top of page

ఆత్మస్థైర్యమే ఆమెను నిలబెట్టింది!

  • Guest Writer
  • 4 days ago
  • 3 min read
  • అన్నీ కోల్పోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

  • పిల్లలను చూసి ఆ ప్రయత్నం విరమించుకున్నా

  • పరిస్థితులకు ఎదురెళ్లి ఒంటరి పోరాటం

  • ఓ మహిళ అద్భుత జీవన విజయం

నా పేరు ప్రతిమ. మాది ఒంగోలు దగ్గర్లోని పేర్నిమిట్ట. చిన్నప్పటి నుంచీ బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం చేయాలని అనుకునేదాన్ని. కోరుకున్నట్టే డిగ్రీ అయ్యాక హైదరాబాద్‌లో బ్యాంకు ఉద్యోగం వచ్చింది. హాయిగా చేసుకునేదాన్ని. కానీ ఉన్నట్టుండి ఓ రోజు ఇంటినుంచి ఫోను.. ‘అర్జెంటుగా రా’ అని. తీరా వెళ్తే.. ‘మంచి కుటుంబం, పైగా బోలెడు ఆస్తి ఉంది. ఆ ఇంటికి ఆ అబ్బాయే పెద్ద..’ అంటూ ఓ పెళ్లి సంబంధం గురించి చెప్పారు. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా అంతా మంచి సంబంధం అంటున్నారు. పైగా జీవితానికి ఏ ఢోకా ఉండదని అనిపించి సరే అన్నాను. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదనే మాటా వాళ్లు ముందే చెప్పేశారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేయడం ఇష్టంలేకపోయినా వదిలేసుకున్నా. అయితే వారం రోజుల్లో పెళ్లి అనగా నాన్న చనిపోయారు. పెళ్లి ఆగిపోతుందనుకున్నా కానీ.. దేవుడు నాకు కష్టాలు రాసిపెట్టాడేమో... అందుకే అనుకున్న ముహుర్తానికే మా పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత ఆరు నెలలు ఎలా గడిచిపోయాయో నాకు తెలియలేదు. అంతా సంతోషమే. కానీ ఆ సంతోషం తర్వాతే తెలిసింది ఆయన అసలు రూపం.

అన్నీ దురలవాట్లే..

మందు, అమ్మాయిలూ, పేకాట.. ఇలా ఆయనకు లేని అలవాటు లేదు. చాలా బాధనిపించింది. భార్యని కదా.. వదిలేసి వెళ్లిపోలేను. అందుకే ఆయన్ని మార్చుకోవాలనుకున్నా. నా ప్రయత్నం తెచ్చిన మార్పును చూసి ఇక ఏ ఇబ్బందులూ ఉండవనుకున్నా. ఈలోగా మొదటి పాప కడుపులో పడిరది. నాకు నెలలు నిండేసరికి అమ్మావాళ్లింటికి వెళ్లిపోయా. అత్తయ్య చనిపోవడం.. ఆ తర్వాత కొన్నాళ్లకే కామెర్లు వచ్చి మరిదీ పోవడంతో నా భర్త మానసికంగా కుంగిపోయారు. నేను తిరిగి అత్తింటికి వచ్చేసరికి ఆయన పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. విపరీతంగా తాగడం మొదలుపెట్టారు. దాన్నుంచి ఆయన్ను బయటకు తేవాలంటే ఆ ఊరి నుంచి దూరంగా ఉంటే మంచిదనిపించింది. అందుకే బంధువుల సలహాతో కాపురాన్ని ఒంగోలుకు మార్చుకున్నాం. రోజులు గడుస్తున్నా కానీ ఆయనలో మార్పు రాలేదు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు రెండోపాపకు ఐదు నెలలుంటాయంతే. ఓ రోజంతా ఆయన ఇంటికి రాలేదు. ఆ మర్నాడు కొందరు స్నేహితులు ఫోను చేసి ‘చక్రవర్తి ఎలా ఉన్నాడు’ అని అడగడం మొదలుపెట్టారు. ఎప్పుడూ లేనిది అలా ఫోను చేసేసరికి ఎందుకో భయం వేసింది. కాసేపటికి కొందరు బంధువులూ ఇంటికొచ్చారు. ‘చక్రవర్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు’ అని చెప్పేసరికి నా మెదడు మొద్దుబారిపోయింది. రెండు మూడు రోజులు ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోయాను. కొన్ని నెలలు గది నుంచి బయటకు రాలేదు. పిల్లల్ని చూస్తే ఏడుపొచ్చేసేది. కానీ ఏన్నాళిలా.. వారిద్దరికోసమైనా నేను మళ్లీ మామూలు మనిషిని కావాలనుకున్నా.

ఆధారపడకూడదనుకున్నా..

ఓ రోజు పాపను తిరిగి స్కూల్లో చేర్పించడానికి వెళ్లా. అక్కడ నా విషయం తెలుసుకున్న ఆ స్కూలు యాజమాన్యం ఉద్యోగం ఇస్తామన్నారు. నాకూ ఆసరా ఉంటుంది కాబట్టి వెంటనే చేరిపోయా. కానీ అప్పటి వరకూ ఆయన చేస్తున్న వ్యాపారం కుంటుపడిరది. మీ వారు అప్పులు చేశారంటూ ఒక్కొక్కరూ ఇంటికి రావడం మొదలుపెట్టారు. కందుకూరులో ఉన్న ఓ ఇంటిని అమ్మేసి కొన్ని అప్పులు తీర్చా. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. కుంటుపడిన వ్యాపారాన్ని నడిపించాలనుకున్నా. నమ్మకంగా ఉన్న వ్యక్తే మోసం చేశాడు. తిరిగి నా మీదే తప్పుడు కేసులు బనాయించాడు. తగిన సాక్ష్యాధారాలు చూపించి బయటపడినా రూ.కోటి విలువైన ఆస్తుల్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడే చచ్చిపోవాలనుకున్నా. ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశా. కానీ పిల్లల జీవితం అన్యాయం అవుతుందని వెనకడుగేశా. బాగా ఆలోచించి ఎవరి మీదా ఆధారపడకుండా ఏదైనా చేయాలని అనిపించింది. అందుకే సొంతంగా వ్యవసాయం చేయాలనుకున్నా.

ఇరవై ఎకరాల్లో మొదలుపెట్టా..

ఆయన చనిపోయాక వారి ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు. ఆస్తి అంతా ఉమ్మడిలో ఉండిపోవడంతో నాకు పంచివ్వలేదు. ఆయన బతికున్నంత వరకూ కౌలురూపంలో అయినా కొంత ఆదాయం లభించేది. తర్వాత వాళ్లను అడిగితే ఇస్తామంటారే తప్ప చిల్లిగవ్వ చేతిలో పెట్టేవారు కాదు. పైగా బతుకుతెరువు కోసం వ్యవసాయం చేస్తానంటే.. సమర్థించకపోగా బంధువులు కొందరు ‘ఆడపిల్ల గడపదాటి ఈ పనులన్నీ చేయడం అవసరమా!’ అంటూ పెడర్థాలు తీయడం మొదలుపెట్టారు. కానీ ఆ మాటలు నాకెలాంటి సాయమూ చేయవని సర్దిచెప్పుకున్నా. పుట్టింటివారిచ్చిన ఐదెకరాలకు తోడుగా మరో ఇరవై ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయడం మొదలుపెట్టా. కాలానికి తగినట్లుగా పంటలు వేయడంతో పాటు యూకలిప్టస్‌ కూడా వేశా. ఇదంతా చేస్తూనే ఎంకామ్‌ కూడా పూర్తిచేశా. ఈలోగా పంట చేతికి రావడంతో నా మీద నాకు కొంత నమ్మకం ఏర్పడిరది. అలా వచ్చిన సొమ్ముతో మిగిలి ఉన్న కొంత అప్పు తీర్చా.

నా మీదే తిరగబడ్డారు..

వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా చేయాలని అనిపించింది. అప్పటికే వ్యవసాయం కోసం, అప్పుల కోసం కొంత బంగారాన్నీ అమ్మేశా. మరికొంత తాకట్టుపెట్టి రుణం తీసుకున్నా. అప్పుడే అమ్మమ్మ నా పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఎకరా భూమిని దీనికోసం వాడుకోవాలని నిర్ణయించుకున్నా. డెయిరీ పెట్టేందుకు బ్యాంకు నుంచి పాతిక లక్షలు రుణంగా తీసుకున్నా. ఇది తెలిసి బంధువులూ, ఇరుగుపొరుగూ ‘డెయిరీ అంటే బాగా కష్టపడాలి. ఆడదానివి చేయలేవు. ఆలోచించుకో’ అన్నారు. కానీ ఎంత కష్టమైనా ముందడుగు వేయాలనుకున్నా. కానీ మా పొలానికి చుట్టుపక్కల వాళ్లంతా ‘అక్కడ డెయిరీ పెట్టడానికి వీల్లేదంటే.. వీల్లేదు’ అన్నారు. దాని కట్టడాన్ని ఆపేయమంటూ బెదిరించారు. సర్వేయర్‌ను, కరెంటు ఇచ్చేవారిని అడ్డగించారు. ఒక దశలో అయితే కొట్టబోయారు కూడా. నేను వాటికీ భయపడలేదు. పట్టు వదలకుండా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగేదాన్ని. వాళ్లూ నా బాధను అర్థం చేసుకుని అవకాశం ఇచ్చారు. నిర్మాణం పూర్తయ్యింది. 45 మేలు జాతి గేదెలు, మరో ఇరవై ఆవులను కొని డెయిరీ మొదలుపెట్టా. దాన్నుంచి వచ్చే పాలల్లో 80 శాతం ఓ ప్రైవేటు డెయిరీకి అందిస్తున్నా. తెల్లవారుజామున మూడు గంటలకే నా పని మొదలవుతుంది. పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి తాళం పెట్టి డెయిరీకి వచ్చేస్తా. తిరిగి ఇంటికి చేరుకుని వాళ్లను తయారుచేసి బడికి పంపిస్తా. ఇంకా కొంత అప్పు ఉంది. త్వరలో దాన్నీ పూర్తిచేస్తా. ఇప్పుడు నాకంటూ కొంత ఆదాయం ఉంది. అందరూ కాదన్న చోట.. జాలి చూపించిన చోటే నేను స్థిరంగా నిలబడగలగడం నాకెంతో సంతృప్తినిస్తోంది. పెళ్లి, ఆస్తులు, అంతస్తులు నిలబెట్టలేని నా జీవితాన్ని ఆత్మస్థైర్యమే ఆదుకుందని గర్వంగా చెప్పగలను. అలా కాకుండా ఆత్మహత్య చేసుకుని ఉంటే.. నా పిల్లలు ఏమయ్యేవారో. కానీ ఆ రోజున సరైన నిర్ణయం తీసుకుని ధైర్యంగా సమస్యల్ని ఎదుర్కొన్నందుకు ఇప్పుడు ఆనందంగా ఉంది.

- స్వాతి కొరపాటి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page