అమ్మా నీకు వందనం
- NVS PRASAD

- 4 days ago
- 2 min read
ఆశగా ఎదురుచూస్తున్న మార్కెట్లు
కొన్ని నెలలుగా స్తబ్ధుగా ఉన్న వ్యాపారాలు
క్యాష్ ఫ్లో మీదే వర్తకుల ఆశలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్ప్పుడో కుదేలైపోయింది. ఆ మాటకొస్తే దేశంలోనే అడుగంటిపోయింది. తెలంగాణతో పోలిస్తే మన ప్రాంతంలో కొంత నయం. సాఫ్ట్వేర్ రంగంలో అనిశ్చితి వల్ల వ్యాపారాలన్నీ పడుకొన్నాయి. గడిచిన సంక్రాంతి తర్వాత ఇంతవరకు చెప్ప్పుకోదగ్గ స్థాయిలో ఎక్కడా వ్యాపారాలు సాగడంలేదు. దానికి అదీ ఇదీ అని తేడా లేదు. స్కూళ్లు తెరవడం వల్ల యÖనిఫారాలు, పుస్తకాలు, బ్యాగులు, షూల వ్యాపారం ఈమధ్య నెల రోజులపాటు సాగినా, మిగిలిన వ్యాపారాల పొయ్యిలో పిల్లులు పడుకున్నాయి. ఇప్ప్పుడు అందరి ఆశ మరో రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 64,47,190 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో ఏకంగా రూ.10,12,078 కోట్లు జమ కానుంది. ఇప్ప్పుడు దీనిపైనే వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో మొదటి టెర్మ్ ఫీజు కట్టేసి తల్లిదండ్రులు పిల్లల్ని చేర్చేశారు. ప్రభుత్వ పాఠశాలలకైతే ఆ అవసరం లేదు. యÖనిఫాం దగ్గర్నుంచి అన్నీ ఫ్రీ. పేరుకే పిల్లల్ని చదివించడానికి తల్లులకు సొమ్ములిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా వాస్తవం మాత్రం ఒక దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు తల్లికి వందనం లాంటి పథకం ద్వారా వచ్చిన సొమ్ము ఏదో ఒక కష్టాన్ని ఒడ్డెక్కించడానికే. దీనివల్ల రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారాలకు ప్రయోజనం కలగకపోవచ్చు గాని, చిన్న చితక వ్యాపారులకు టర్నోవర్ మొదలవుతుంది. తల్లికి వందనం సొమ్ములు విడుదలైతే కొనుగోలు చేయాల్సిన జాబితా ఇప్పటికే అన్ని కుటుంబాలు సిద్ధం చేసుకున్నాయి. అదే సమయంలో పాత బకాయిలు తీర్చడానికి కూడా కొందరు సిద్ధపడుతున్నారు. తల్లికి వందనం కింద రూ.13వేలు ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం జమ చేస్తుంది. ఒక ఇంటిలో అర్హులు ఎంతమంది ఉన్నా ఈ స్కీమ్ వర్తింపజేస్తుండటం వల్ల కొందరికి ఇది పెద్ద బెనిఫిట్గానే ఉంది. తల్లికి వందనం సొమ్ములు పడితే స్కూలుకు వెళ్లడానికి సైకిళ్లు కొనుక్కుంటామని కొందరు విద్యార్థులు ‘సత్యం’కు తెలపడమే ఇందుకు నిదర్శనం. ఇది కాకుండా తల్లి ఖాతాలో సొమ్ములు పడుతున్నాయి కాబట్టి దీనిపై సర్వహక్కులూ తనవేనన్న భావన తల్లికి ఉండటం సహజం. ఆషాడమాసం సహజంగానే చీరలపై డిస్కౌంట్ ఉంటుంది. కానీ అది ఎంత పర్సంట్ అనేది ఇంతవరకు రాష్ట్రంలో పేరుమోసిన అనేక వ్యాపార సంస్థలు ప్రకటించలేదు. తల్లికి వందనం సొమ్ములు రొటేషన్ బట్టి మనీ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందో చూసి ఆ మేరకు ఆఫర్లు ప్రకటించి సొమ్ములు చేసుకోవాలని చూస్తున్నారు. చివరకు దసరా, దీపావళి బొనాంజాలంటూ ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లిచ్చే కార్పొరేట్ సంస్థలు కూడా తల్లికి వందనం సొమ్ములు పడ్డాక కొత్త ఆఫర్లు ప్రకటించడానికి సిద్ధపడుతున్నాయి. కేబుల్ టీవీలు రాని గ్రామీణ ప్రాంతాల్లో డిష్లు ఏర్పాటు చేసుకుంటారు. చివరకు వీరు కూడా జులై చివరి వారంలో ఆంధ్రాలో ఆఫర్లు ప్రకటించడానికి సిద్ధపడ్డారు. వ్యవసాయం ఆలస్యంగా మొదలవడంతో చాలా గ్రామాల్లో ఇది పెట్టుబడిగా కూడా మారిపోనుంది. ఇంతవరకు డైలీ ఫైనాన్స్ కింద అప్ప్పులు తీసుకుని వ్యవసాయం చేసేవారు. కానీ ఈసారి దుక్కులు సమయానికి తల్లికి వందనం అందుతుండటంతో మార్కెట్ కళకళలాడబోతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈసారి అదనంగా ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలకూ ఈ పథకాన్ని వర్తింపజేయడం, 47,555 మంది అంగన్వాడీ మహిళా కార్యకర్తలకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయడంతో మార్కెట్లో పెద్దఎత్తున మనీ సర్క్యులేట్ కానున్నట్టు అంచనాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ సొమ్ములు పడిన తర్వాత పది రోజుల పాటు మార్కెట్ కళకళలాడుతుందనడంలో సందేహం లేదు.






Comments