‘అఖండ’ను దెబ్బకొట్టిన ఈరోస్!
- Guest Writer
- 1 day ago
- 2 min read

దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ`2’ రిలీజ్ వాయిదా పడిరది. ఈ సినిమా విడుదలపై నిన్నంతా కొనసాగిన డ్రామాకి గురువారం రాత్రి తెర పడిరది. బోయపాటి శ్రీను రూపొందిన ఈ చిత్రం వాస్తవానికి శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. ప్లాన్ చేసిన ప్రీమియర్స్ను చిత్ర బృందం రద్దు చేసింది. తాజాగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది.
ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ‘‘అనివార్య కారణాల వల్ల ‘అఖండ 2’ షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదు. ఈ విషయం పట్ల చింతిస్తున్నాం. ఈ క్షణం మాకు చాలా బాధాకరమైనది. ప్రతి అభిమాని, సినీ ప్రేమికుడికి ఇది కలిగించే నిరాశను మేము అర్థం చేసుకుంటాము. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. ఈ నిర్ణయం పట్ల కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరం. అతి త్వరలో సానుకూల నిర్ణయంతో మీ ముందుకు వస్తాం’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.
దీంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చిత్ర నిర్మాతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడుదలపై కోర్టు స్టే గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో కలసి ఈరోస్ సంస్థ మహేశ్బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’, ‘ఆగడు’ చిత్రాలను నిర్మించింది. ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నడుస్తోంది. 14 రీల్స్ సంస్థ నుంచి తమకు రావాల్సిన రూ.28 కోట్లు బకాయిలు ఇప్పించాలని మద్రాస్ హైకోర్టును ఈరోస్ సంస్థ ఆశ్రయించింది.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్లో భాగస్వాములైన రామ్ ఆచంట, గోపీ ఆచంటనే 14 రీల్స్ ప్లస్ సంస్థను కూడా ప్రారంభించారని కోర్టు దృష్టికి తెచ్చింది. తమకు రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లించే వరకు ‘అఖండ’ విడుదలను నిలిపివేయాలని హైకోర్టును కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. దీంతో గురువారం రాత్రి పడాల్సిన ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి. విదేశాల్లోనూ షోలు ఆగిపోయాయి.
ఆ హీరోపై అంత డబ్బా..? ఇది జూదమా.. నమ్మకమా?

పెదకాపు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు విరాట్కర్ణ. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, విరాట్కర్ణకి స్వయంగా బావ. తనని హీరోగా నిలబెట్టాలని పెద్ద కాన్వాస్ లో సినిమా తీశారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. విరాట్ పై ఫ్లాఫ్ ముద్రపడిరది. కాకపోతే ఇప్పుడు విరాట్ చేస్తున్న ‘నాగబంధం’ సినిమా అంతకుమించి అన్నట్టుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అభిషేక్ నామా.
కేవలం క్లైమాక్స్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సినీ వర్గాలు చెప్పడం సోషల్ మీడియా చర్చనీయంశమైయింది. పబ్లిసిటీ గిమ్మిక్ అని కొందరు, ఫ్లాఫ్ హీరోపై అన్ని కోట్లు పెట్టడం అవసరమా? అని ఇంకొందరు, అసలు మార్కెట్ ఎంతో తెలియని హీరోపై అన్ని కోట్లు ఖర్చు చేయడం జూదం అవుతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే అభిషేక్ నామా స్వయంగా నిర్మాత. ఆయనకి ఈ లెక్కలు తెలియనివి కాదు. ఈ సినిమా విషయంలో ఆయన కాన్ఫిడెంట్ గా వున్నారు. డెవిల్ సినిమాకి సమస్య వస్తే మధ్యలో ఆయన డైరెక్షన్ చైర్ ని టేకాఫ్ చేసుకున్నారు. ఎప్పటినుంచో ఆయనకి డైరెక్షన్ చేయాలని వుంది. పైగా ఆయనది ఫైన్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్. ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ కి తగ్గట్టు, హీరో ఇమేజ్ కంటే కంటెంట్ కి ప్రాధాన్యత ఇస్తూ ఈ సబ్జెక్ట్ ని రాసుకున్నారు.
భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాలు, అక్కడి నేలమాళిగలు, రహస్యాల చుట్టూ సాగే కథతో రూపొందిస్తున్నారు. తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ రెడీ చేస్తున్నారు. హీరో మార్కెట్ తో సంబంధం లేకుండా కంటెంట్ నమ్మి చేస్తున్న సినిమా అనే అవగాహన నిర్మాతల్లో మొదటి నుంచి వుంది. సినిమా ప్రమోషన్స్ ని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...










Comments