అడవిలో అన్న.. ఇక పాత నినాదం!
- SATYAM DAILY
- Dec 3, 2025
- 2 min read

అడవిలో అన్నల తుపాకీ మోత ఆగిపోయిందా? ఐదు దశాబ్దాలకు పైగా భారత అంతర్గత భద్రతకు సవాలుగా నిలిచిన ‘ఎర్ర’ సామ్రాజ్యం కూలిపోయిందా? కేంద్ర హోంశాఖ తాజా నివేదికలు, క్షేత్రస్థాయి పరిస్థితులు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు తన ‘‘చివరి దశ’’లో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 180 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టుల ప్రాబల్యం, నేడు గణనీయంగా తగ్గి కేవలం 11 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. అందులోనూ చత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, నారాయణ్పూర్ జిల్లాల్లో మాత్రమే వారి ఉనికి కాస్త బలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘‘ట్రేస్, టార్గెట్, న్యూట్రలైజ్’’ విధానం సత్ఫలితాలను ఇస్తోందనడానికి గణాంకాలే సాక్ష్యం. 2004-14 మధ్య కాలంతో పోలిస్తే, 2014-24 మధ్యలో హింసాత్మక ఘటనలు ఏకంగా 53 శాతం తగ్గాయి. సంఖ్యాపరంగా చూస్తే, గతంలో 16,463గా ఉన్న దాడుల సంఖ్య, 7,700కు తగ్గడం మావోయిస్టుల పతనానికి అద్దం పడుతోంది. ముఖ్యంగా ‘ఆపరేషన్ కగార్’ ద్వారా భద్రతా దళాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. 2025లో మావోయిస్టు మిలిటరీ చీఫ్ హిడ్మా, జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు వంటి అగ్రనాయకత్వాన్ని భద్రతా దళాలు మట్టుబెట్టడం దళాలకు కోలుకోలేని దెబ్బగా మారింది. నాయకత్వ లేమి, భద్రతా దళాల ఒత్తిడి కారణంగా లొంగుబాట్లు భారీగా పెరిగాయి. ఒక్క 2025లోనే 1,639 మంది మావోయిస్టు కేడర్లు లొంగిపోవడం గమనించదగ్గ పరిణామం. కేవలం తుపాకీతోనే కాకుండా, ‘అభివృద్ధి’ అనే ఆయుధంతోనూ ప్రభుత్వం మావోయిస్టులను దెబ్బకొడుతోంది. మావోయిస్టుల కంచుకోటల్లోకి ప్రభుత్వం ‘3-సి’ ఫార్ములాతో (రోడ్డు, మొబైల్, ఆర్థిక కనెక్టివిటీ) చొచ్చుకుపోతోంది. గత దశాబ్దంలో 14,607 కి.మీ.ల రోడ్లు నిర్మించడంతో పాటు, వేల సంఖ్యలో 4జి టవర్ల ఏర్పాటుతో అటవీ ప్రాంతాలకు బయటి ప్రపంచంతో అనుసంధానం ఏర్పడిరది. ఏకలవ్య పాఠశాలలు, బ్యాంక్ శాఖల ఏర్పాటుతో గిరిజనులకు ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. దీంతో ‘ప్రజలు నీరు-మా సైన్యం చేప’ అనే మావోయిస్టుల సిద్ధాంతం నీరుగారిపోతోంది. భద్రతా బలగాలపై మెరుపుదాడులు చేయడం, మందుపాతరలు (ఐఈడీఎస్) పేల్చడం వంటి గెరిల్లా యుద్ధ తంత్రాలకు మావోయిస్టులు ప్రసిద్ధి. 75 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను ఒకేసారి అంతం చేసిన దంతెవాడ మారణహోమం వంటి ఘటనే ఇందుకు సాక్ష్యం. అయితే, భద్రతా దళాలు ఇప్పుడు అత్యాధునిక సాంకేతికత, డ్రోన్ల వినియోగం, పటిష్టమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో నక్సల్స్ వ్యూహాలను తిప్పికొడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే, నక్సల్బరీలో పుట్టిన ఈ సాయుధ పోరాటం అస్తమించే సమయం ఆసన్నమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, తుపాకీ తూటాలు ఆగినంత మాత్రాన శాంతి రాదు. దశాబ్దాలుగా ఉన్న గిరిజన సమస్యలు, భూ పంపిణీ అసమానతలు పరిష్కరించినప్పుడే నిజమైన విజయం సాధ్యమవుతుంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న చత్తీస్గఢ్ను పూర్తిగా కేంద్ర బలగాలు దిగ్బంధించడం వల్ల ఆంధ్రాను సేఫ్జోన్గా మార్చుకోడానికి ఒకానొక సమయంలో మావోలు ప్రయత్నించారన్న వాదన ఉంది. అందుకు హిడ్మా దంపతులు మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ కావడం, పదుల సంఖ్యలో వారి సభ్యులు విజయవాడ, కాకినాడ వంటి అర్బన్ ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఏపీ పోలీసులకు చిక్కడం వంటివి మనం ఉదాహరణలుగా చూడొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మావో మూమెంట్ అంతరించిపోయిందని అంతా రిలాక్స్ అయిన మూడ్లో ఏపీ, తెలంగాణ మళ్లీ తమకు హెడ్క్వార్టర్లు కాగలవని మావోలు భావించడం వల్లే ఆంధ్రా అడవుల్లో, అర్బన్ ప్రాంతాల్లో బహుశా కనిపించారేమో? ఆదివాసీ ప్రాంతాల్లో టెక్నాలజీని అందించడం ద్వారా మావోల కదలికలను అదే టెక్నాలజీతో కనిపెట్టగలిగారు. ఇటీవల ఆంధ్రాలో కూడా అడవులు దట్టంగానే అల్లుకున్నాయి. మళ్లీ ఎప్పటి మాదిరిగానే ఇక్కడ షెల్టర్ జోన్ ఏర్పాటుచేసుకోవాలని చూసిన ఆంధ్రా పోలీసులు మావో అధినేత హిడ్మాను ఎన్కౌంటర్ చేశారు. ఇందులో ఇంటెలిజెన్సీ విజయం ఒకవైపు కనిపిస్తుంటే, విజయవాడ నడిబొడ్డులో కొందరు ఇళ్లు అద్దెకు తీసుకొని మావోలు ఉండటం వారి వైఫల్యాన్ని మనకు పట్టిచూపిస్తుంది. ఏది ఏమైనా ఇంటెలిజెన్సీ వ్యవస్థ గతం కంటే చాలా గట్టిగా పని చేసిందనడం సబబు. జనవరి 31 నాటికి అన్ని ప్రాంతాల్లో మావోలు లొంగిపోతామని ప్రకటించడం వెనుక బహుశా మావోల ఎత్తుగడ ఉండకపోవచ్చు. ఎందుకంటే.. వ్యూహం రచించే స్థాయిలో ఇప్పుడు ఆ ఉద్యమంలో నేతలు లేరు. ఒక నంబాళ్ల కేశవరావు గాని, టెక్ శంకర్ గాని, వాటిని అమలుచేసే హిడ్మా లాంటివారు లేరు. కేవలం బాహ్య ప్రపంచంలో బతకలేక మావో సిద్ధాంతాలతో సంబంధం లేని ఏ కొందరో మిగిలిపోయారు. అరకొర మేధావులు అందులో ఉంటే ఉండొచ్చు. కానీ వారికి అవసరమైన బలం, బలగం రెండూ ఇప్పుడు లేవు. దీంతో గతంలో నక్సల్స్ పేరు మీద గాని, ఇప్పుడు మావోల పేరుతో గాని ఉన్న ఈ ఉద్యమం పూర్తిగా అణగారిపోయినట్టే. 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మావోలను చర్చలకు పిలిచినప్పుడు హైదరాబాద్ మంజీరా గెస్ట్హౌస్లో వారికి అకామిడేషన్ ఇచ్చారు. అన్నలను కలవడానికి ఒక ముఖ్యమంత్రికి విన్నపాలు ఇచ్చినవారికంటే ఎక్కువ సంఖ్యలో జనాలు రావడం అప్పుడున్న నక్సల్ మూవ్మెంట్ నడతకు నిదర్శనం. చర్చలు విఫలమైన విషయం పక్కన పెడితే, నిజాం గ్రౌండ్స్లో నక్సల్స్ నాయకులతో జరిగిన బహిరంగ సభకు జంటనగరాలు మొత్తం జనాలతో నిండిపోవడం అప్పటి ఉద్యమంపై జనాలుకు ఉన్న అభిప్రాయానికి నిదర్శనం. ఆ తర్వాత కాలంలో జనాలూ మారారు. మావోలూ మారారు.










Comments