యువతరం శిరమెత్తితే..!
- DV RAMANA

- 4 hours ago
- 3 min read

దేశ రాజకీయాలు కొత్త పుంతల తొక్కుతున్నాయి. ప్రజల మనోభావాల్లో కూడా యువోత్సాహం తొణికిసలాడుతన్నది. ఈ మార్పులకు సంకేతం ఢిల్లీ పీఠాన్ని వణికించిన జెన్జీ ఉద్యమంగా చెప్పవచ్చు. మన దేశ రాజకీయాలను పరిశీలిస్తే తొలి నుంచీ యువతరం పాత్ర నామమాత్రంగానే కనిపిస్తుంది. ప్రాతినిధ్యం వహించిన కొద్దిపాటి యువ నేతలు కూడా రాజకీయ కుటుంబాలకు చెందినవారో, ప్రముఖుల వారసులో కావడం మొదటి నుంచీ కొనసాగుతన్నది. కానీ నీట్ లీకేజీ బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తూ 26 రోజులపాటు ఢిల్లీ జంతర్ కేంద్రంగా సాగిన ఉద్యమం దేశంలో జెన్జీ ప్రభావం, ప్రాధాన్యత పెరుగుతున్నాయనడానికి నిదర్శనం. దేశ యువత ఎప్పుడూ ఈ స్థాయిలో ఏకోన్ముఖంగా ఉద్యమించడం, రోజుల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ఒక కేంద్రమంత్రి చేతే రాజీనామా చేయించడం, ఉద్యమకారుల మిగతా డిమాండ్లకు సైతం ప్రభుత్వం అంగకరించడం చూస్తే ఇకముందు దేశ రాజకీయాల్లో జెన్జీ పాత్ర నిర్ణయాత్మకంగా ఉండబోతున్నదని అర్థమవుతుంది. ఈ పరిణామాలు యువత పోరాటం స్ఫూర్తికి, వారి పట్టుదలకు అద్దం పట్టాయి. భారత ప్రజాస్వామ్యం ఒక కీలక మార్పు దిశగా అడుగులు వేస్తున్నదని, దాన్ని నిర్దేశించే శక్తిగా జెన్జీ ఎదుగుతున్నట్లు స్పష్టమవుతుంది. 1995`2010 మధ్య కాలంలో జన్మించినవారిని జెన్జీ తరంగా పరిగణిస్తున్నారు. ఇటువంటి వారందరూ 2026 నాటికి 14 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులుగా ఉండవచ్చు. దేశ రాజకీయాలను, ఎన్నికలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే వర్గంగా ఎదుగుతోంది. దేశంలో ఈ తరం ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. 2024 లోక్సభ ఎన్నికల నాటికి మన దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 96.88 కోట్లు. వీరిలో 19`29 మధ్య వయసున్న ఓటర్లు సుమారు 22 కోట్ల మంది.. అంటే 22.78 శాతం ఉన్నారు. వీరిలోనూ తొలిసారి ఓటు హక్కు పొందిన 18`19 ఏళ్ల ఓటర్ల సంఖ్య 1.85 కోట్లు, 20`29 ఏళ్ల మధ్య ఓటర్లు 19.74 కోట్లకుపైగా ఉన్నారు. ఈ గణాంకాలు ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్దేశించే విషయంలో జెన్జీ ఓటర్ల ప్రాధాన్యత పెరుగుతున్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఓటుహక్కు వినియోగించుకోవడంలో, వివిధ అంశాల్లో ప్రభుత్వాలపై పోరాటం చేయడం, ఒత్తిడి తేవడంలో పెద్దగా ఉత్సాహం చూపేవి కావు. జెన్జీ తరం దృష్టంతా చదువు, కెరీర్, జీవితంలో స్థిరపడటంపైనే ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే నీట్ లేకేజీ వ్యతిరేక ఉద్యమం ఆ అభిప్రాయాలను పటపంచలు చేసేసింది. ఇకముందు వారు మరిన్ని అంశాలపై ఉద్యమించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మొత్తం ఓటర్లలో జెన్జీ వాటా 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో వీరి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. దాద్రానగర్ హవేలి, డామన్, డయÖ్యలో వీరి వాటా 39 శాతం కాగా, మేఘాలయలో 36 శాతం వరకు ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వృద్ధ జనాభా అధికంగా ఉన్నందున జెన్జీ ఓటర్ల సంఖ్య 18`20 శాతం మధ్యే ఉంది. ఇప్పటివరకు యువ ఓటర్లు పోలింగులో పూర్తిస్థాయిలో పాల్గొనడం లేదన్న అంచనాలు ఉంది. అయినప్పటికీ 2014, 2019 ఎన్నికల్లో అభివృద్ధి, ఉపాధి, జాతీయత తదితర అంశాలపై కేంద్రీకరించిన బీజేపీకి యువత నుంచి గణనీయ మద్దతు లభించింది. కానీ దానికి విరుద్ధంగా 2024 నాటికి కూడా పరిస్థితులు మెరుగు పడకపోగా ఉపాధి అవకాశాల కొరత, ఆర్థిక మందగమనం, జీవన వ్యయం పెరుగుదల వంటి సమస్యలు యువత ఆలోచనలను ప్రభావితం చేశాయి. దాని ఫలితంగానే ఆ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని పాలక ఎన్డీయే కూటమికి అనేక నియోజకవర్గాల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రతిపక్షాలకు అనుకూలత ఏర్పడటంతో గతం కంటే ఎన్డీయేకు సీట్లు తగ్గిపోయాయి. జెన్జీ ఓటర్లు పాతతరం ఓటర్ల మాదిరిగా ఏదో ఒక పార్టీ మద్దతుదారులుగా పరిమితం కావడంలేదు. వాస్తవ అంశాలు, సమస్యల ఆధారంగా ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. అందువల్ల ఇంతకుముందులా యువతరం ఎదుర్కొంటున్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఎదురుదెబ్బలు తప్పవు. ప్రస్తుతం జెన్జీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. అనేక అధ్యయనాల ప్రకారం దేశంలో నిరుద్యోగుల సంఖ్య 20 నుంచి 25 శాతం వరకు నమోదవుతున్నది. విద్యావ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, వ్యవస్థాగత లోపాలు కూడా యువతలో ఆందోళన పెంచుతున్నాయి. ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో అక్రమాలు, మÖల్యాంకనంలో లోపాలు వారిలో అసంతృప్తి పెంచుతున్నాయి. జెన్జీలో రాజకీయ అవగాహన, ఆసక్తి ఉన్నప్పటికీ అవి ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఓట్లుగా మారడం లేదు. ముఖ్యంగా తొలి ఓటర్ల పోలింగు శాతం ఇప్పటికీ పుంజుకోవడం లేదు. వీటన్నింటినీ అధిగమించే ఉత్ప్రేరకంలా తాజా విజయం ద్వారా నీట్ లీకేజీ వ్యతిరేక ఉద్యమం కచ్చితంగా పని చేస్తుంది. దేశం నలుమÖలల నుంచి స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా నవతరం చైతన్యవంతమైంది. ఈ స్ఫూర్తి, చైతన్యం, శక్తితో రాజకీయంగా క్రియాశీలం అయ్యే అవకాశాలు లేకపోలేదు. వారి ఆకాంక్షలను నిర్లక్ష్యం చేసే పార్టీలు రాజకీయంగా భారీ మÖల్యం చెల్లించుకోక తప్పదేమో. ఆధునిక సమాచారం సాంకేతికత మధ్య పెరిగిన ఈ తరం యువత అందుబాటులో ఉన్నత విద్య, సమాన అవకాశాలు, పారదర్శక పాలన, నాణ్యమైన ఉద్యోగాలను మాత్రమే ఆశిస్తున్నాయి. ఇంతకుముందులా రాజీపడి జీవించడం కాకుండా భారత భవిష్యత్తును నిర్దేశించే శక్తిగా మన జాతి, మన ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్దేశించే నిర్ణయాత్మక శక్తిగా మారేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. దీన్ని గుర్తించి ప్రభుత్వాలు మాటలు, హామీలతో సరిపెట్టకుండా వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంది. లేనిపక్షంలో ఇప్పుడు గెలిచిన కాక్రోచ్లే ముందు ముందు మరో అవతారం ఎత్తవచ్చు.






Comments