top of page

రైలు పట్టాలపై రాలిన జీవితాలు

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 3 hours ago
  • 1 min read
  • ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం

  • పలాస రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన..

  • శోకసంద్రంలో చలమయ్యపేట

(సత్యంన్యూస్, కోటబొమ్మాళి)

ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన పలాస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మృతులను కోటబొమ్మాళి మండలం తర్లిపేట పంచాయతీ చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల పూజిత (35), ఆమె కుమారుడు కుశాంత్ (8), కుమార్తె దీక్షిత (6)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాళి ఎసఐ వంగపండు సత్యనారాయణ వారి నివాసానికి వెళ్లి ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..

గేదెల పాపమ్మ కుమారుడు వెంకటి, కోడలు పూజిత, వారి పిల్లలు కుశాంత్, దీక్షితతో కలిసి గత కొంతకాలంగా కుటుంబ పోషణ నిమిత్తం విజయవాడలో నివసిస్తున్నారు. ఇటీవల పిల్లలకు వేసవి సెలవులు రావడంతో స్వగ్రామమైన చలమయ్యపేటకు వచ్చారు. ఈ క్రమంలో వెంకటి తల్లి పాపమ్మ అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఉండటంతో, తాను పనుల నిమిత్తం విజయవాడకు వెళ్లి వస్తానని, ఇంటి వద్ద ఉండి తన తల్లిని చూసుకోవాలని భార్య పూజితకు చెప్పాడు. అయితే తాను గ్రామంలో ఉండలేనని, విజయవాడకు వచ్చేస్తానని పూజిత భర్తకు ఫోన్‌లో తెలిపింది. ఈ విషయంలో దంపతుల మధ్య మాటా మాట పెరిగింది. దీంతో పూజిత తన పుట్టింటి గ్రామమైన భావనపాడుకు వెళ్తానని చెప్పి గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని చలమయ్యపేట నుంచి బయలుదేరింది. ఈ విషయాన్ని వెంకటి తన అత్త అన్నపూర్ణకు తెలియజేయగా, తమ కుమార్తె, మనవళ్లు ఇంటికి రాలేదని ఆమె తెలిపింది. అనంతరం గురువారం సాయంత్రం అన్నపూర్ణ కుటుంబ సభ్యులతో కలిసి చలమయ్యపేటకు వచ్చి, పూజిత, పిల్లల ఆచూకీ కోసం గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. అయితే భావనపాడుకు వెళ్తానని చెప్పి బయలుదేరిన పూజిత, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని పలాస రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రంతా పిల్లలతో అక్కడే గడిపిన ఆమె, శుక్రవారం ఉదయం ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది.

చలమయ్యపేటలో తీవ్ర విషాదం

ఇద్దరు పిల్లలతో కలిసి పూజిత మృతి చెందిన వార్త శుక్రవారం ఉదయం గ్రామంలో దావానలంలా వ్యాపించింది. ఎప్పుడూ అందరితో కలిసిమెలిసి ఉండే ఆ తల్లి, పిల్లలు ఒక్కసారిగా మృతిచెందారన్న వార్తను కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముద్దుముద్దుగా ఉండే చిన్నారులు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page