కలపకు కాళ్లొస్తున్నాయ్!
- BAGADI NARAYANARAO

- Feb 12
- 2 min read
చిన్న వాహనాల్లో రాత్రివేళల్లో అక్రమ రవాణా
మామూళ్ల మత్తులో అ{వీ, పోలీసు అధికారులు
ఇటీవలి కాలంలో ఒక్క కేసూ నమోదుకాని వైనం
తరలిపోతున్న విలువైన టేకు, ఇరిడి రకాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం/కొత్తూరు)
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలి కాలంలో కలప అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి వాహనాలను ఆపి తనిఖీలు చేసేవారు. ఒకవేళ కలప ఉంటే.. దాన్ని తరలించడానికి తగిన అనుమతులు ఉన్నాయా లేదా అని పరిశీలించేవారు. అనుమతి లేకపోతే వాహనాలతో పాటు కలపను సీజ్ చేసి కేసులు నమోదు చేసేవారు. అయితే ఈ ప్రక్రియకు ఎప్ప్పుడో బ్రేక్ పడింది. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు లారీల్లో తరలించే కలపకు మాత్రమే అనుమతులు తీసుకుంటున్నారు. అయితే ట్రాక్టర్లు, బొలేరో పికప్, టాటా మ్యాజిక్ లాంటి చిన్న వాహనాల్లో కలప ఎక్కువగా తరలిపోతున్నా పట్టించుకోవడంలేదు.
జిల్లా నలుమూలలకు రవాణా
ఉమ్మడి జిల్లాలో విరివిగా లభించే టేకు, ఇరిడి కలపను ఏజెన్సీలోని కొత్తూరు, సీతంపేట, భామిని మండలాల నుంచి రాత్రి వేళ చిన్న వాహనాల్లో తరలించుకుపోతున్నారు. ఈ కలపను కొత్తూరు మండల కేంద్రంలోని సామిల్లుల్లో డంప్ చేయడానికి రవాణాదారులు ఒక్కో వాహనానికి రూ.3,500 వసూలు చేస్తున్నారని తెలిసింది. కొత్తూరుకు తరలించే క్రమంలో పోలీసు సిబ్బంది అడ్డగిస్తే వారి చేతిలో కొంత మొత్తం పెట్టి బయటపడిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాతపట్నం రేంజ్ పరిధిలో ఉన్న కొత్తూరు, పాలకొండ రేంజ్లో ఉన్న సీతంపేట, భామిని మండలాల నుంచి కలపను అక్రమంగా సామిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి బ్రోకర్ల ద్వారా జిల్లా నలుమూలలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతం నుంచి ఒడిశాలోని పర్లాకిమిడికి ఆనుకుని ఉండే మెళియాపుట్టి మండల పరిధిలోని వసుంధర, గొప్పిలి, అక్కడి నుంచి పలాస, టెక్కలి ప్రాంతాలకు రవాణా అవుతున్నట్లు తెలిసింది. అలాగే కొత్తూరు నుంచి సారవకోట మండలం బుడితి, నరసన్నపేట మండలం చల్లపేట ప్రాంతాలకు కూడా చేరుతుంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ కలప వ్యాపారం జోరుగా సాగుతోంది. టేకు కంటే ఇరిడి మరింత ఖరీదైనది కావడంతో ఈ రెండింటికీ మంచి డిమాండ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి కలప వ్యాపారులు చేస్తున్న దందాలకు అటవీశాఖ అధికారులు లోపాయికారిగా సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతులు అమ్ముకోవాలంటే సవాలక్ష కొర్రీలు
కొత్తూరు కేంద్రంగా కలప అక్రమ రవాణా అటవీశాఖ అధికారులు, సిబ్బంది కనుసన్నల్లోనే జరుగుతున్నదన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అటవీ సంపదను కాపాడాల్సిన వారే నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ రవాణాకు దన్నుగా నిలుస్తుండటం విమర్శలకు తావిస్తోంది. రాత్రివేళల్లో చిన్న వాహనాల ద్వారా కలపను తరలించుకుపోతున్నా అక్రమార్కులు ఇచ్చే మామూళ్ల మత్తులో పడి అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారని తెలిసింది. కళ్లముందే వాహనాలు దర్జాగా చెక్పోస్టు దాటి వెîళ్లిపోతున్నా ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రైతులు తమ పొలం గట్లపై పెంచే టేకు చెట్లను కోసి విక్రయించాలంటే సవాలక్ష నిuంధనలు పెట్టి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటారు. కానీ నేరుగా అటవీ ప్రాంతాల నుంచే అనుమతులూ లేకుండా పెద్దమొత్తంలో రవాణా చేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. పోలీసు శాఖలోని దిగువ స్థాయి సిబ్బంది అటవీ సిబ్బందితో కుమ్మక్కై కలప అక్రమ రవాణా చేస్తున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం కేవలం కొత్తూరు, సీతంపేట, భామిని మండలాలకే పరిమితం కాలేదు. జిల్లా అంతటా కలప అక్రమ రవాణా చేసే ముఠాలు విస్తరించి ఉన్నాయి.






Comments