కిందపడినా అయ్యగారిదే పైచేయట!
- Prasad Satyam
- 2 days ago
- 1 min read
డీడీ చర్యలకు వ్యతిరేకంగా ఏటీవో స్టేట్మెంట్
దాని ఆధారంగా ఉద్యోగుల పై ఫిర్యాదు కొట్టివేత
అయినా మంకుపట్టు వీడని రవికుమార్
విముక్తి పొందే ఉద్యోగులను చెదరగొట్టే ఎత్తుగడ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ట్రెజరీ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న కుమ్ములాట పతాకస్థాయికి చేరినట్లు కనిపిస్తున్నది. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అన్న విషయం పక్కన పెడితే.. డీడీ రవికుమార్ మాత్రం ఇంకా తనదే పైచేయి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా ట్రెజరీలో సస్పెండ్ అయిన ఉద్యోగులపై ఎస్పీ గ్రీవెన్స్కు డీడీ ఇచ్చిన ఫిర్యాదును ప్రజాగ్రీవెన్స్ క్లోజ్ చేసింది. ఈ ఏడుగురిపైన కొద్ది రోజుల క్రితం డీడీ రవికుమార్ ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. సదరు ఉద్యోగులు తనపై దాడికి పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై విచారించిన పోలీసులు ఏటీవో రమణారెడ్డి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. సస్పెండైన ఉద్యోగులకు ఎటువంటి అనైతిక బ్యాక్గ్రౌండ్ లేదని, రౌడీషీటర్లు కాదని, తన పరిధిలో సిన్సియర్గా పని చేసిన ఉద్యోగులు మాత్రమేనని ఏటీవో తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. దీంతో ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదును కొట్టేశారు. అయితే ఆ ఏడుగురికి అనుకూలంగా ఏటీవో రమణమÖర్తి స్టేట్మెంట్ ఇవ్వడం సరికాదంటూ ఆయనకు డీడీ రవి సరికొత్తగా మరో మెమో జారీ చేశారట. ఈ నెలాఖరుకు రిటైరయ్యే తనకు ఏమిటీ తలనొప్పులు అని మధనపడుతూ ఏటీవో సెలవు పెట్టేశారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిన వనజారాణి ట్రెజరీస్ డైరెక్టర్కు తన నివేదిక సమర్పించారు. ఈమేరకు సస్పెండైన ఏడుగురు ఉద్యోగులను ఒకటి రెండు రోజుల్లో మళ్లీ విధుల్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే డైరెక్టర్ కార్యాలయంలో ఉన్న తన మనుషుల ద్వారా ముందే ఈ విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్ వీరందరిపై సస్పెన్షన్ రివోక్ అయిన వెంటనే చెట్టుకో పుట్టగా ఇక్కడి నుంచి బదిలీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అదే సమయంలో వీరి స్థానంలో శ్రీకాకుళంలో ని తన కార్యాలయానికి తీసుకురావడానికి కొందరితో బేరసారాలు కూడా జరుపుతున్నట్టు ఆరోపణలున్నాయి.






Comments