top of page

విష్ణు స్వరూపాల విషాద యోగం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 22
  • 2 min read

శ్రీకూర్మం.. ఈ పేరు వినగానే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే గుర్తుకొస్తారు. ఆయన కూర్మనాథుని అవతారం లో కొలువైన ఈ క్షేత్రం ఎంతో చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ప్రాశస్త్యం కలిగిన దివ్యక్షేత్రం. కానీ విష్ణు స్వరూపంగా భావించి పవిత్రంగా చూసుకునే కూర్మాల(తాబేళ్లు)కే దిక్కులేని పరిస్థితి దాపురించింది. కూర్మ నాథుని దేవస్థానం ఆవరణలోనే అరుదైన నక్షత్ర తాబేళ్ల పార్కును నిర్వహిస్తున్నారు. ఇక్కడున్న తాబేళ్లు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ దుస్థితికి అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్‌ లోపాలు రెండూ కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్కులో మొత్తం 187 వరకు తాబేళ్లు ఉండగా ఇటీవలి కాలంలో 15 తాబేళ్లు మృతి చెందినట్లు చెబుతున్నారు. అలా మృతి చెందిన కొన్ని తాబేళ్లను ఆదివారం ఉదయం దేవస్థానంలో పనిచేసే ఒక వ్యక్తి శ్వేత పుష్కరిణి ఒడ్డున పడేయడాన్ని కొందరు భక్తులు చూశారు. దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే ఏడు మృతి చెందిన తాబేళ్లు, మరో తొమ్మిది కాలి పోయిన స్థితిలో ఉన్న తాబేళ్లు కనిపించాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దేవస్థానం ఈవో భద్రాజీ, తాబేళ్లను సంరక్షించాల్సిన కాంట్రాక్టర్‌ కేవీ రమణమూర్తి కూడా శ్రీకాకుళంలోనే ఉంటారు. తాబేళ్ల మృతి విషయాన్ని కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆదివారం రెండు తాబేళ్లు మృతి చెందాయని, దానికి కారణాలు తెలుసుకుంటానని తీరిగ్గా చెప్పారు. ఇక ఈవో ఈ విషయం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దేవస్థానంలోని నక్షత్ర తాబేళ్ల సంరక్షణ బాధ్యతను 2011 నుంచి గ్రీన్‌మెర్సీ అనే స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) దేవదాయ శాఖతో కలిసి నిర్వహిస్తోంది. గ్రీన్‌మెర్సీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరే శ్రీకూర్మ క్షేత్రంలోని తాబేళ్ల సంరక్షణ పార్క్‌ క్యూరేటర్‌గా ఉన్న కేవీ రమణమూర్తి. 2015 నాటి సమాచారం ప్రకారం.. ఆలయంలో 255 తాబేళ్లు ఉన్నాయి. వీటి సంరక్షణలో కొన్ని సమస్యలు ఉన్నాయని గ్రీన్‌ మెర్సీ చెబు తోంది. అయితే మృతి చెందిన తాబేళ్లను నిబంధనల ప్రకారం పోస్ట్‌మార్టం చేయకుండానే ఎందుకు దహనం చేశారనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ తాబేళ్ల సంరక్షణ పార్కు ఉంది. అధికారులు, కాంట్రాక్టర్‌ నియమించిన సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. అయినా ఈ అనర్థం ఎలా జరిగిందనే దానిపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. తాబేళ్లలో భక్తులు శ్రీమహావిష్ణువును చూసుకుం టుంటారు. అందుకే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు అక్కడి పార్కులో ఉన్న తాబేళ్లను తదేకంగా చూస్తారు. అవి మెల్లగా నడుచుకుంటూ అటూ ఇటూ తిరుగుతుంటే చూసి ఆనందిస్తారు. నక్షత్ర తాబేళ్లు పెద్దగా పెరగవు. చిన్న సైజులోనే ఉంటాయి. ఇవి ప్రధానంగా శాకాహారులు. ఆలయ వర్గాల సమాచారం ప్రకారం భక్తులు తాబేళ్లకు గోంగూర ఆకులను ఆహారంగా సమర్పిస్తారు. ఇది కూర్మావతారానికి గౌరవంగా భావి స్తారు. సాధారణంగా నక్షత్ర తాబేళ్లు సహజ వాతావరణంలో గడ్డి, ఆకుకూరలు, పువ్వులు, రసవంతమైన మొక్కల ఆకులు, పళ్లు వంటివి తింటాయి. ఆలయంలో కూడా వీటికి ఇలాంటి శాకాహారమే (గడ్డి, ఆకుకూరలు) అందించాలి. అయితే ఆహారం సరిగ్గా అందించకపోవడం, సరైన సంరక్షణ లేకపోవడం వల్ల అనారోగ్యంతో అవి మృత్యువాత పడుతున్నట్లు 2015లోనే ఒక నివేదికలో పేర్కొన్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఆలయ ఉద్యోగి తెలిపారు. నక్షత్ర తాబేళ్లు సగటున 55 నుంచి 80 ఏళ్లు జీవిస్తాయి. కానీ సరైన వాతావరణం, ఆహారం, యూవీబీ లైటింగ్‌ లేకపోతే వాటి ఆయు:ప్రమాణం తగ్గిపోతుందని పరి శోధకులు చెబుతున్నారు. సమతుల ఆహారం, కాల్షియం, విటమిన్‌ డి`3 అందకపోతే తాబేళ్లలో ఎముకల పటుత్వం తగ్గిపోతుందని వన్యప్రాణి సంరక్షణ వైద్యులు చెబుతున్నారు. 80-95 డిగ్రీల ఫారెన్‌హీట్‌ ఉష్ణోగ్రత, యూవీబీ లైటింగ్‌ అవసరం. సరైన వాతావరణం లేకపోతే శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముందంటున్నారు. తాబేళ్ల సంరక్షణకు సరైన సిబ్బంది, వేరుచేసిన ఎన్‌క్లోజర్లు లేకపోవడం వల్ల హాచ్‌లింగ్స్‌ (గుడ్ల నుంచి బయటకు వచ్చే తాబేలు పిల్లలను హాచ్‌లింగ్స్‌ అంటారు) చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లోకకల్యాణానికి విష్ణువు దాల్చిన దశావతారాల్లో కూర్మావతారం రెండోది. ఆ రూపంలోనే విష్ణుమూర్తి కొలువైన దేశంలోని ఏకైక క్షేత్రం శ్రీకూర్మం. క్షీరసాగర మథనం సమయంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మందర పర్వతం సముద్రంలో మునిగి పోకుండా ఉండేందుకు విష్ణువు కూర్మ (తాబేలు) రూపంలో అవతరించి పర్వతాన్ని తన వీపుపై మోశాడు. అదే కూర్మ రూపంలో వెలసిన క్షేత్రమైనందునే దీనికి శ్రీకూర్మం అనే పేరు వచ్చింది. ఆలయంలో నక్షత్ర తాబేళ్లను పెంచడం ఒక విశిష్ట ఆకర్షణ. నిర్వాహణ లోపం వల్ల ఇప్పుడు అదే మసకబారుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page