‘విశ్వ’దోపిడీకి మళ్లీ గేట్లు ఎత్తేశారు!
- BAGADI NARAYANARAO
- Aug 3, 2024
- 4 min read
సోమవారం నుంచీ వసూళ్లదందాకు సర్కారు అనుమతి
విషయం తెలిసి బెంబేలెత్తుతున్న క్వారీలు, క్రషర్ల నిర్వాహకులు
జిల్లావ్యాప్తంగా వేలసంఖ్యలో విశ్వసముద్ర బాధితులు
వారి మొర విని నెలక్రితమే అడ్డుకట్ట వేసిన అచ్చెన్నాయుడు
గడువు ఉందన్న కారణంతో వసూళ్లకు సాక్షాత్తు చంద్రబాబే ఓకే

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జిల్లాలో మైన్స్ నిర్వహిస్తున్న వ్యాపారులకు, వాటికి అనుబంధంగా పని చేస్తున్న ట్రాక్టర్ యజమానులకు పెద్ద ఊరట లభించింది. టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రమాణస్వీకారం చేయకముందే జిల్లాలో టెంపరితనంతో సీనరేజ్ వసూలు చేస్తున్న విశ్వసముద్ర సంస్థ కార్యకలాపాలను ఉన్నఫళంగా ఆపేయాలని ఆదేశించడంతో ఆ సంస్థ వసూళ్లపర్వం ఆగిపోయింది. కానీ ఈ ఊరట నెల రోజులు మాత్రమేనని తేలిపోయింది. సోమవారం నుంచి విశ్వసముద్ర మళ్లీ సీనరేజ్ వసూళ్లకు రోడ్డెక్కుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ విషయం తెలియడంతో జిల్లాలో మళ్లీ వ్యాపారస్తుల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులకు వచ్చిన మెజార్టీలో పదివేలకు తక్కువ కాకుండా ప్రతి నియోజకవర్గంలో విశ్వసముద్ర బాధితులే ఉన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఈ విషయాన్ని పెద్దలకు చెప్పడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ చూపించలేదు. మూలపేట పోర్టు పనులు కూడా విశ్వసముద్ర సంస్థకే అప్పగించడంతో అప్పటి టెక్కలి ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుతో ఈ సంస్థ ప్రతినిధులు, మరీ ముఖ్యంగా జిల్లాలో విశ్వసముద్ర కార్యకలాపాలు పర్యవేక్షించిన చక్రవర్తి అనే వ్యక్తి అంటకాగడంతో అటు మైన్స్ నిర్వహిస్తున్న యజమానులకు, ఇటు ట్రాక్టర్ డ్రైవర్లకు ఎటువంటి ఊరటా లభించలేదు. పలాస నియోజకవర్గంలో విశ్వసముద్ర బాధితులు అప్పటి మంత్రి అప్పలరాజు దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లి కొంత రచ్చ చేసినా ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటం వల్ల ఫలితం లేకుండాపోయింది. దీంతో పెద్ద ఎత్తున బాధితులు జిల్లాలో ఏకమయ్యారు. వీరంతా అప్పటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశ్వసముద్ర నుంచి విముక్తి కల్పిస్తానని మాటిచ్చి, ఆ మేరకు సంస్థ కార్యకలాపాలను స్తంభింపజేశారు. అయితే ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మూడు రోజుల క్రితం గనుల శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీనరేజ్ వసూలుకు మళ్లీ విశ్వసముద్రకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కారణం.. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు వచ్చే ఏడాది మార్చి వరకు వీరికి గడువు ఉండటమే. దీనికి తోడు సంక్షేమ పథకాల అమలుకు వీరు కడుతున్న సీనరేజ్ సొమ్ము కూడా అవసరం కావడంతో విశ్వసముద్ర కార్యకలాపాలు కొనసాగించమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నే స్థానికంగా విశ్వసముద్ర బయటపెట్టినట్లు తెలిసింది. టెక్కలి, పలాసతోపాటు ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాల్లో కూడా మైనింగ్ వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాపారులందరూ విశ్వసముద్ర బాధితులే. చివరకు రైతు తన సొంత పొలంలో మట్టి తవ్వి ఇంటి వద్ద వేసుకున్నా రోడ్డెక్కిన ట్రాక్టర్కు సీనరేజ్ వసూలుచేసింది విశ్వసముద్ర. గత ప్రభుత్వంలో ఒకవైపు ఇసుక అందుబాటులో లేక, మరోవైపు విశ్వసముద్ర సీనరేజ్ పెంచేయడం వల్ల జిల్లాలో ఉన్న వేలాది మంది ట్రాక్టర్ డ్రైవర్లకు ఉపాధి లేకుండాపోయింది. అలాగే పర్యావరణ అనుమతులు తీసుకుని, మైన్స్ శాఖకు ఫీజులు చెల్లించి హెక్టార్ల లెక్కన కొండలను లీజుకు తీసుకున్న క్రషర్ యజమానులు విశ్వసముద్ర విధించిన సీనరేజీ ఛార్జీ చెల్లించలేక చేతులెత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం తరఫున నిర్మాణ పనులు లేకపోవడం, మెటల్ రేటు పెరిగిపోవడం వల్ల ప్రైవేటు భవనాల నిర్మాణాలు తగ్గిపోవడంతో ట్రాక్టర్లకు పని లేకుండాపోయింది. వీరంతా మొరపెట్టుకోవడం వల్లే కార్యకలాపాలు నిలిపివేయాలని గెలిచిన వెంటనే విశ్వసముద్రకు అచ్చెన్నాయుడు హుకుం జారీ చేశారు. అయితే అగ్రిమెంట్ ప్రకారం తమకు ఇంకా సమయం ఉన్నందున కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతులు ఇవ్వాలన్న అభ్యర్థన మేరకు ప్రభుత్వం వీరికి అవకాశం ఇచ్చింది. కనీసం ఈసారైనా మట్టి, ఇసుక వంటివాటి మీద సీనరేజ్ వసూలు చేయకుండా గ్రానైట్, మెటల్ మీద ధరలను పునఃసమీక్షిస్తే బాగుంటుందని జిల్లా వ్యాపారస్తులు కోరుతున్నారు.
గడువు పేరుతో మళ్లీ కొనసాగింపు
విశ్వసముద్ర 2023 మార్చిలో అప్పటి ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది మార్చి వరకు ఆ సంస్థకు గడువు ఉంది. రాష్ట్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయం కావడంతో పాటు ఒప్పంద గడువు ఇంకా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో విశ్వసముద్ర టోల్గేట్కు అవకాశం ఇవ్వాల్సిన దుస్థితి. గత మే నెల వరకు నెలకు రూ.13 కోట్లు చొప్పున ఏదాదికి రూ.156 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకొని 2023 ఏప్రిల్ ఒకటి నుంచి జిల్లాలో విశ్వసముద్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చింది. అంతకు ముందు వరకు గ్రానైట్, రోడ్డు మెటల్, గ్రావెల్ తవ్వకాలకు ఆన్లైన్లో పర్మిట్ల విధానం అమల్లో ఉండేది. దీనివల్ల వీటిని నిర్వహిస్తున్న యాజమాన్యాలు సీనరేజీ చెల్లించకుండానే మినరల్స్ను అక్రమంగా తరలించుకుపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరడం లేదని ప్రభుత్వం గుర్తించింది. గనుల శాఖ అధికారులు క్వారీల యజమానులతో చేతులు కలిపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని గ్రహించి మినరల్స్ను తవ్వి తరలించాలంటే కచ్చితంగా రాయల్టీ చెల్లించేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. గ్రానైట్, రోడ్డుమెటల్, గ్రావెల్, మరో 28 రకాల మైనింగ్ మినరల్స్ తవ్వకాల ద్వారా ఆదాయ వనరులు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరుగుతుండడంతో జిల్లాలో గ్రానైట్, రోడ్డుమెటల్, గ్రావెల్ క్వారీలను గుర్తించి ప్రభుత్వం లీజుకు ఇచ్చిన క్వారీల్లో ఏడాదిలో వెలికితీసే వనరులు లెక్కించారు. అందుకు అనుగుణంగా విశ్వసముద్రతో నెలకు రూ.13 కోట్లు మైనింగ్ సీనరేజీ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా రాయల్టీని ముందుగా ప్రభుత్వానికి జమ చేసి ఆ తర్వాత వసూలు చేసుకోవాలనేది ఒప్పందం సారాంశం.
అడ్డగోలుగా వసూళ్లు
ఒప్పందం మేరకు రంగంలోకి దిగిన విశ్వసముద్ర ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 35 చోట్ల టోల్బూత్లు ఏర్పాటుచేసి వసూళ్లు ప్రారంభించింది. ట్రాక్టర్లు, లారీల్లో గ్రావెల్, రోడ్డుమెటల్ తరలించిన ప్రతిసారీ మైనింగ్ సీనరేజీ వసూలు చేయడం ప్రారంభించింది. ఇంటి అవసరాల కోసం ఇసుక, మట్టి, మెటల్స్ను తరలించినా రోడ్డుపై నిలిపి బిల్లు చేతిలో పెట్టి డబ్బులు వసూలు చేయసాగారు. దీనిపై క్వారీలు, ట్రాక్టర్ల యజమానులు ఆందోళన చేసినా విశ్వసముద్ర అడ్డుగోలు దోపిడీ కొనసాగింది. ప్రభుత్వం వీరికి సర్వహక్కులు ఇవ్వడంతో గ్రామీణ ప్రాంత రోడ్లపై టోల్గేట్లు ఏర్పాటుచేసి సిబ్బంది ద్వారా వసూళ్లు సాగించారు. క్వారీల ముఖద్వారం వద్ద ఏర్పాటుచేసిన టోల్గేట్లో విశ్వసముద్ర సిబ్బంది ఇచ్చిన రశీదులను మార్గమధ్యంలో తనిఖీ బృందాలకు వాహనదారులు కచ్చితంగా చూపించాల్సిన పరిస్థితి. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు, రోడ్డు మెటల్ తరలించిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేసేవారు. కొన్నిచోట్ల విశ్వసముద్ర సిబ్బంది దాడులకు దిగిన సందర్భాలు ఉన్నాయి.
రాయల్టీ భారంతో యూనిట్ల మూత
సీనరేజీ వసూళ్ల బాధ్యతను విశ్వసముద్రకు అప్పగించిన తర్వాత జిల్లాలో నల్లరాయి, గ్రానైట్, మట్టి, కంకర క్వారీల నుంచి ఒక యూనిట్కు రూ.వెయ్యి నుంచి రూ.1200 వసూలు చేసేవారు. అంతకు ముందు ప్రభుత్వానికి ఒక యూనిట్కు (మూడు క్యూబిక్ మీటర్లు) రూ. 633 ఆన్లైన్లో చెల్లించేవారు. దీంతో ఒక్కసారిగా ఒక యూనిట్ మెటల్ ధర రూ.1,500 పెరిగింది. క్యూబిక్ మీటరుకు రూ.212 రాయల్టీ చెల్లించాలని విశ్వసముద్రతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశ్వసముద్ర మాత్రం ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాదిరిగా వసూళ్లు చేయడంతో ట్రాక్టర్లు, క్రషర్ల యజమానులు వినియోగదారులపై ఆ భారం మోపడంతో మెటల్కు డిమాండ్ తగ్గింది. ఆ తర్వాత కొన్ని రోజులకు రాయల్టీ, సీనరేజీ ఛార్జీలు పెంచడంతో జిల్లాలో అనేక చోట్ల స్టోన్క్రషర్లు మూతపడ్డాయి. క్వారీలు, క్రషర్ల యజమానులు సీన్రేజీ ఛార్జీలు, లీజు మొత్తాలు చెల్లించలేక చేతులెత్తేశారు. దాంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు. అధికారంలో ఉన్నప్పుడు వైకాపా ప్రజాప్రతినిధులు విశ్వసముద్ర వ్యవహారంపై ప్రశ్నించినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వానికి బకాయిలు చెల్లించిన తర్వాత విశ్వసముద్ర తన కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని చంద్రబాబు సమీక్షలో చెప్పుకొచ్చారట. అయితే విశ్వసముద్ర పెద్దలు జూన్ నాలుగో తేదీ వరకు ఎటువంటి బకాయిలు లేవని, బకాయిగా చూపిస్తున్న మొత్తం తాము చెల్లించాల్సింది కాదని, గత ప్రభుత్వంలో పనులకు సరఫరా చేసిన మెటీరియల్కు సంబంధించిన సీనరేజీ మాత్రమేనని, ప్రభుత్వం దానికి సొమ్ము చెల్లించనందున తమ బకాయి కింద జమ కాగా, తాము ఏమాత్రం బాకీ ఉండమని వివరించినట్లు భోగట్టా. ఈ పద్దులు శనివారం, ఆదివారం నాటికి తేలిపోగా, సోమవారం నుంచి వీరు మళ్లీ రంగప్రవేశం చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ పెండిరగ్ ఉండటం వాస్తవమే. అయితే మూలపేట పోర్టుకు తరలించిన లెక్కాపత్రం లేని రాయికి కూడా విశ్వసముద్ర లెక్కలు చెబితే బాగుంటుంది.
Comments