116 మందికి జీతాలు బకాయి.. నలుగురికే వరం
- Prasad Satyam
- 1 day ago
- 1 min read
ఏవోను విచారించిన త్రీమెన్ కమిటీ
వేతనాల ఫైల్ మాయం.. డీఎంహెచ్వో కార్యాలయంలో కలకలం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న 120 మంది ఎంఎన్వో, ఎఫఎన్వోలకు చెల్లించాల్సిన జీతాలు సకాలంలో ఇవ్వలేదన్న కలెక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు ఏవో బాబూరావు బృందంపై త్రీమెన్ కమిటీ విచారణ గురువారం డీఎంహెచ్వో కార్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
మే నెలలో అందాల్సిన జీతం జూన్ వచ్చినా అందలేదని ఈ నెల ఒకటిన ఇచ్ఛాపురానికి చెందిన ఒక ఉద్యోగి గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 120 మందిలో కేవలం నలుగురికి మాత్రమే వేతనాలు జమ చేసి, మిగతావారికి వేతనాలు చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ నలుగురు కూడా ఏవో బాబూరావు చుట్టూ ఉన్నవారేనన్న అభియోగం కూడా ఉంది. ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ ఏవో బాబూరావును పిలిచి అదే రోజు వివరణ కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని పిలిపించి బిల్లులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఎక్కడ అని ప్రశ్నించారు. ఎంఎన్వో, ఎఫఎన్వో మే నెల వేతనాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్పై సంతకాలు పెట్టలేదని ఆమె ్పువాబిచ్చారు. మే నెలలో వేతనం చెల్లించాలంటే ఏప్రిల్ 20 లోపు బిల్లు తయారుచేసి ట్రెజరీకి అందించాలి. జూన్ నెల వచ్చినా ఎంఎన్వో, ఎఫఎన్వోల వేతనాలు ఎందుకు చెల్లించలేదని చీవాట్లు పెట్టారు. నలుగురికి మాత్రమే బిల్లు పెట్టి మిగతా 116 మందికి ఎందుకు బిల్లు పెట్టలేదని బాబూరావును కలెక్టర్ ప్రశ్నించారు. నలుగురు వేతనాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఎవరిచ్చారని కలెక్టర్ ప్రశ్నించగా, డీఎంహెచ్వో అనిత తాను ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. దీనిపై ఏవో బాబూరావు పొంతన లేని సమాధానం చెప్పడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఎంఎన్వో, ఎఫఎన్వోల వేతనాలకు చెందిన ఫైల్ తీసుకురావాలని ఆదేశించారు. గడువు ఇచ్చినా ఫైల్ తీసుకురాకపోవడంతో కలెక్టర్ ఎంఎన్వో, ఎఫఎన్వోల వేతనాల చెల్లింపులపై ముగ్గురు సభ్యులతో ఒక విచారణ కమిటీ వేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విచారణ కమిటీలో ఆర్డీవో ప్రత్యూష, డీసీహెచ్ విజయలక్ష్మీ, టెక్కలి మైన్స్ ఏడీ ఉన్నారు. విచారణలో గుమస్తా జగదీష్, సూపరింటెండెంట్ శివకుమార్, ఏవో బాబూరావులను ప్రశ్నిస్తే నాలుగు నెలలుగా ఎంఎన్వో, ఎఫఎన్వో జీతాల చెల్లింపులో తాత్సారం జరుగుతుందని తేలిందని భోగట్టా. ఈ`ఫైలింగ్ ద్వారా కాకుండా కేవలం కాగితాల మీద కథ నడపడంతో బ్యాక్ డేట్తో సంతకాలు పెట్టి నాటకమాడాలని ప్రయత్నించారు. ఎప్ప్పుడైతే కలెక్టర్ దృష్టికి ఈ ఫిర్యాదు వెళ్లిందో, మేనేజ్ చేయలేక చేతులెత్తేశారు. గుమస్తా జగదీష్ మాత్రం ప్రతీనెల బిల్లులు సూపరింటెండెంట్కు పంపిస్తున్నారని, అక్కడి నుంచి ఏవో బాబూరావు వరకు జరగాల్సిన తతంగంలోనే కొందరికి చెల్లింపులు, మరికొందరికి వేధింపులు జరిగాయని గుర్తించినట్టు భోగట్టా.





Comments