ఆ ఒక్క ఓవర్ తేడా కొట్టి ఉంటేనా...
- NVS PRASAD

- Mar 6
- 2 min read
మ్యాచ్ని మలుపు తిప్పిన మూమెంట్ అదే!

టీ`20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో టీమిండియా ఫైనల్కి దూసుకెళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2026 వరల్డ్ కప్ని మొదలెట్టిన భారత్, మార్చి 8న న్యూజిలాండ్తో అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో సెమీ ఫైనల్ మ్యాచ్లో 253 పరుగుల భారీ స్కోరు చేసిన భారత జట్టు, కేవలం 7 పరుగుల తేడాతో గెలిచి.. ఊపిరి పీల్చుకుంది.
భారత బ్యాటింగ్లో సంజూ శాంసన్, శివమ్ దూబే, తిలక్ వర్మ మెరుపులు మెరిపించగా ఇంగ్లాండ్ యంగ్ బ్యాటర్ జాకబ్ బెథల్ అద్వితీయమైన సెంచరీతో ఇంగ్లాండ్ని చివరి వరకూ మ్యాచ్లో నిలిపాడు. ఇరు జట్లు కలిసి 499 పరుగులు చేశాయంటే ముంబై వాంఖడే స్టేడియంలో బౌండరీలు ఏ రేంజ్లో కురిసి, అభిమానులను ముద్ద చేశాయో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ స్కోరింగ్ గేమ్లో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ మాత్రం జస్ప్రిత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్.
టర్నింగ్ పాయింట్గా మారిన 17వ ఓవర్...
17 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ విజయానికి 3 ఓవర్లలో 45 పరుగులు కావాలి. అంటే ఓవర్కి 15 పరుగులు చేసినా చాలు. టీ20ల్లో ఇది మరీ పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. ఈ సమయంలో తమ బ్రహ్మాస్త్రం అయిన జస్ప్రిత్ బుమ్రాకి బంతిని అందించాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు జస్ప్రిత్ బుమ్రా. ఓ ఎండ్లో జాకబ్ బెథెల్, మరో ఎండ్లో సామ్ కరన్ వంటి యంగ్ హిట్టర్లు ఉన్నా, ఒక్క బౌండరీ ఇవ్వకుండా కంట్రోల్ చేశాడు. ఈ ఓవర్లో బౌండరీ రాకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. దీంతో సీన్ 2 ఓవర్లలో 39 పరుగులకి మారింది.
హార్ధిక్ పాండ్యా సూపర్ స్పెల్...
జస్ప్రిత్ బుమ్రా పెంచిన ప్రెషర్ కారణంగా 19వ ఓవర్లో సామ్ కరన్ భారీ షాట్కి యత్నించి అవుట్ అయ్యాడు. దీంతో అత్యంత కీలకమైన 19వ ఓవర్లో కూడా ఇంగ్లాండ్ జట్టు 9 పరుగులే రాబట్టగలిగింది. మొదటి బంతికి సిక్సర్ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత 5 బంతుల్లో 3 పరుగులే ఇచ్చి, సామ్ కరన్ వికెట్ తీశాడు. ఈ ఓవర్లో జాకబ్ బెథెల్కి 3 బంతులే ఆడే అవకాశం దక్కింది.
చివరి ఓవర్లో ఇంగ్లాండ్ 30 పరుగులు చేయాలి. క్రీజులో సెంచరీ హీరో జాకబ్ బెథెల్ ఉన్నా, మరో ఎండ్లో అతనికి సరైన సహకారం లేదు. అందులో ధీమాగా శివమ్ దూబేకి బంతిని అందించాడు సూర్యకుమార్ యాదవ్. ఈ టోర్నీలో శివమ్ దూబే బౌలర్గా అట్టర్ ఫ్లాప్. భారీగా పరుగులు సమర్పించాడు. అయితే తొలి బంతికి లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి జాకబ్ బెథల్ రనౌట్ అయ్యాడు. అప్పటిదాకా కొద్దో గొప్పో ఆశలు పెట్టుకున్న ఇంగ్లాండ్ జట్టు, ఇక బెథెల్ వికెట్తో ఓటమిని అంగీకరించింది. ఆర్చర్ ఆఖరి 3 బంతుల్లో 3 సిక్సర్లు బాదినా, ఇంగ్లాండ్ ఓటమిని మాత్రం తప్పించలేకపోయాడు.
ఆర్చర్ లాంటి హిట్టర్ ఉండగా జెమీ ఓవర్టన్ని బెథెల్కి తోడుగా పంపడం కూడా ఇంగ్లాండ్ చేసిన వ్యూహాత్మక తప్పిదంగా మారింది. ఒకవేళ జెమీ ఓవర్టన్ ప్లేస్లో ఆర్చర్ వచ్చి, 19వ ఓవర్లో 2 సిక్సర్లు బాది ఉంటే.. ఆఖరి ఓవర్లో లెక్క మారిపోయి ఉండేది. దాదాపు 500 పరుగులు వచ్చిన రెండో సెమీ ఫైనల్లో బుమ్రా 4 ఓవర్లలో 8.2 ఎకానమీతో 33 పరుగులు ఇస్తే, హార్ధిక్ పాండ్యా 4 ఓవర్లలో 9.5 సగటుతో 38 పరుగులు ఇచ్చాడు.
సత్యం స్పోర్ట్స్ డెస్క్






Intaki turning point over 17 , leka 18