అభివృద్ధి.. అక్రమాలు పోటాపోటీ!
- BAGADI NARAYANARAO

- 7 hours ago
- 1 min read
నరసన్నపేటలో వందల వాణిజ్య సముదాయాలు
చాలావరకు అక్రమ నిర్మాణాలేనని ఆరోపణలు
అక్రమార్కులకు రాజకీయ, అధికార అండదండలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
వాణిజ్య కేంద్రమైన నరసన్నపేట మేజర్ పంచాయతీలో అభివృద్ధి, అక్రమాలు పరస్పరం పోటీ పడుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ పట్టణంలో 226 బహుళ అంతస్తుల భó„వనాలను నిర్మించగా వాటిలో 80 శాతం వాణిజ్య సముదాయాలే. అయితే చాలా సముదాయాలకు సరైన అనుమతులు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారులకు పంచాయతీ, రెవెన్యూ అధికారుల సహకారం, రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండటమే దీనికి కారణం. ప్రభుత్వ భూములు, చెరువుల్లో అక్రమంగా నిర్మించిన భవనాలకు పంచాయతీ అధికారులు ఎన్వోసీ, రెవెన్యూ అధికారులు ఎండార్స్మెంట్ ఇచ్చేయడం ద్వారా క్రయవిక్రయాలకు ఆస్కారమిస్తున్నారు. ద్వితీయశ్రేణి నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్వోసీ జారీ చేయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇందిరానగర్ కాలనీలోని సొసైటీ భూముల్లో నివాస సముదాయాల నిర్మాణానికి వీల్లేదని చట్టం ఉన్నా ఖాతరు చేయకుండా అపార్ట్మెంట్లు నిర్మించి విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొందరు నిర్మాణదారులకు గత ఏడాది సుడా అధికారులు నోటీసులు ఇచ్చినా పనులు ఆగలేదు. నరసన్నపేట సుడా పరిధిలో ఉన్నందున నిర్మాణాలకు, వెంచర్లకు దాని అనుమతి తప్పనిసరి. కానీ సుడా అనుమతులు లేకపోయినా పంచాయతీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పట్టణ పరిధిలో వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులు కనుమరుగయ్యాయి. పాత జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ పోరంబోకు భూమిని అక్రమార్కులు విడిచిపెట్టలేదు. పట్టణంలో చెరువులను, పాత జాతీయ రహదారిని ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు, నివాస సముదాయాలు, వ్యాపార కేంద్రాలు నిర్మించినా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదు.






Comments