శివుడి ఆదాయం స్వాహార్పణం!
- DV RAMANA
- May 8
- 2 min read

శ్రీముఖలింగంలో లక్షల్లో అక్రమాలు
టికెట్ల అమ్మకాలు, జమాఖర్చుల్లో అవకతవకలు
దేవస్థానం ఈవోపై గ్రీవెన్స్లో ఫిర్యాదు
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జిల్లాలోని శ్రీముఖలింగం క్షేత్రంలో అక్రమాలు జరుగుతున్నాయా? దేవస్థానానికి వస్తున్న ఆదాయన్ని అధికారులే తన్నుకుపోతున్నారా?? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దేవస్థానంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ జిల్లా అధికారులకు సైతం ఫిర్యాదులు అందుతున్నాయి. భక్తుల దర్శనం, ఇతరత్రా టికెట్ల విక్రయాలతోపాటు దేవస్థానం జమాఖర్చుల్లో అవకతవకలకు పాల్పడుతూ లక్షల్లో వెనుకేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు కలెక్టరేట్ గ్రీవెన్స్సెల్కు లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. దేవస్థానం అనువంశిక అర్చకుల్లో ఒకరైన నాయుడుగారి రాజశేఖర్ గత సోమవారం జరిగిన గ్రీవెన్స్సెల్లో జిల్లా కలెక్టర్కు అందజేసిన ఫిర్యాదులో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) ప్రభాకరరావు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేరొందిన దేవస్థానాల్లో టికెటింగ్ వ్యవస్థను ఆన్లైన్ చేయమని ప్రభుత్వం చాన్నాళ్ల క్రితమే ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రముఖ దేవస్థానాల్లోనూ దీన్ని ఎప్పటినుంచో అమలు చేస్తున్నారు. అయితే శ్రీముఖలింగంలో మాత్రం ఇప్పటికీ ఆఫ్లైన్లోనే టికెట్లు విక్రయిస్తున్నారు. ఇదే అక్రమాలకు ఆస్కారం కలిగిస్తోందని అంటున్నారు. అసలు ఇందుకోసమే ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తేకుండా కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా సోమవారాల్లో శ్రీముఖలింగేశ్వరుని దర్శనానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇక మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలోనూ, మహాశివరాత్రి పర్వదినం రోజులు భక్తులతో క్షేత్రం కిటకిటలాడుతుంది. వేలు, లక్షల్లోనే భక్తజనం శ్రీముఖలింగానికి తరలివచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భాల్లోనే దేవస్థానం ఈవో క్యాష్ చేసుకున్నారని రాజశేఖర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్శనం టికెట్ల అమ్మకాలను చాలా తక్కువగా చూపించి తేడా సొమ్మును కాజేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. అలాగే ఒకే సీరియల్ నెంబర్తో ఎక్కువ సంఖ్యలో టికెట్లు ముద్రించి కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అన్నదానం పేరుతో వసూళ్లు
దేవస్థానంలో నిత్యాన్నదాన పథకం అమలు కావడంలేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తుంటారు. కానీ ఈవో ప్రభాకరరావు అన్నదాన పథకం పేరుతో వీఐపీ భక్తుల నుంచి వేల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలా విరాళం ఇచ్చిన వారిని మభ్యపెట్టేందుకు ఏదో నామమాత్రంగా ఆరోజుకి అన్నప్రసాదం వండిరచి పంపిణీ చేస్తుంటారు. ఇక ఉత్సవాలు, ప్రత్యేక రోజుల్లో అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఇతరత్రా ఏర్పాట్లు చేయాల్సి వచ్చినప్పుడు ఈవో పండగ చేసుకుంటుంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయిన ఖర్చు కంటే ఎక్కువ మొత్తాలకు సరఫరాదారులు, కార్యక్రమాల నిర్వాహకులు చెక్కులు ఇస్తుంటారు. ఆనక వారి నుంచి తనకు రావలసిన మొత్తాలను వసూలు చేసుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా లక్షలాది రూపాయల దేవస్థానం సొమ్మును స్వాహా చేస్తున్న ఈవో ప్రభాకరరావు వ్యవహారంలపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ జిల్లా కలెక్టర్కు సమర్పించిన ఫిర్యాదులో కోరారు.
Comments