top of page

‘పరాకు’ పాలన.. పలకలపై ప్రతాపం

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 1 day ago
  • 2 min read
  • కాలువలపై ఆక్రమణలు వదిలేసి..

  • నీరు పారడంలేదని జేసీబీలతో పలకలు పీకేస్తున్న వైనం

  • బళ్లు పడి వాహనదారులు,పాదచారులు గాయాలపాలు

  • షిల్ట్ తీసి కాలువ పక్కనే వారాలకొద్దీ వదిలేయడం..

  • శాశ్వత పరిష్కారం ఆలోచించలేని నగర పాలక అధికారులు

  • ఇదీ శ్రీకాకుళం మున్సిపల్టీ పనితీరు

‘అసలు రోగానికి మందు వేయకుండా... గోరు చుట్టుపై రోకటి పోటు పొడిచినట్లుంది శ్రీకాకుళం నగర పాలక అధికారుల తీరు. నగరాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడానికి కారణమైన బడా ఆక్రమణదారులను తాకే ధైర్యం లేక... సామాన్యుల ఇళ్లు, నలుగురూ నడిచే రోడ్డు మధ్యలో కాలువలపై ఉన్న సిమెంట్ పలకలపై జేసీబీలతో ప్రతాపం చూపిస్తున్నారు. కాలువల్లో నీరు పారడం లేదనే సాకుతో అడ్డగోలుగా పలకలు పీకేస్తూ, రోడ్లను మృత్యుకూపాలుగా మారుస్తున్నారు. ఇటు తీసిన పూడికను రోడ్డు పక్కనే వదిలేస్తూ.. అది మళ్లీ కాలువల్లోకే చేరుతున్నా పట్టించుకోని శ్రీకాకుళం నగరపాలక సంస్థ ‘పరాకు’ పాలనపై ‘ప్రత్యేక కథనం’..


(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

నగరంలో మున్సిపల్ అధికారుల తీరు ‘నక్క ` ద్రాక్ష పళ్లు పులుపు’ అన్నట్లుగా మారింది. అసలు రోగానికి మందు వేయాల్సింది పోయి.. ఉన్న కాస్త ఆరోగ్యాన్ని పాడుచేస్తున్న చందంగా తయారైంది నగర పాలక సంస్థల వ్యవహారం. కాలువల్లో నీరు పారడం లేదనే సాకుతో.. అసలైన ఆక్రమణలను ముట్టుకోలేక, సామాన్యుల ఇళ్ల ముందు, దుకాణాల ముందు, రోడ్డుకు మధ్య ఉన్న సిమెంట్ పలకలపై జేసీబీలతో ప్రతాపం చూపిస్తున్నారు. ఫలితంగా నగర రహదారులు నరకకూపాలుగా మారుతుంటే.. అధికారులు మాత్రం ‘మమా’ అనిపిస్తున్నారు.

ఆక్రమణలు వదిలేసి.. అడ్డగోలు పీకుడు

నగరంలో డ్రైనేజీలు పొంగిపొర్లడానికి ప్రధాన కారణం కాలువలను మింగేస్తూ వెలిసిన బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, రాజకీయ నాయకుల ఆక్రమణలు. వాటి జోలికి వెళ్లడానికి అధికారులకు ‘చేతులు రావు’.. గుండె ధైర్యం చాలదు. కానీ, డ్రైనేజీ పూడిక తీయాలంటూ జేసీబీలను పట్టుకుని రోడ్ల మీదకు వచ్చే సిబ్బందికి సామాన్యుడి ఇళ్లు, నలుగురూ నడిచే రోడ్లు టార్గెట్ అవుతున్నాయి. నీరు పారడం లేదంటూ.. ఇళ్ల ముందు రాకపోకల కోసం వేసుకున్న కాలువ పలకలను అడ్డగోలుగా పీకేస్తున్నారు. తీరా పీకేసిన తర్వాత వాటిని ఎలాపడితే అలా వేసి వెళ్లిపోతున్నారు.

విరుగుతున్న పాదచారులు కాళ్లు

అధికారుల ఈ పరాకు పనుల వల్ల నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తోంది. పలకలు పీకేసిన కాలువలు తెరిచి ఉంచడం వల్ల రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు అందులో పడి తీవ్రంగా గాయపడుతున్నారు. చీకట్లో నడిచే పాదచారుల కాళ్లు ఇరుక్కుని ఫ్రాక్చర్లు అవుతున్నాయి. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఒక సమస్యను పరిష్కరించడానికి పోయి.. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే కొత్త సమస్యను సృష్టించడం అధికారులకే చెల్లింది.

పూడికతీత.. మళ్లీ కాలువల్లోకే!

కాలువల్లోంచి సిల్ట్ (పూడిక) తీసే ప్రక్రియ మరింత హాస్యాస్పదంగా మారింది. కాలువలోంచి తీసిన నల్లటి బురదను రోడ్డు పక్కనే కుప్పలుగా పోస్తున్నారు. దాన్ని వెంటనే తరలించాలనే కనీస జ్ఞానం అధికారులకు ఉండటం లేదు. వారాల తరబడి ఆ బురద రోడ్డుపైనే ఎండిపోతోంది. వాహనాల రాకపోకలతో పొడి ధూళిగా మారి ప్రజల ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. ఇక వర్షం వస్తే.. ఆ ఎండిన బురద కాస్తా మళ్లీ కొట్టుకుపోయి అదే కాలువల్లో పడుతోంది. అంటే.. ప్రజాధనం ఖర్చు చేసి తీసిన పూడిక, మళ్లీ కాలువలోనే చేరుతుందన్నమాట! ఇదెక్కడి ఇంజనీరింగో ఆ దేవుడికే తెలియాలి.

శాశ్వత పరిష్కారం ఏది?

తాత్కాలికంగా జేసీబీలతో హడావుడి చేయడం వల్ల పైసా ఉపయోగం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే అధికారులు ఈ క్రింది చర్యలు చేపట్టాలి:

ఆధునిక ప్రీ-కాస్ట్ డ్రైన్లు :

కాలువలను పూర్తిగా కప్పేయకుండా, ముందే డిజైన్ చేసిన కాంక్రీట్ బాక్స్ డ్రైన్లను నిర్మించాలి. వీటికి అక్కడక్కడా మాన్‌హోల్స్ ఉంచితే.. పలకలు పీకకుండానే లోపలి బురదను వ్యాక్యూమ్ మిషన్ల ద్వారా తీసేయవచ్చు.

వెంటనే తరలింపు :

కాలువలోంచి తీసిన పూడికను 24 గంటల్లోగా నగరం దాటించాలనే కఠిన నిబంధన పెట్టాలి. రోడ్డుపై వదిలేస్తే కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపేయాలి.

ఆక్రమణల తొలగింపు :

రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, డ్రైనేజీ వ్యవస్థకు అడ్డంగా ఉన్న పెద్ద పెద్ద కట్టడాలను కూల్చివేస్తేనే నగరానికి శాశ్వత విముక్తి లభిస్తుంది. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా ‘పలకల’పై ప్రతాపం ఆపి.. శాశ్వత పరిష్కారాల వైపు అడుగులు వేయాలని శ్రీకాకుళం నగర ప్రజలు కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page