అక్రమాల ఘనుడిపై ఎందుకంత ఇంట్రస్ట్?
- NVS PRASAD
- 3 days ago
- 3 min read
మమ్మల్ని ఫోన్లలో బెదిరిస్తున్నారు
నా అన్న చావుకు కారణమయ్యారు
నన్ను అన్నం తినకుండా చేశారు
సారవకోట ఎస్ఐపై ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘‘మొబైల్ నెంబరు 80746 94222 నుంచి మే 31న సారవకోట పోలీస్స్టేషన్ నుంచి ఏఎస్ఐని మాట్లాడుతున్నానంటూ నాకో ఫోనొచ్చింది. ఎస్ఐ గారు మాట్లాడాలి కాబట్టి.. నువ్వు స్టేషన్కు రావాలి అన్నది దాని సారాంశం. నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వివరించినప్పటికీ నాతో దురుసుగా మాట్లాడి బెదిరించారు.’’
‘‘మళ్లీ జూన్ 2వ తేదీన 94413 46669 నెంబరు నుంచి సారవకోట ఎస్ఐని మాట్లాడుతున్నానని చెప్పి ఓ వ్యక్తి నాతో దురుసుగా మాట్లాడారు. ‘వరుదు విజయలక్ష్మి (భర్త రాఘవేంద్ర) అనే ఆమె బంగారాన్ని మీ ఇద్దరు అన్నదమ్ములు దొంగిలించినట్లు ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారని, ఎస్పీ ఆఫీసు నుంచి ఆర్డర్ వచ్చినందున బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారానికి సంబంధించి లెక్కలు చెప్పాలని’ ఆ ఫోన్ సారాంశం.’’
‘‘తనపై కంప్లైంట్ ఉంటే నోటీసులిచ్చి విచారించుకోవాలని చెబితే దురుసుగా మాట్లాడారని, అలుదులో ఉండాల్సిన నువ్వు సవిరిగాంలో ఎందుకున్నావని ప్రశ్నించారని, వరుదు రాఘవ అంటే ఎందుకు అంత ఇంట్రస్ట్ అని తాను తిరిగి ప్రశ్నించడంతో కాల్ కట్ చేశారని సోమవారం ఎస్పీ గ్రీవెన్స్లో చెట్టు ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి అడిషనల్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.’’
ప్రజంట్ సిట్యుయేషన్
సోమవారం గ్రీవెన్స్లో ఎస్పీని కలిసి స్వయంగా సారవకోట పోలీసులపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తి లుంగీ, ఓ చారల చొక్కాతో ఉన్నాడు. ఎస్పీ వద్దకు వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పోలీసులు గ్రీవెన్స్ ఛాంబర్కు పంపుతారు. అలా తనిఖీ చేస్తుంటే ఆయన శరీరంపై రెండు బ్యాగులు కనిపించాయి. ఆ రెండూ కూడా ఆయన బతకడానికి అత్యంత ఆవశ్యకమైనవి. నోటి ద్వారా ఆహారం తీసుకోలేకపోతుండటం వల్ల శరీరానికి అవసరమైన శక్తినందించడానికి డాక్టర్లు వేసిన ఆహారపు పైప్ ఒకటి కాగా, యూరినరీ ట్రాక్ కూడా పాడవడంతో మూత్రం బయటకు పోవడానికి వేసిన మరో బ్యాగ్ కనిపించింది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎస్పీని కలిసి తమ గోడు విన్నవించుకోవాలనుకున్న ఆయన బాధను అర్థం చేసుకున్నా.. ఎస్పీ మహేశ్వర్రెడ్డి లేకపోవడంతో అడిషనల్ ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసేంత వరకు వీరిని కూర్చోబెట్టి మరీ వీరి బాధను సావధానంగా విన్నారు. మార్చి 26న తన గ్రామానికి చెందిన వరుదు రాఘవేంద్ర, ఆయన భార్యతో పాటు మరికొందరి కారణంగా తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని, ఇది చూసిన తన తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించి నన్ను బతికించారు కానీ, నా పరిస్థితి చూసి బెంగతో ఉన్న నా అన్నను ఆస్పత్రికి వచ్చి మరీ బెదిరించడం వల్ల అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడని, దీనిపై సారవకోట పోలీస్స్టేషన్లో తన తండ్రి ఫిర్యాదు చేస్తే రిపోర్టు తీసుకోలేదని అడిషనల్ ఎస్పీకి ఆ వ్యక్తి వివరించారు. అనారోగ్యంతో గత ఐదు రోజులుగా తన అత్తగారి ఊరైన జలుమూరు మండలం సవిరిగాంలో ఉంటున్నానని, అక్కడి నుంచి న్యాయపోరాటం కోసం ప్రయత్నిస్తుండగా ఏఎస్ఐ, ఎస్ఐల పేరుతో రెండు నెంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన అడిషనల్ ఎస్పీని అభ్యర్థించారు.
కొన్ని నెలలు వెనక్కు వెళితే..
ఈ ఏడాది మార్చి 26న సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన చెట్టు ఉమామహేష్ బహిర్భూమికి వెళ్లి టాయిలెట్ యాసిడ్ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఉమామహేష్ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పడంతో ఆయనతో పాటు ఉన్న సోదరుడు సూర్యనారాయణ అదే గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని తనువు చాలించాడు. ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించింది ఉమామహేష్ అయితే సూర్యనారాయణ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని అనుమానాలు వ్యక్తం కాగా.. వారు బెట్టింగులకు పాల్పడ్డారని, అప్పులు చెల్లించలేక ఆత్మహత్యకు ప్రయత్నించారని ప్రచారం చేశారు. అన్నదమ్ముల్లో ఉమామహేష్ బతికి బట్టకట్టడంతో ఇప్పుడు అనేక కుట్రకోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఎవరీ వరుదు రాఘవేంద్ర?
సారవకోట మండలం అలుదు గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సిట్టింగ్ జెడ్పీటీసీగా ఉన్న మహిళ కొడుకే ఈ వరుదు రాఘవేంద్ర. ఈయన అక్రమ మైనింగ్ చేస్తున్నాడని ఎప్పట్నుంచో ఆరోపణలున్నాయి. తాజాగా మే 23న టెక్కలి ఆర్డీవోకు ఈయన మీద లిఖతపూర్వకంగా ఫిర్యాదు కూడా అందింది. కోటబొమ్మాళి మండలం చినసాన పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 340లో ఎలాంటి అనుమతులు లేకుండా వరుదు రాఘవేంద్ర అక్రమ మైనింగ్ చేస్తున్నారని, దీన్ని ఆపాలని కోటబొమ్మాళి సర్పంచ్ పావని, పలువురు వార్డు మెంబర్లు ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సర్వే నెంబరులో గతంలో కొందరికి ప్రభుత్వం డి`పట్టా ఇచ్చిందని, కానీ వారికి ఎటువంటి పరిహారం చెల్లించకుండానే వరుదు రాఘవేంద్ర, తర్రా కృష్ణారావు, పొట్నూరు తిరుపతిరావు, కోరంగి విమలారావు, ఇట్టరాగుల అప్పన్నలు భారీ యంత్రాలతో గ్రానైట్ బ్లాక్లు తవ్వి సుమారు రూ.2 కోట్ల మేరకు సొమ్ము చేసుకున్నారని మే 24న సాక్షి పత్రికలో కథనం వచ్చింది. ఇక్కడ ‘సాక్షి’ కథనాన్నే ఎందుకు ఉటంకిస్తున్నామంటే రాఘవేంద్ర తల్లి వైకాపా జెడ్పీటీసీ సభ్యురాలు. అక్రమంగా మైనింగ్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని, అలాగే రాళ్లు తీస్తున్న ప్రాంతంలో 1998లో ప్రభుత్వం డి`పట్టా ఇచ్చినప్పటికీ దౌర్జన్యంగా తవ్వకాలు జరుపుతున్నారని, దీనిపై మైన్స్ శాఖ, విజిలెన్స్ చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఇప్పుడు తాజాగా రాఘవేంద్ర భార్య ఫిర్యాదు చేశారంటూ సారవకోట పోలీసుల పేరుతో ఫోన్ చేసి బెదిరించడం, ఉమామహేశ్వరరావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకపోవడం, మైనింగ్ అక్రమమంటూ స్వయంగా గ్రానైట్ కొండ ఉన్న ఏరియా సర్పంచ్, వార్డు మెంబర్లు ఆర్డీవోకు, మైన్స్ శాఖకు ఫిర్యాదు చేయడం, అంతకు ముందే ఉమామహేశ్వరరావు ఆత్మహత్యకు ప్రయత్నించడం, ఆయన సోదరుడు సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటే.. అక్రమ మైనింగ్కు, ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి, మరో యువకుడి అకాల మరణానికి ఎక్కడో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. వరుదు రాఘవేంద్ర తవ్వుతున్న గ్రానైట్ కొండల్లోనే చనిపోయిన సూర్యనారాయణ, ఆత్మహత్యకు ప్రయత్నించిన ఉమా మహేశ్వరరావులు పని చేయడమో లేదా వాటాదారులుగా ఉండటమో జరిగివుంటుంది. సూర్యనారాయణ చనిపోయి ఉమామహేశ్వరరావు బతకడంతో ఇప్పుడు పోలీసుల అండతో నిజాలు బయటకు రాకుండా చేయాలన్న ప్రయత్నాలేవో జరుగుతున్నాయి. అందుకే ఇద్దరు చిన్న పిల్లలు, భార్య, వృద్ధ తల్లిదండ్రులతో కలిసి శ్రీకాకుళం వరకు వచ్చి ఎస్పీ గ్రీవెన్స్లో ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. అసలు సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా చంపేశారా? ఉమామహేశ్వరరావు టాయిలెట్ యాసిడ్ ఎందుకు తాగాల్సివచ్చింది? అసలు క్వారీలు ఎవరి పేరు మీద ఉన్నాయి? ఆర్థిక లావాదేవీలు నిర్వహించినదెవరు? అసలు రాఘవేంద్ర వ్యాపారాలేంటి? వాటి అనుమతులు ఎవరి పేరున ఉన్నాయి? వంటి ఆధారాలు దొరికితే ఆత్మహత్యలు/హత్యలు ఎందుకు జరిగాయో తెలుస్తుంది. ప్రస్తుతం ఎస్పీ మహేశ్వర్రెడ్డి సెలవులో ఉన్నారు. త్వరలోనే ఈ కేసుకు ముగింపు వస్తుందని ఆశిద్దాం.
Comments