top of page

షర్బత్‌లోనూ మత విద్వేషపు విషమా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 21
  • 2 min read

ఆ పానీయం పేరు వినగానే మన శరీరమే కాదు.. హృదయమూ చల్లబడుతుంది. అదొక ప్రఖ్యాత శీతలపానీయం. వేసవి తాపాన్ని ఉపశమింపజేసే ఔషధం. దశాబ్దాలుగా మన దేశ సంస్కృతిలో భాగమైన తీయని అనుభూతి. దాని పేరే రూప్‌ా అఫ్జా. వేడుక ఏదైనా మన ఆతిథ్యానికి, ఆప్యాయతకు ఇది ఒక ప్రతీక. అన్నిటికీ మించి.. భారతీయుల మధ్య కులమతాల అంతరాల్ని తుడిచేసిన ఓ మధురమైన స్మృతి. అలాంటి ఈ స్వచ్ఛమైన పానీయాన్ని ఎవరైనా ‘షర్బత్‌ జీహాద్‌’ అంటే అది ఎంతటి దిగజారుడుతనం! వ్యాపార ప్రయోజనాల కోసం ఓ చల్లని పానీయానికి సైతం మతం రంగు పులిమి విద్వేషపు మంటల్లో మరిగించాలని చూడటం ఏహ్యమైన చర్య. ‘వాళ్లు షర్బత్‌ అమ్ముతున్నారు, మనం అమాయకంగా తాగు తున్నాం. ఆ డబ్బుతో వాళ్లు మసీదులు, మదర్సాలు కడుతున్నారు. ఇది షర్బత్‌ జీహాద్‌’ అంటున్నారు యోగాబాబా రాందేవ్‌. ఆయన తన పతంజలి గ్రూప్‌నకు చెందిన ఓ గూలాబీ షర్బత్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంత ద్వేషపూరితం? ఇంతకు మించిన నిరాధారమైన నిందారోపణ మరొకటుంటుందా? ‘షర్బత్‌’ అనేది ఏదీ ఓ మతానికీ సంబంధించినది కాదు. అది మన ఆహార పానీయాల్లో అంతర్భాగం. దాన్ని మత విద్వేష మంటల్లో మరిగించటం సమ్మతం కాదు. బాబా తన ఉత్పత్తులను ఎంత గొప్పగానైనా ప్రమోట్‌ చేసుకోవచ్చు. కానీ అది ఇతర బ్రాండ్లను కించపరిచేలా ఉండకూడదు. ఇందుకోసం నీచ వ్యాఖ్యలకు దిగజారడం, మతవిభజనకు సైతం తెగబడటం దుర్మార్గం, నీతిబాహ్యం. షర్బత్‌లో విద్వేషమనే విషం కలిపే కుతంత్రం. ‘షర్బత్‌ జీహాద్‌’ లాంటి పదాలు నేరుగా మత సామరస్యంపై ప్రభావం చూపుతాయి. ఒక సంస్థ వెనుక ఉన్న వ్యక్తుల మతం ఆధారంగా వారి ఉత్పత్తిపై నిందవేయడం వల్ల ఆ ఉత్పత్తి మాటెలా ఉన్నా మనుషుల మధ్య నమ్మకాలు దెబ్బతింటాయి. సమాజం చీలిపోతుంది. బాబా రాందేవ్‌ వ్యాఖ్యలు నిస్సందేహంగా కొందరి భావోద్వేగాలపై దాడి. మతాన్ని వాణిజ్య ప్రయోజనాలకు సాధనంగా వాడుకునే దుశ్చర్య. మతం అనే భావోద్వేగభరితమైన అంశాన్ని వ్యాపార రాజకీయాల్లోకి లాగడం మానవతా విలువలకు విరుద్ధం. ఒక దేశ సంస్కృతిలో కలిసిపోయే వస్తువులు అరుదుగా ఉంటాయి. అవి మతాన్ని మించిన మమకారాన్ని తెచ్చిపెడతాయి. రుప్‌ా అఫ్జా అలాంటి ఒక అపురూపమైన పానీయం. దాని పేరు ఉర్దూ భాషలో ఉండొచ్చుగానీ.. దాని రుచికి భాషాభేదాలు లేవు. అయినా మతం అంటగట్టడం హేయమైన చర్య. ఇలాంటి వికారపు వ్యాఖ్యలు ఈ బాబాకు అలవాటుగా మారాయి. అల్లోపతి వేస్ట్‌, మహిళలు బట్టలు లేకున్నా బాగుంటారు.. అంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వికార స్వభావానికి అద్దం పడతాయి. ఇప్పటికే ఆయన వ్యాపార ప్రకటనల తీరు పతంజలి సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసింది. కోవిడ్‌ కాలంలో ‘కోరోనిల్‌’ అనే ఔషధాన్ని కరోనా నివారణిగా ప్రమోట్‌ చేయడం ప్రజల భయాలను సొమ్ము చేసుకోవడమే. వైద్య నిపుణులు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, చివరికి డబ్ల్యూహెచ్‌వో సైతం ఈ ప్రకటనను తప్పు పట్టడంతో ఆయన తన ప్రకటనలను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా పతంజలి సంస్థకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అసత్య ప్రకటనలు చేస్తే ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల జరిమానా విధించవచ్చని వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యాన్ని లాభాల కోసం తాకట్టు పెట్టలేమని స్పష్టం చేసింది. అయినా ఆయన ఏ గుణపాఠమూ నేర్వలేదనడానికి తాజా వ్యాఖ్యలు ఓ ఉదాహరణ. స్వదేశీ ఉత్పత్తులు, సంప్రదాయ వైద్యం అంటూ యోగాను, ప్రజల విశ్వాసాలను తన వాణిజ్య లక్ష్యాలకు సాధనాలుగా వాడుకోవడం, మతవిద్వేషాలు రెచ్చగొట్టడం ప్రమాదకరమైన పోకడ. ఇప్పటికైనా రాందేవ్‌బాబా తన ప్రచార విధానాలను పునఃపరిశీలించాలి. తనకు గౌరవాన్ని, తన ఉత్పత్తులకు నమ్మకాన్నీ తెచ్చేది విద్వేష భాష కాదు.. విశ్వసనీయత మాత్రమే నని గుర్తించాలి. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే నిజాయితీ, పారదర్శకత, శాస్త్రీయ ధ్రువీకరణ తప్పనిసరి. కానీ అందుకు భిన్నంగా వ్యాపార ప్రచారాల కోసం మతాన్ని వాడుకోవడం ఎలా సముచితం? ఈ రకమైన ద్వేష భాష స్వచ్ఛమైన సహజీవనాన్ని అసహ్యంగా మార్చేస్తుంది. సమాజంలో విభజనకు దారితీస్తుంది. బాబా వ్యాఖ్యల లక్ష్యం వ్యాపారం మాత్రమే కాదు, ఒక మతం మొత్తంపై ‘కస్టమర్‌ జీహాద్‌’గా ముద్ర వేయడం కూడా. పౌర సమాజం దీన్ని సహించకూడదు. రూప్‌ా అఫ్జా ఓ పానీయం మాత్రమే. మతం, భాష భూతద్దంలో కాకుండా దాన్ని అలాగే చూద్దాం. దాని రుచిని, చల్లదనాన్ని ఆస్వాదిద్దాం.

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page