top of page

మంగ్లీ ప్రతిష్ట మసకబారుతుంది..I

  • Guest Writer
  • 1 day ago
  • 1 min read

తన గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని మంగ్లీ , ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక నేరారోపణల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ , మైక్రోఫైనాన్స్ స్కామ్ పేరుతో వందల కోట్ల రూపాయల మోసం జరిగిన వ్యవహారంలో బాధితులు అందరూ ఆమె వైపే వేళ్లు చూపిస్తున్నారు. ఈ వ్యవహారంలో బాధితుల పక్షాన నిలబడిన గిరిజన జేఏసీ నాయకులు నేరుగా మంగ్లీనే అంతా చేసిందంటున్నారు.

ఈ భారీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రమావత్ మధుతో కలిసి మంగ్లీ ప్రత్యక్షంగా భాగస్వామి అయ్యారని ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. వందల కోట్ల రూపాయల మైక్రోఫైనాన్స్ కుంభకోణంలో అమాయక గిరిజనులను, సామాన్యులను పెట్టుబడుల పేరుతో నమ్మించి మోసం చేశారని, ఇందులో మంగ్లీ పాత్ర కేవలం ప్రచారానికే పరిమితం కాలేదని, ఆమె ప్రమేయం లోతుగా ఉందని ఆరోపిస్తున్నారు. .

ఆరోపణలు మొదలైన కొత్తలో మంగ్లీ స్పందించిన తీరు కూడా అనుమానాలకు తావిస్తోంది. స్వయంగా డీజీపీని, కమిషనర్‌ను కలిసి తనకు సంబంధం లేదని ఫిర్యాదు చేయడం గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని బాధితులు విమర్శిస్తున్నారు. తన సోదరుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు ఆమె తనకున్న పలుకుబడిని వాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ స్కామ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన ఒక మాజీ మంత్రి మనవడి వద్ద కూడా సుమారు రూ. 80 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. సినిమా సెలబ్రిటీ హోదాను అడ్డుపెట్టుకుని, నమ్మశక్యం కాని లాభాలు చూపిస్తూ ప్రజల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. బాధితులంతా మంగ్లీపై వ్యక్తిగత పగతో కాకుండా, తమ డబ్బు పోయిందనే ఆవేదనతోనే రోడ్డెక్కుతున్నారు.

మంగ్లీ తన పాటల ద్వారా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు మసకబారుతున్నాయి. ఒక కళాకారిణిగా సమాజంలో ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలంటే, ఆమె దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉంది. కేవలం పత్రికా ప్రకటనల ద్వారా తప్పించుకోవాలని చూస్తే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page