top of page

సాహసం మాటున అసాంఘిక క్రీడ!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Apr 18
  • 4 min read
  • సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

  • గతంలో గ్రామస్తుల అభ్యంతరంతో నిలిచిన పనులు

  • ఇప్పుడు టీడీపీ నేతల రంగప్రవేశంతో మళ్లీ ప్రారంభం

  • మందు, ముక్క పార్టీల మేరకే నిర్మాణాలు

  • గనగళ్లపేటను నాశనం చేసే దుస్సాహానికి ఒడిగడుతున్నారని ఆందోళన

  • ఆహ్లాదకరమైన విశాఖపట్నం సముద్ర తీరంలో భారీ భవంతి నిర్మించి వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి ఇస్తామన్న ఓ రిసార్ట్‌ ప్రాజెక్టును రద్దు చేసేయమని కోర్టు నిర్ద్వందంగా తీర్పునిచ్చింది. నేతల పెట్టుబడులున్న ఈ నిర్మాణాన్ని కూల్చడానికి అధికారులు వెనకడుగు వేయడంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే పర్యాటక ప్రాజెక్ట్‌ అంటూ గత ప్రభుత్వంలో దీనికి అనుమతులు తెచ్చుకున్నారు. కానీ సముద్రానికి దగ్గర్లో ఉండటం వల్ల ఇది సీఆర్‌జెడ్‌ పరిధిలోకి వస్తుందని కోర్టులో కేసు వేశారు.

  • శ్రీకాకుళం రూరల్‌ మండలం పెద్దగనగళ్లవానిపేట వద్ద కొన్నాళ్ల క్రితం కొందరు మత్స్యకారులు సముద్రంలో వలకు చిక్కిన చేపలను, రొయ్యలను, పీతలను తీరంలోనే వండి వడ్డించే రెండు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడకు పెద్ద ఎత్తున మందుబాబులు చేరుకోవడంతో సముద్రపు ఒడ్డున తాగి తందనాలాడటం నిషేధమంటూ గ్రామ ప్రవేశంలోనే బోర్డులు పెట్టాల్సి వచ్చింది. గ్రామ ప్రశాంతతను బయట నుంచి వచ్చినవారు దెబ్బతీస్తున్నారంటూ వీటిని ఏర్పాటుచేశారు. దాంతో ఈ రెండు సాల్స్‌ మూతపడిపోయాయి. కొన్నాళ్లపాటు జరిగిన ఈ వ్యాపారాన్ని కూడా టూరిజంలో భాగమేనని సర్దిచెప్పుకున్నవారున్నారు.

... పై రెండు ఉదంతాలు చెప్పేదేమిటంటే.. టూరిజం పేరుతో అభివృద్ధి జరిగినా అది చట్టాలు, నిబంధనలకు లోబడే ఉండాలి. ఆదాయం వస్తుంది కదా అని.. టూరిజాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది కదా అని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అవి వినాశనానికి, అనర్థాలకు దారితీస్తాయి. ఇప్పుడు గనగళ్లవానిపేట తీరంలో పారదర్శకతకు పాతర వేసి టూరిజం పేరుతో చేపడుతున్న నిర్మాణాల్లో అన్నీ గోప్యమే. అనుమతులు ఉన్నాయంటూ వైకాపా హయాంలో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు టీడీపీ నాయకులను భాగస్వాములుగా చేర్చుకొని ముందుకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు. మద్యం ఎలాగూ ప్రైవేటుపరం అయిపోయింది కాబట్టి ఎక్సైజ్‌ శాఖను మేనేజ్‌ చేసి బార్‌ గానూ, పోలీసులను మేనేజ్‌ చేసి పేకాట క్లబ్‌గానూ మార్చేసి భారీ ఆదాయం దండుకోవాలని చూస్తున్న నిర్వాహకులను స్థానిక యువత అడ్డుకుంటోంది. అయినా నిర్మాణాలు మాత్రం ఆగడంలేదు. అసలు వీటికి అనుమతులు ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? అనే విషయంలో మాత్రం ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. ఆమధ్య ‘సత్యం’ దీనిపై ఓ కథనం ప్రచురించిన తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న నిర్వాహకులు, ఆ తర్వాత పాలకులతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకున్నారో గానీ మళ్లీ నిర్మాణాలు ప్రారంభిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రాష్ట్రంలో వైకాపా సర్కారు ఉన్నప్పుడు 2023లో గమ్‌ బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ పేరుతో పెద్దగనగళ్లవానిపేట గ్రామ పరిధిలో ఒక రిసార్ట్‌ నిర్మాణానికి శ్రీకాకుళానికి చెందిన కొందరు పెద్ద మనుషులు శ్రీకారం చుట్టారు. నగరానికి చెందిన కొందరు వైకాపా నాయకులు బినామీ పేర్లతో ప్రభుత్వంతో ఎంవోయూ (ఒప్పందం) కుదుర్చుకున్నట్టు పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా సముద్రంలో నాగావళి కలిసే ప్రాంతం వద్ద, అదీ నది కోతకు గురవుతున్నచోట రిసార్ట్‌ నిర్మాణానికి అప్పటి జిల్లా ఉన్నతాధికారులు మూడెకరాల భూమి కేటాయించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే స్థానికులు వ్యతిరేకించడంతో ఇటీవల ఈ పనులు నిలిచిపోయాయి. రిసార్ట్‌కు పంచాయతీ తీర్మానం లేదంటూ స్థానికులతో కలిసి సర్పంచ్‌, ఎంపీటీసీ గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు రిసార్ట్‌ నిర్మిస్తున్నట్టు తమకు సమాచారం లేదని, తాము అనుమతి ఇవ్వలేదని గ్రామ సచివాలయ కార్యదర్శి స్థానిక యువతకు లిఖిత పూర్వకంగా చెప్పారట. రెవెన్యూ అధికారులు మాత్రం తీరప్రాంతంలో రిసార్ట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని స్థానిక యువతకు ఓ ఎండార్స్‌మెంట్‌ ఇచ్చారట. అయితే ఈ ఎండార్స్‌మెంట్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని కోరితే మాత్రం స్పందించడం లేదని యువత ఆరోపిస్తున్నారు. పర్యాటక శాఖ అధికారులు కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు.

టీడీపీ నేతల జోక్యం

విశాఖలో 2023లో ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో ఈ ఎంవోయూ కుదుర్చుకున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఆ పేరుతో నాగావళి కోతకు గురవుతున్న ప్రాంతానికి కేవలం 40 అడుగుల దూరంలో రిసార్ట్‌ నిర్మించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగాభివృద్ధి పేరుతో సీఆర్‌జెడ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న గమ్‌ బీచ్‌ శాక్స్‌ను అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ వేదికగా కాకుండా ఒక రిసార్ట్‌ మాదిరిగా నిర్మిస్తున్నారని స్థానిక యువత ఆరోపిస్తున్నారు. కాగా పర్యాటకాభివృద్ధి మాటున తీరప్రాంతాన్ని అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నట్టు చెబుతున్న ఈ బీచ్‌ ప్రాజెక్టును ఉగాది నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని నిర్వాహకులు ప్రయత్నించారు. నాగావళి కోతకు గురైన ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణ ప్రతిపాదనల కోసం అక్కడ పర్యటించిన కలెక్టర్‌కు నిర్వాహకులు అదే విషయం చెప్పారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా పనులు నిలిచిపోయాయి. వైకాపా హయాంలో మంజూరైన ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం ఇప్పటికీ ప్రాథమిక దశ దాటలేదు. గ్రామస్తులు దీన్ని వ్యతిరేకిస్తుండడంతో నిర్వాహకులు టీడీపీ నాయకులతో మంతనాలు ప్రారంభించారు. టీడీపీ, వైకాపా నేతల రహస్య చర్చల తర్వాత స్థానికుల నుంచి ఒత్తిడి లేకుండా పనులు చేయడానికి అవకాశం కల్పించినట్టు తెలిసింది. అసలు పెట్టుబడుల సదస్సులో ఏం ప్రాజెక్ట్‌ అని చెప్పారు? ఇందుకోసం ఎన్ని కోట్లు పెట్టుబడి పెడుతున్నామని పేర్కొన్నారు? ఎంతమందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు? అసలు ఆ ఎంవోయూలో ఏముందో ఎవరికీ తెలీదు. అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ అనే పేరు వింటుంటే.. మూడెకరాల్లో వండర్‌ లా వంటి పెద్ద అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ వెంచర్‌ వస్తుందని ఎవరైనా భావిస్తారు. కానీ అక్కడ జరుగుతున్న నిర్మాణాల తీరు చూస్తే మందు, విందు, చిందు కోసమేనన్నట్లు అర్థమవుతుంది. అందుకే స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

భద్రత లేనిచోట..

పర్యాటకం అభివృద్ధికి తీరప్రాంతంలో బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ లాంటి వేదిక అవసరం. దీనివల్ల తీరప్రాంత పర్యాటకాన్ని ఆకర్షించవచ్చు. అభివృద్ధి చెందుతున్న శ్రీకాకుళం లాంటి నగరంలో పర్యాటకులను ఆకర్షించే ప్రాజెక్టులు లేవు. అరసవల్లి, శ్రీకూర్మం, శాలిహుండం మినహా మరో పర్యాటక ఆకర్షణ లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ అవసరం. అయితే గమ్‌ బీచ్‌ నిర్వాహకుల మెదడులో పుట్టిన ఆలోచన మాదిరిగా కాకూడదు. ఎందుకంటే రాత్రి వేళలో ఎటువంటి భద్రత లేని ప్రాంతంలో ఒక కుటుంబం బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పొల్గొనడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తుతుంది. గమ్‌ బీచ్‌లో రాత్రివేళ పార్టీలు, అసాంస్కృతిక కార్యక్రమాలు, క్లబ్‌ డాన్స్‌లు నిర్వహించడానికి వీలుగా నిర్మాణాలు చేపడుతున్నట్టు స్థానిక యువత ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో అందులోనూ నదిలో వరదలు వచ్చే సమయంలో గమ్‌ బీచ్‌ ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి వెళ్లడానికే వీలు కాదు. ఇప్పటికే గమ్‌ బీచ్‌ కోసం ప్రభుత్వం కేటాయించినట్టు చెబుతున్న మూడు ఎకరాలకు వేసిన హద్దు రాళ్లు కోతకు గురైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భద్రత లేని ప్రాంతంలో రిసార్ట్‌ను ఏర్పాటు చేయడం సబబు కాదని గ్రామస్తులు చెబుతున్నారు.

అనుమతులిస్తే కలెక్టర్‌కే తెలియదా!

ప్రభుత్వ కేటాయించినట్టు చూపించి సీఆర్‌జెడ్‌ పరిధిలోని మూడు ఎకరాల భూమిని ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గమ్‌ బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌కు అనుమతులు ఎవరిచ్చారో జిల్లా అధికారులకే స్పష్టత లేదని వారంటున్నారు. ఆ ప్రాంతానికి వెళితే గానీ తీరప్రాతంలో ఒక నిర్మాణం జరుగుతుందన్న విషయం కలెక్టర్‌కే తెలియకపోవడం గమనార్హం. పర్యాటకాభివృద్ధిలో భాగంగా సర్వహంగులతో ఒక పార్కును అభివృద్ధి చేయాలని 2021లో వైకాపా నాయకులు ఉన్నతాధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాతే గమ్‌ బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌కు బీజం పడిరది. ఇలాంటి వాటిని సాధారణంగా సీ బ్యాక్‌వాటర్‌లో ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంటారు. అధికారులు డీప్‌ వాటర్‌ ఉన్న ప్రాంతంలో నిర్మిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే నిర్మాణం చేస్తున్న ప్రాంతం సముద్రంలో నది కలిసే ప్రాంతం కావడం ఇప్పుడు పెద్ద చర్చకు, వివాదానికి దారితీసింది. పెద్దగనగళ్లవానిపేటలో డీప్‌ వాటర్‌ వచ్చే అవకాశం లేదని గ్రామానికి చెందిన మత్స్యకారులు చెబుతున్నారు. నిరంతర ఆటుపోట్లతో వరదల సమయంలో నది ప్రవాహం దిశ మార్చుకొని గ్రామం చుట్టూ చేరుతుందంటున్నారు. ఈ నిర్మాణం వల్ల భవిష్యత్తులో తీవ్ర నష్టం జరుగుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page