. వీరిలో 700 మంది వరకు 2023 తర్వాత రిటైర్ అయినవారని అధికారులు చెబుతున్నారు. వీరి జాబితాను అధికారులు సిద్ధం చేసినట్టు తెలిసింది. పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా దేశ ం కోసం శత్రువులతో పోరాటానికి సిద్ధమని అంగీకారం తెలిపే వారి వివరాలతో జాబితా సిద్ధం చేయాలని కేంద్ర రక్షణ శాఖ నుంచి ఆదేశాలు రావడంతో సైనిక సంక్షేమ బోర్డు అధికారులు ఈ జాబితాల తయారీ, మాజీ సైనికులకు సమాచారం పంపడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు దేశ సరిహద్దులో పనిచేస్తున్న సైనికుల కుటుంబాలను కలిసి వారిలో మానసిక స్థైర్యం నింపి, అన్నివిధాల సహకరిస్తామని భరోసా కల్పించేలా మాజీ సైనికుల సంఘాల ప్రతినిధులు పని చేయాలని రాష్ట్ర సైనిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ పిలుపునిచ్చారు. ప్రస్తుత యుద్ధ వాతావరణం కారణంగా మాజీ సైనికులంతా బాధ్యాతాయుతమైన పౌరులుగా మెలగాలని సూచించారు. మాజీ సైనికుల్లో అన్ని క్యాడర్లతో పాటు ముఖ్యంగా ఇన్ఫ్యాంట్రీ (ఎంఆర్సీ)గా ఉద్యోగ విరమణ చేసిన వారి వివరాలను సేకరించే పనిలో సైనిక సంక్షేమ బోర్డు దృష్ట్టి సారించింది. 2018 తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారిలో దేశ రక్షణ బలగాలతో కలిసి పని చేస్తామని ఆసక్తి చూపించే వారి ఆరోగ్య పరిస్థితిని, ఫిట్నెస్ను పరీక్షించి కేంద్ర రక్షణశాఖ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేనాటికి జాబితాలను సిద్ధం చేయడంలో సైనిక సంక్షేమ బోర్డులు నిమగ్నమయ్యాయి. ఉద్యోగ విరమణ చేసి రెండేళ్లు పూర్తికానివారు తప్పనిసరిగా త్రివిధ దళాలతో కలిసి యుద్ధంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ మేరకు వారంతా రక్షణశాఖ పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
Comentários