top of page

సర్కారు మెడకు ‘ఉర్సా’ ఉచ్చు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 29
  • 2 min read

రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం అంటూ చంద్రబాబు సర్కారు చేస్తున్న భూ కేటాయింపులు చర్చకు దారితీస్తున్నాయి. నిరుపయోగంగా ఉండి తక్కువ విలువైన భూములను కేటాయిస్తే వేలెత్తి చూపే అవసరం ఉండదు. కానీ విశాఖ నగర పరిధిలోని అత్యంత భూములను అత్యంత నామ మాత్రపు ధరకు ఇవ్వడం.. అదీ ఊరూపేరూ లేని కంపెనీకైతే విమర్శలు తప్పవు. వాటికి ప్రభు త్వం జవాబు చెప్పకా తప్పదు. ఊరూపేరూ లేని ఉర్సా క్లస్టర్‌ కంపెనీకి విశాఖలో 59 ఎకరాలు ఎకరాకు కేవలం 99 పైసల లీజుకు కేటాయించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే.. పారిశ్రామిక సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాల్సిందే. కానీ ఆ పేరుతో ఏమాత్రం అర్హత లేని, చరిత్ర కంపెనీకి కోట్ల విలువ చేసే భూములను కట్ట బెట్టడం ఏంటన్నది అందరి ప్రశ్న. కేటాయించడానికి ముందు సదరు కంపెనీకి సమర్థత ఉందా లేదా అనే నిర్థారించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అన్న ప్రశ్నలు సర్కారుకు సూటిగా తగు లుతున్నాయి. అదే క్రమంలో మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడైన టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సృష్టించిన బినామీయే ఉర్సా కంపెనీ అని ఆరోపించారు. ఆ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్‌ చిన్నికి సన్నిహితుడు, ఇంజనీరింగ్‌లో క్లాస్‌మేట్‌ అని, భూకేటాయింపునకు కొన్ని వారాల ముందే ఈ కంపెనీని స్థాపించారని అని ఆయన విమర్శించారు. ఈ ఆరోపణలపై ఉర్సా క్లస్టర్స్‌ యాజమాన్య ప్రతినిధులు అమెరికా నుంచే స్పందించారు. తమ కంపెనీ ప్రపంచస్థాయిలో డేటా సెంటర్లు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాల్లో సేవలందిస్తోందని, భారత్‌లో ఇటీవలే తమ కార్యకలాపాలు ప్రారంభించామని తెలిపారు. ఎంపీ కేశినేని చిన్నితో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతానికి భారత్‌లో తాత్కాలిక కార్యాలయం ద్వారా సేవలందిస్తున్నామని స్పష్టం చేశారు. తమ సంస్థ ఆర్థిక సామర్థ్యంపై అనుమానాలు అవసరం లేదన్నారు. ఏపీ ప్రభు త్వం నుంచి ఆహ్వానం అందడంతోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చామన్నారు. విశాఖలో మూడు దశల్లో 5వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. తమకు ఎకరా 99 పైసల లీజు రేటుకే కేటాయించారన్న కథనాల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. విశాఖ ఐటీ పార్కు వద్ద కేటాయించిన భూమి ఎకరా రూ.కోటికి, కాపులుప్పాడు వద్ద కేటాయించిన భూమి ఎకరా రూ.50 లక్షలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఉర్సాకు కేటాయింపులు జాతీయ స్థాయిలోనూ ప్రకంపనలు రేపుతున్నాయనడానికి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ స్పందించడమే నిదర్శనం. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి అన్ని ఎకరాల భూములను.. అదీ ఎకరా 99 పైసల లీజుకు ఏ విధంగా కేటాయించారని కూటమి ప్రభుత్వాన్ని ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు. ఏ రకంగా చూసినా ఇది నిబంధనలకు విరుద్ధమేనని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తం గా ఇంత రచ్చ జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడంలేదు. ఉర్సా క్లస్టర్‌కు భూమి ఎందుకు, ఏ ప్రాతిపదికన కేటాయించారన్న అంశంపై నోరు మెదపడం లేదు. కాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ మాత్రం ఉర్సాతో ఒప్పందం యథావిధిగా కొనసాగుతుందన్నారు. మరోవైపు అమరావతి నిర్మాణ పనులతో సహా అన్నింటినీ ప్రభుత్వ పెద్దలు అస్మదీయులకే కట్ట బెడుతున్నారని విపక్షం ఆరోపిస్తోంది. విశాఖలో టీసీఎస్‌కు భూకేటాయింపును అందరూ సమర్దిం చారు. లాభాల బాటలో ఉన్న ఆ కంపెనీ మరింత మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందని నమ్ముతున్నారు. అయితే టీసీఎస్‌కు కేటాయించిన భూమి ధరపైనే విమర్శలు వస్తున్నాయి. సరిగ్గా రెండు నెలల క్రితం ఈ ఏడాది ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లో ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తాత్కా లిక కార్యాలయం ప్రారంభమైంది. రూ.10 లక్షల క్యాపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌తో పెందుర్తి విజయకుమార్‌, సతీష్‌ అబ్బూరి డైరెక్టర్లుగా ఉన్నట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ చూపిస్తోంది. పోనీ సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు అమెరికాలో ఏళ్ల తరబడి పని చేస్తోందా అంటే అదీ లేదు. 2024 సెప్టెంబర్‌ 27న అక్కడ ఈ కంపెనీని రిజిస్టర్‌ చేశారు. ఏ రకంగా చూసినా ఉర్సాకు ఏమాత్రం అనుభవం, అర్హత లేవన్నది సుస్పష్టం. మరి ఏ ప్రాతిపదికన ఆ కంపెనీకి అప్పనంగా 60 ఎకరాలు కేటాయించారో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే. చెప్పకపోతే అప్రతిష్ట మూటగట్టుకోవాల్సిందే.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page