సమంతకు చాలా కాలం అయ్యింది
- Guest Writer
- Jan 10
- 2 min read

సమంత నుంచి తెలుగులో ఓ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. తన ఇమేజ్కి తగిన కథలు రాక కాస్త గ్యాప్ తీసుకొన్న సమంత ఎట్టకేలకు ‘మా ఇంటి బంగారం’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు కథ అందించడం విశేషం. ఈరోజు టీజర్ బయటకు వచ్చింది. టైటిల్ కీ, టీజర్కీ అస్సలు సంబంధమే లేదు. ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమిటంటే సమంత యాక్షన్ మోడ్లో దిగిపోవడం. సమంత చేసిన విన్యాసాలు, ఫైట్స్ నిజంగా అబ్బురపరుస్తాయి. ఓ ఇంటికి కొత్త కోడలుగా వెళ్లిన అమ్మాయి, అక్కడి అలవాట్లు, కట్టుబాట్లకు మెల్లమెల్లగా ఎడ్జిస్ట్ అవుతున్న ఓ కోడలి పిల్ల.. సడన్ గా యాక్షన్ మోడ్ లోకి మారిపోవడం నిజంగా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. సమంత ఎందుకు కత్తి పట్టాల్సివచ్చింది? ఎందుకు గన్ వాడాల్సివచ్చింది? అసలు తన ఇంటెన్షన్ ఏమిటి? ఇంట్లో పిల్లిలా ఉన్న కోడలు పులిలా మారాల్సిన సందర్భం ఎందుకొచ్చింది? అనే విషయాలన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్.
సమంత పెర్ఫార్మెన్స్, ఆ యాంబియెన్స్, పరస్పరం విరుద్ధమైన రెండు అంశాల్ని ఒకే చోట ముడిపెట్టడం లాంటి అంశాలు ఆసక్తిని రేకెత్తించాయి. ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ చూసి, ఇది సంసారపక్షమైన సినిమా అనుకొంటే.. ఇందులోని యాక్షన్ చూసి, అంతా అవాక్కవ్వడం ఖాయం. ఓ స్టార్ హీరోయిన్ యాక్షన్కి పెద్ద పీట వేసిన కథ ఎంచుకోవడం ఎప్పటికీ ఆసక్తికరమే. నేపథ్య సంగీతం కూడా కాస్త వైవిధ్యంగా కుదిరింది. టీజర్ చూస్తే.. సినిమా ఎప్పుడొస్తుందో అనే కుతూహలం కలగాలి. అదైతే ఈ టీజర్ అందించింది.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...
నిర్మాతలు ఇకనైనా మారాలి

బాలీవుడ్లో గత పదేళ్ల కాలంలో భారీ ప్రశంసలు పొందిన సినిమాలకు సీక్వెల్స్ చేయడం బాగా పెరిగింది. కానీ ఈ సీక్వెల్స్లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే వాటి ఒరిజినల్ సినిమాల్లాగా సక్సెస్ అవ్వగలిగాయి. బాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అసలు నిర్మాతలు ఎందుకు కొన్ని సినిమాలకు బలవంతపు సీక్వెల్స్ చేయడానికి ఇష్టపడుతున్నారని ఆడియెన్స్ ప్రశ్నిస్తున్నారు.
సీక్వెల్స్పైనే ఆధారపడ్డ బాలీవుడ్
గతంలో మాదిరిగా కొత్త కథలు, క్రియేటివ్ స్టోరీలను బాలీవుడ్ నిర్మాతలు ఎందుకు పక్కన పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్లో క్రియేటివ్ గా కష్టపడటం, కొత్త కథలపై రిస్క్ తీసుకోవడానికి నిర్మాతలు ఇష్టపడకపోవడం వల్లే ఎక్కువగా సీక్వెల్స్పై ఆధారపడుతున్నారని ట్రేడ్ ఎనలిస్టులు చెప్తున్నారు. బాలీవుడ్ విమర్శకుల ప్రకారం, రీసెంట్గా వచ్చిన ఎన్నో సీక్వెల్స్ కేవలం డబ్బు కోసమే తీశారు తప్పించి, అందులో ఎలాంటి స్టోరీ, స్క్రీన్ ప్లే లేవని, ఆ సీక్వెల్స్ అన్నీ పాత సినిమాలోని జ్ఞాపకాలపైనే ఆధారపడుతున్నాయని అంటున్నారు.
చాలా వరకు ఫెయిలైన సీక్వెల్స్
బాలీవుడ్లో సీక్వెల్స్ కొత్తేమీ కాదు, కానీ ఒకప్పుడు సీక్వెల్స్ అంటే కథకు నిజంగా కొనసాగింపుగా ఉండేవి. కానీ ఇప్పుడది బ్రాండ్ నేమ్పైనే ఆధారపడి ఉంది. ఆ టైటిల్స్ను వాడి కమర్షియల్ సేఫ్టీ కోసమే వాడుతున్నారని అంటున్నారు. వెల్కమ్ బ్యాక్, యమ్లా పగ్లా దీవానా 2, జిస్మ్ 2 లాంటి సినిమాలు కూడా ఇలాంటి ఉద్దేశంతోనే తీశారని, కానీ ఆ సినిమాల్లో ఎక్స్ట్రా అట్రాక్షన్ లేకపోవడంతో అందులో చాలా వరకు ఫెయిల్ అయ్యాయని చెప్తున్నారు.
రిస్క్ చేయకూడదని డిసైడ్ అయిన నిర్మాతలు
కొత్త ఆలోచనలకు, ప్రయోగాలకు సపోర్ట్ చేయడంలో ఎక్కువ రిస్క్ ఉందని భావించిన బాలీవుడ్, ఆ రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదని, అందుకే సీక్వెల్స్పైనే నిర్మాతలు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఎన్నో నష్టాలున్నాయి. ఈ సీక్వెల్స్లో తెలిసిన నటీనటులు, డైరెక్టర్ల నుంచే సినిమాలొస్తాయి తప్పించి కొత్త వారికి అవకాశాలు రావు.
అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఇలాంటి సీక్వెల్ సినిమాలు ఎక్కువగా రావడానికి కారణం మాత్రం ఆడియెన్స్ ఈ తరహా సినిమాలను చూడ్డానికి ఆసక్తి చూపించడమే. కానీ ఇప్పటికైనా బాలీవుడ్ నిర్మాతలు రిస్క్ చేసి డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకోకపోతే బాలీవుడ్ స్థాయి మరింత తగ్గడం ఖాయం.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...






Comments