పుట్టలు పెడుతున్న నిర్లక్ష్యం
- DV RAMANA

- 4 days ago
- 1 min read
జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయానికే అనారోగ్యం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అని ప్రభుత్వం నినదిస్తున్నది. కోట్ల రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే సమాజం, కుటుంబం, వ్యక్తిగతంగా మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతాయని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమన్నది సామాజిక బాధ్యత. అందులోనూ తమ పరిధిలోని కార్యాలయాలు, వాటి ఆవరణలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడం.. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బాధ్యత. ప్రజల కోసం కాకపోయినా.. ప్రతిరోజూ ఎనిమిది గంటలకుపైగా తాము విధులు నిర్వహించే ప్రాంగణాలు పరిశుభ్రంగా లేకపోతే ఆరోగ్యపరంగా తమకే నష్టమన్న విషయాన్ని వారు గ్రహించాలి. కానీ దురదృష్టవశాత్తు చాలా కార్యాలయాల్లో ఆ స్ఫూర్తి లోపిస్తున్నది. మిగతా కార్యాలయాల సంగతెలా ఉన్నా.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే కర్తవ్యంగా పనిచేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ ముందు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు అదే జరగడంలేదు.
కావాలంటే ఈ ఫొటోలు చూడండి. శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) కార్యాలయ ప్రాంగణంలోనే పరిసరాలపై నిర్లక్ష్యం పుట్టలు పెడుతున్నది. డీఎంహెచ్వో కార్యాలయం పోర్టికోకు కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న జెండా దిమ్మ చుట్టూ చీమల పుట్టలు పెరుగుతున్నాయి. వీటిని ఇలాగే వదిలేస్తే వాటిలో పాములు చేరే ప్రమాదం ఉంది. ఆ జెండా దిమ్మ కూడా మామోలు పతాకాలు ఎగురవేసేది కాదు. ఏటా స్వాతంత్య్ర దినం, రిపబ్లికే డే ఉత్సవాల నాడు సగర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసేది ఇక్కడే. ఆ రెండు రోజుల్లో తప్ప దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఆ దిమ్మ చుట్టూ పెరుగుతున్న పుట్టలను చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు.. ఆ ప్రాంగణమంతా చెట్ల ఆకులు, ఇతర వ్యర్థాలతో నిండి ఉంటుంది. వైద్యఆరోగ్యశాఖ కార్యాలయమే ఇలా అనారోగ్యకర వాతావరణంలో ఉంటే ఇక ప్రజారోగ్యం ఏం పరిరక్షిస్తారు!






Comments