top of page

‘సదరం’ ఫేక్‌ అన్నా బెదరం

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jul 2, 2024
  • 3 min read
  • ఇబ్రహీంబాద్‌లో నకిలీ వికలాంగులు

  • విచారణకు హాజరు కాకుండా పింఛను

  • ఉద్యోగుల పాత్రపై అనుమానాలు

  • కూటమి నేతలను ముందుపెట్టి మేనేజ్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌లో దివ్యాంగులమంటూ సదరం ధ్రువీకరణతో 11 మంది పింఛన్లు పొందుతున్నారని వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు మెడికల్‌ బోర్డు ఎదుట హాజరు కావాలని బాధ్యులను ఆదేశించి నాలుగు నెలలు కావచ్చింది. వారెవరూ హాజరు కాలేదు. దీంతో వారి పింఛన్లు నిలుపుదల చేయాలని ఆదేశించినా.. సోమవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించి మంగళవారం సదరం ధ్రువీకరణ పత్రాలను పరిశీలన చేస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీచేశారు. నోటీసులు వచ్చాయని తెలుసుకున్న 11 మందికి మధ్యవర్తిగా వ్యవహరించి సదరం ధ్రువీకరణ పత్రాలు పొందడానికి మార్గం చూపించిన ఒకామె గ్రామంలో కొందరు మాజీలతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో మంతనాలు జరిపి వారి ద్వారా మంగళవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావును కలిశారని విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేను కలిసిన తర్వాత పింఛన్లు తొలగించరని అభయం ఇచ్చినట్టు భోగట్టా.

జిల్లాలో వెలుగు చూస్తున్న ఫేక్‌ దివ్యాంగుల సదరం ధ్రువీకరణ పత్రాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. లేని రోగాన్ని ఉన్నట్టు చూపించి వైద్యులే సదరం పత్రాలు జారీ చేస్తున్నారు. వైద్యులకు తప్ప ఇతరులెవరికీ అర్ధం కాని వైద్య పరిభాషలో దీర్ఘకాలిక నేత్రాలు, నరాలు, ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నట్టు సదరం పత్రాలను అధికారికంగా జారీ చేస్తున్నారు. వీటిని దక్కించుకోవడం కోసం కొందరు బ్రోకర్లను ఆశ్రయించి వేలకు వేలు ముట్టజెబుతున్నారు.

పొందూరు మండలం తోలాపిలో అడ్డదారిలో సదరం పొందిన 24 ధ్రువీకరణ పత్రాలపై ‘సత్యం’ పత్రిక వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నతాధికారులు స్పందించి వారి సామాజిక భద్రతా పింఛన్లను గత ఏడాది మెడికల్‌ బోర్డు రద్దు చేసింది. 24 మందిని భౌతికంగా పరీక్షించిన తర్వాత సదరం ధ్రువీకరణ పత్రాలను రద్దుచేశారు. దీంతో పింఛన్లు రద్దయిపోయాయి. అయితే ఇదే సమయంలో వీటిని జారీచేసిన నరసన్నపేట, టెక్కలి ఆసుపత్రి సూత్రధారులను మాత్రం విడిచిపెట్టేశారు. అధికారికంగానే సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తూ వైద్యులు, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు వేలకు వేలు గుంజుకుంటున్నారు.

ఇప్పుడు ఇటువంటిదే ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌ (కుర్మయ్యపేట)లో వెలుగు చూసింది. 11 మంది సదరం ధ్రువీకరణ పత్రాలపై ఏడాది క్రితం గ్రామ ఉపసర్పంచ్‌ ప్రతినిధి కిల్లి ప్రకాశరావు ఉన్నతాధికారులకు పలు దఫాలు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన ఫిర్యాదుపై జేసీ ఆదేశాలతో డీఆర్‌డీఏ అధికారులు మెడికల్‌ బోర్డు ముందు హాజరై వికలాంగత్వాన్ని నిర్ధారించుకోవాలని 12 మందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో ఒకరు హాజరై వికలాంగత్వాన్ని నిర్ధారించుకున్నట్టు డీఆర్‌డీఏ అధికారులు ప్రకటించారు. మిగతా 11 మంది ఇప్పటి వరకు నోటీసులకు స్పందించలేదు. అయినా సోమవారం ఎన్టీఆర్‌ భరోసా కింద ఒక్కొక్కరూ రూ.6 వేలు చొప్పున అందుకున్నారు.

ఇబ్రహీంబాద్‌లో 301 మంది సామాజిక భద్రతా పింఛన్లు అందుకుంటున్నారు. వీరిలో దివ్యాంగులు, వితంతు, వృద్ధాప్య, ఒంటరి మహిళా పింఛన్లు అందుకుంటున్నవారు ఉన్నారు. వీరిలో అనర్హులు ఉన్నట్టు ఉపసర్పంచ్‌ ప్రతినిధి ప్రకాశరావు కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చాయి. గతంలో తెలిపిన 11 మంది దివ్యాంగుల పింఛన్లతో పాటు మరో 23 మంది ఒంటరి మహిళా, వృద్ధాప్య పింఛన్ల కేటగిరిలో అనర్హులు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.

సోమవారం గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు 11 మందికి ఎటువంటి వైకల్యం లేకపోయినా ఉన్నట్టు చూపించి వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి సదరం ధ్రువీకరణ పొందారు. వీరందరూ 2022 మే, నవంబర్‌ నెలల్లో సదరం ధ్రువీకరణ పత్రాలు పొందారు. వికలాంగులమంటూ కొందరు నరసన్నపేట సామాజిక ఆసుపత్రి నుంచి, మరికొందరు రణస్థలం సీహెచ్‌సీ నుంచి పత్రాలు పొందారు. అలాగే మరో ఇద్దరికి శ్రీకాకుళం రిమ్స్‌ నుంచి సదరం జారీ అయింది. వీటితో పాటు విజయనగరం సీహెచ్‌సీ, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి, పాలకొండ ఏరియా ఆసుపత్రి నుంచి కూడా సదరం ప్రతాలు జారీ అయ్యాయి. వీరంతా ఒక్కో ధ్రువీకరణకు రూ.30వేలు నుంచి రూ.60వేలు చెల్లించారని విశ్వసనీయ సమాచారం.

ఇబ్రహీంబాద్‌ వ్యవహారంలో గ్రామానికి చెందిన ఒకామె మధ్యవర్తిగా ధ్రువీకరణ పత్రాల జారీలో కీలకంగా వ్యవహరించారని గ్రామంలో చర్చ సాగుతుంది. ఈమెతో పాటు సచివాలయం సంక్షేమ కార్యదర్శి విద్యాసాగర్‌ పాత్రపైనా గ్రామంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళా, వృద్ధాప్య పింఛన్లు పొందడానికి విద్యాసాగర్‌ సహకరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధార్‌లో వయసు మార్పులు చేసి వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నవారితో పాటు భర్త, కుటుంబం ఉన్నవారిని ఒంటరి మహిళగా రేషన్‌ కార్డులు తయారుచేసి అనర్హులు పింఛన్లు అందుకుంటున్నారని గ్రామంలో చర్చ ప్రారంభమైంది. బ్రోకర్లను ఆశ్రయించి ప్రభుత్వ వైద్యుల ద్వారా ఆర్థోపెడిక్‌ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్టు సదరం ధ్రువీకరణ పత్రాలు పొందారు.

ఈ వ్యవహారంపై 2023 అక్టోబర్‌ 16న, ఈ ఏడాది జనవరి 29న కలెక్టర్‌కు ఉపసర్పంచ్‌ ప్రతినిధి ప్రకాశరావు స్పందనలో ఫిర్యాదులు చేశారు. ఎచ్చెర్ల ఎంపీడీవోకు ఫిర్యాదు చేస్తే రాజకీయ ఒత్తిడి ఉందని చెప్పి గత ఏడాది అక్టోబర్‌ నుంచి విచారణ చేయకుండా కాలయాపన చేస్తూవచ్చారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన రెండుసార్లు డీఆర్‌డీఏ నుంచి ఎంపీడీవోకు సదరం ధ్రువీకరణ పత్రాలపై విచారణ చేయాలని ఆదేశాలు అందినా చర్యలు తీసుకోలేదు. చివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందికి సచివాలయం ద్వారా రెండుసార్లు నోటీసులు ఇచ్చినా వికలాంగత్వ నిర్ధారణకు మెడికల్‌ బోర్డు ముందు హాజరు కాలేదు. నిజంగా వికలాంగులైతే తప్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21న జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారికి ఏడు రోజుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మంది సదరం ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, భౌతికంగా పరీక్షించి నిజనిర్ధారణ చేసి నివేదిక ఇవ్వాలని డీఆర్‌డీఏ పీడీ ఆదేశించారు. దీనిపై ఆసుపత్రుల సమన్వయ అధికారి విచారణకు దిలీప్‌ అనే వ్యక్తి తప్ప ఎవరూ హాజరు కాలేదు. దిలీప్‌ వికలాంగుడేనని, పింఛనుకు అర్హుడని నిర్ధారించి మిగతావారెవరూ హాజరు కాలేదని నివేదిక ఇచ్చారు. దీంతో మిగతావారి సామాజిక పింఛన్లు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ 11 మందికి నోటీసులు జారీ చేశారు. కానీ ఈ నెల పింఛన్లు మాత్రం నిలుపుదల చేయలేదు. ఈ వ్యవహారంలో ఎంపీడీవో, సచివాలయం పాత్రపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Opmerkingen


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page